● అల్లాడుతున్న గిరిజన గ్రామాలు
● తీవ్ర ఇబ్బందుల్లో రైతులు
ముంచంగిపుట్టు: గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మండలంలో జనజీవనం స్తంభించిపోయింది. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. లక్ష్మీపురం పంచాయతీలో నిర్వహించే వారపు సంతకు వర్షం తీవ్ర ఆటంకం కలిగించింది. వాగులు, గెడ్డలు పొంగిపొర్లుతుండటంతో మారుమూల గ్రామాల నుంచి గిరిజనులు సంతకు రాలేకపోయారు. సంత ప్రాంగణం అంతా బురదమయంగా మారడంతో పాటు, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేక సంతకు వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు మాకవరం, జోలాపుట్టు, దొడిపుట్టు, కర్రిముఖిపుట్టు, పనసపుట్టు పంచాయతీల్లోని పలు గ్రామాల్లో పంట పొలాలు భారీగా నీట మునిగాయి. దీంతో గిరిజన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్రిముఖిపుట్టు పంచాయతీ నందిమెట్ట గ్రామంలో పాంగి మొన్ని అనే గిరిజనుడి ఇంటి పైకప్పు రేకులు గాలికి ఎగిరిపోగా, మట్టి గోడ కూలిపోయింది. అయితే, ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. జరిగిన నష్టానికి ఆర్థికంగా దెబ్బతిన్నానని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధితుడు మొన్ని కోరారు.


