పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా
అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు విమర్శ
పాడేరు : కూటమి ప్రభుత్వ పాలనలో గిరిజనాభివృద్ధి శూన్యమని జిల్లాలోని గిరిజన గ్రామాలకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్య్సరాస విశ్వేశ్వరరాజు విమర్శించారు. మండలంలోని మారుమూల కించూరు పంచాయతీ వంటివీధుల, గొండెలి పంచాయతీ వంచెడిగొంది గ్రామాలను గురువారం ఆయన సందర్శించారు. ఇంటింటా వెళ్లి గిరిజనులను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలు, ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ప్రధానంగా రక్షిత తాగునీరు, రహదారి సదుపాయాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేవని గ్రామస్తులు ఆయన దృష్టికి తెచ్చారు. సమస్యలను సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో వివక్ష చూపుతున్న కూటమీ ప్రభుత్వానికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ మద్దతుదారులను గెలిపించి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. పార్టీ మండల అద్యక్షుడు సీదరి రాంబాబు, సర్పంచ్లు వంతాల రాంబాబు, సోమెలి లక్ష్మణరావు, మండల యువజన విభాగం అధ్యక్షుడు గుల్లెల లింగమూర్తి, సీనియర్ నేతలు ముదిలి సత్యనారాయణ, పలాసి రామారావు, సింహాచలం, అల్లాడ అశోక్ పాల్గొన్నారు.


