ముంచంగిపుట్టు: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతమైన ఒనకఢిల్లీలో గురువారం మధ్యాహ్నం భారీ వృక్షం నేలకూలడంతో రాకపోకలు గంటల తరబడి నిలిచిపోయాయి. స్థానిక డీఏవీ పాఠశాల సమీపంలో ఈదురుగాలులకు భారీ చెట్టు రోడ్డుకు అడ్డంగా పడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీనివల్ల మాచ్ఖండ్ ప్రాజెక్టుకు వెళ్లే ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అదే రోజు ఒనకఢిల్లీలో వారపు సంత కావడంతో వ్యాపారులు, ప్రజలు రాకపోకలకు తీవ్ర అవస్థలు పడ్డారు. సమాచారం అందుకున్న ప్రాజెక్టు సివిల్ అధికారులు వెంటనే స్పందించి, రోడ్డుపై పడిన చెట్టును తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. అయితే, చెట్టు నేలకూలే సమయంలో సమీపంలోని విద్యుత్ స్తంభాలపై పడటంతో అవి దెబ్బతిన్నాయి. అలాగే విద్యుత్ వైర్లు సైతం తెగిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న మాచ్ఖండ్ విద్యుత్ కేంద్రానికి చెందిన డిస్ట్రిబ్యూషన్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, తెగిపోయిన వైర్లను, దెబ్బతిన్న స్తంభాలను పునరుద్ధరించే పనుల్లో నిమగ్నమయ్యారు.


