డుంబ్రిగుడ: గిరిజన గ్రామాల్లో ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేసేలా అధికార యంత్రాంగం కృషి చేయాలని పాడేరు డివిజన్ ఆర్డీవో భుజంగరావు ఆదేశించారు. బుధవారం ఆయన మండలంలో పర్యటించారు. ఇందులో భాగంగా ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలను సందర్శించి, అక్కడ ఎదురవుతున్న సమస్యలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ప్రాంగణానికి తగిన రక్షణ కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, పాఠశాల సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టరుకు నివేదిస్తామని ఆయన తెలిపారు. అనంతరం, ఓటరు నమోదు ప్రక్రియలో భాగంగా అరకు పంచాయతీ కేంద్రంలో జరుగుతున్న పనులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఓటరు నమోదులో ఏమాత్రం అలసత్వం వహించకూడదని, ఇంటింటికీ వెళ్లి ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఓటరు నమోదులో వారిని భాగస్వాములను చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కోటేశ్వరరావు, ఎంపీడీవో సీతయ్య, డీటీ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
పాడేరు ఆర్డీవో భుజంగరావు


