ఆరిలోవ: దళిత డప్పు కళాకారుడు నాగులాపల్లి రాందాస్పై దాడి చేసిన స్పీకర్ అయ్యన్నపాత్రుడుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి అరెస్ట్ చేయాలని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి జిల్లా ఎస్సీ విభాగం పరిశీలకుడు అల్లంపల్లి రాజుబాబు డిమాండ్ చేశారు. పోలీసులు సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలన్నారు. మద్దిలపాలెంలో పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వంలో దళితులపై దాడులు, హత్యలు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. నిన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు నర్సీపట్నంలో మరిడిమాండ జాతరలో దళిత డప్పుకళాకారుడి చెంపపై కొట్టారు..మొన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఆకివీడులో దళిత పేటలో శ్రీరామనవమి వేడుకలో 300 మంది కిరాయి రౌడీలతో దళితలపై దాడులు చేయించి, వీరిలో 57 మంది దళిత యువకులపై హత్యాయత్న కేసులను బనాయించారన్నారు. ఇద్దరూ గౌరవమైన రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి దళితలపై దాడులకు పాల్పడడం హేయమన్నారు. ఇటీవల దళితుడైన మంద సాల్మాన్ హత్య చేశారని, రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు, దళిత మహిళపై సదరు ఎమ్మెల్యే అనుచరుడు నడిరోడ్డుపై దాడికి పాల్పడ్డాడని వాపోయారు. ప్రభుత్వం తీరు మారకుంటే వచ్చే ఎన్నికల్లో దళితులంతా తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు.


