సాక్షి,పాడేరు: కొత్త పాడేరు గ్రామంలో గిరిజన మహిళ కిముడు జానకి ఏర్పాటు చేసుకున్న ’పెరటి అలంకార చేపల పెంపక కేంద్రాన్ని కలెక్టర్ టి.నిశాంతి గురువారం ప్రారంభించారు. గిరిజన మహిళలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా మత్స్యశాఖ ఈ యూనిట్ను మంజూరు చేసింది. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన, ధర్తీ అబా జన్జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకాల కింద ఈ యూనిట్ను ఏర్పాటు చేశారు. మొత్తం రూ. 1.97 లక్షల వ్యయం కాగా, అందులో 90 శాతం నిధులను రాయితీ రూపంలో కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని అధికారులు తెలిపారు. స్వయం ఉపాధి దిశగా గిరిజన మహిళలు అడుగులు వేయడం అభినందనీయమని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి డాక్టర్ పి.శ్రీనివాసరావు, జిల్లా మత్స్యశాఖ అభివృద్ధి అధికారి జి.మురళీకృష్ణ, మత్స్యశాఖ అసిస్టెంట్ వీరబాబు తదితరులు పాల్గొన్నారు.


