దేవరాపల్లి: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గరిశింగి సచివాలయంలో ఏఎన్ఎంగా విధులు నిర్వర్తిస్తున్న జి.రాజ్యలక్ష్మి పాడేరులో శుక్రవారం ఆత్మహత్యకు యత్నించిన ఘటనపై జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి (డీఐవో) చంద్రశేఖర్దేవ్ స్థానిక పీహెచ్సీలో శనివారం విచారణ జరిపారు. పీహెచ్సీ వైద్యాధికార్లు ఈ.పూజ్యమేఘన, డి.వనజల నుంచి ఆయన వివరాలను సేకరించారు. స్థానిక పీహెచ్సీ హెల్త్ సూపర్వైజర్ పుష్పరాజ్ వేధింపులకు గురి చేయడంతోనే తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిసింది. హెల్త్ సూపర్వైజర్ వేధింపులపై ఇటీవల స్థానిక ఎంపీడీవోకు సైతం ఏఎన్ఎం రాజ్యలక్ష్మి ఫిర్యాదు చేసినట్లు స్థానిక పీహెచ్సీ వైద్యులు తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు సూపర్వైజర్ను అదే రోజు మరో సబ్సెంటర్కు తాత్కాలింగా మార్పు చేశామని స్థానిక పీహెచ్సీ వైద్యాధికారి పూజ్యమేఘన తెలిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న హెల్త్ సూపర్వైజర్ పుష్పరాజ్ను సైతం ప్రశ్నించారు. ఆత్మహత్యకు యత్నించిన రాజ్యలక్ష్మి ఆరోగ్య పరిస్థితిని పాడేరు వైద్యులు, బంధువులను అడిగి తెలుసుకుంటున్నామని డీఐవో చంద్రశేఖర్దేవ్ తెలిపారు. ఆమె ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిన అనంతరం పూర్తి స్థాయిలో విచారణ చేపడతామన్నారు. కాగా ఎనిమిది నెలలు క్రితం ఆమె బదిలీపై దేవరాపల్లి పీహెచ్సీకి వచ్చారు.


