రాజేంద్రపాలెం వైద్యాధికారి జగదీష్ నాయక్ మానవత్వం
కొయ్యూరు: అంబులెన్స్ వెళ్లడానికి దారి లేదు.. కనీసం నడవడానికి సరైన బాట లేదు.. కానీ ఆ గిరిజనుల ఆరోగ్యం కోసం ఆ వైద్యుడు వెనకడుగు వేయలేదు. మండలంలోని రాజేంద్రపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ జగదీష్ నాయక్ గురువారం మారుమూల గ్రామాల్లో పర్యటించి తన సేవా గుణాన్ని చాటుకున్నారు.
అడవి బాటలో అడుగులు..
బూదరాళ్ల పంచాయతీ పరిధిలోని చల్దిగెడ్డ, కొత్తపల్లి గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేదు. దీంతో ఆయన తన బృందంతో కలిసి కొండలు, వాగులు దాటుకుంటూ కిలోమీటర్ల మేర నడిచి వెళ్లారు. ఆ రెండు గ్రామాల్లోని సుమారు 50 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను పంపిణీ చేశారు. ఇంటింటికీ తిరుగుతూ గిరిజనులకు ఆరోగ్య సూత్రాలను వివరించారు. వాతావరణ మార్పుల వల్ల వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. కలుషిత నీటిని తాగరాదని, నీటిని కాచి వడపోసి తాగాలని సూచించారు. నిల్వ ఉంచిన మాంసం, ఇతర ఆహార పదార్థాలను తినడం వల్ల అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ సేవా కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. కష్టతరమైన బాటలో నడిచి వచ్చి తమకు వైద్యం అందించిన వైద్యాధికారిని గ్రామస్తులు కొనియాడారు.


