● ఓటర్ల సర్వేలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
● జేసీ తిరుమణి శ్రీపూజ హెచ్చరిక
సాక్షి,పాడేరు: కేంద్ర,రాష్ట్ర ఎన్నికల కమిషన్లు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ తిరు మణి శ్రీపూజ హెచ్చరించారు. బుధవారం ఆమె కలెక్టరేట్లోని తన కార్యాలయంలో మాట్లాడుతూ సర్వే రిపోర్ట్ను తక్కువగా నమోదు చేయడంతో పాటు ఓటరు ఎన్యూమరేషన్ ఫారంను డిజిటలైజేషన్ చేయడంలో కొంతమంది నిర్లక్ష్యం చేశారని తెలిపారు. జి.మాడుగుల మండలంలో 8మంది, కొయ్యూరులో 8 మంది బీఎల్వోలు, ఒక సూపర్వైజర్, గూడెంకొత్తవీధిలో 7, పాడేరులో 7, చింతపల్లిలో 5గురు చొప్పున మొత్తం 36మందిని గుర్తించి, నోటీసుల జారీకి ఆదేశాలు ఇచ్చామన్నారు. ఎన్నికల అధికారుల పనితీరుపై ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్కు నివేదికలు పంపుతున్నామన్నారు. విధుల పట్ల అలసత్వం వహించే వారిపై చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.
బూదరాళ్ల బీఎల్వోపై విచారణ
కొయ్యూరు: బూదరాళ్ల బీఎల్వోగా విధులు నిర్వహిస్తున్న సచివాలయ డీఏ బాబురావు పనితీరుపై మండల ప్రత్యేకాధికారి, డీఎల్పీవో పీఎస్ కుమార్ బుధవారం విచారణ చేపట్టారు. జేసీ ఆదేశాల మేరకు ఆయన వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటరు నమోదు (సర్వే) ప్రక్రియలో బీఎల్వో పనితీరు సరిగా లేదని జేసీ గుర్తించారని, నిర్లక్ష్యం వీడకుంటే సస్పెన్షన్ తప్పదని హెచ్చరించారని తెలిపారు. ప్రతి బీఎల్వో రోజుకు కనీసం వంద ఎన్యూమరేషన్ ఫారంను ఓటర్లకు పంపిణీ చేసి, వాటిని వెంటనే డిజిటలైజేషన్ చేయాలని ఆదేశించారు. ఈ నెల 14తో ఓటరు నమోదు ప్రక్రియ ముగియనున్నందున, గడువులోగా ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ నెల 14 వరకు పంచాయతీ కార్యదర్శులు విధిగా తమ కార్యాలయాల్లోనే ఉండాలని, బీఎల్వోలకు సహకరించాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంపీడీవోప్రసాదరావు పాల్గొన్నారు.


