సీలేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా ఒడిశా–పోలవరం సరిహద్దు సీలేరు గుంటవాడ రిజర్వాయర్ వద్ద వాటర్ ఏరోడ్రోమ్ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం గురువారం గ్రామసభ నిర్వహించనున్నట్టు తహసీల్దార్ అన్నాజీరావు చెప్పారు. ఈ మేరకు సీలేరులోని మారెమ్మ తల్లి ఆలయం ఎదురుగా ఉన్న ఘాట్ను ఆయన బృందంతో కలిసి పరిశీలించారు. సర్పంచ్ దుర్జోను కలిసి స్థానిక వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ అన్నాజీరావు మాట్లాడుతూ వాటర్ ఏరోడ్రోమ్ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం ఏపీ జెన్కో కల్యాణమండపంలో నిర్వహించనున్న గ్రామసభకు జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ హాజరుకానున్నట్టు చెప్పారు. ప్రజల సహకారంతో ఈ ప్రాజెక్టు పూర్తయితే అల్లూరి జిల్లాకు రాష్ట్రంలోనే మంచి గుర్తింపు వస్తుందని, పర్యాటకంగా మరింత ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు.


