మద్దిలపాలెం: గజల్ విద్వాంసుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ తన గానంతో విశాఖ వాసులను ఉర్రూతలూ గించారు. విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో గజల్ శ్రీనివాస్ను గజల్ కళాభారతి పురస్కారంతో కళాభారతి ట్రస్ట్ ప్రతినిధులు ఎం.ఎస్.ఎన్.రాజు, గుమ్మూలూరి రాంబాబు, పైడా కృష్ణప్రసాద్ సత్కరించారు. వైస్ అడ్మిరల్ కె.శ్రీనివాస్, స్పిరిట్యుయల్ గురు మౌలానా అమిర్ ఉద్దీన్ మలక్ సాహెబ్, స్థానిక వస్త్ర వ్యాపార అధిపతి శ్రీ మల్లిక్, అధ్యక్ష, కార్యదర్శులు రూ.20 వేలు నగదు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా కళాభారతి ట్రస్ట్ కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ మూడు సార్లు గిన్నిస్బుక్ ప్రపంచ రికార్డు అందుకుని, 150 భాషల్లో గజల్స్ పాడుతూ, అనేక దేశాల్లో గజల్ కార్యక్రమాలు చేస్తూ అందరి మన్ననలు పొందిన తెలుగు తేజం డాక్టర్ గజల్ శ్రీనివాస్ అని కొనియాడారు. గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇప్పటికే తనకు కొన్ని వందల బిరుదు సత్కారాలు జరిగాయన్నారు. కళలకు నిలయమైన కళాభారతి పేరుతో గజల్ కళాభారతి అనే సత్కారం మొదటిసారి అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. అనంతరం జరిగిన గజల్ గాత్ర కచేరీలో ఆయన పలు గజల్స్ పాడి శ్రోతలను మైమరపించారు. భారతం, భాగవతం, రామాయణం, వంటి పుణ్య గ్రంథాల నుంచి క్లుప్తంగా గానం చేసి ఆధ్యాత్మికత భావాన్ని కల్పించారు.


