ప్రజాగ్రహం
పాడేరు: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజాగ్రహం పెల్లుబికింది. వైఎస్సార్సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. వైఎస్సార్సీపీ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం అంచనాలకు మించి సూపర్ సక్సెస్ అయింది. సంతకాల ప్రతులను విజయవాడకు తరలించేందుకు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో పాడేరులో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి సినిమాహాల్ సెంటర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం, పాత బస్టాండ్, మెయిన్ బజారు మీదుగా పట్టణ శివారు వీఆర్ ఫంక్షన్ హాల్ వరకు సుమారు రెండు కిలో మీటర్లు ర్యాలీ సాగింది.
ఈ ర్యాలీలో వైఎస్సార్సీపీ శ్రేణు లు, గిరిజనులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని చంద్రబాబు సర్కార్ తీరును ఎండగట్టా రు. వేలాదిగా తరలివచ్చిన ప్రజలు, పార్టీ శ్రేణులతో జిల్లా కేంద్రం కిక్కిరిసిపోయింది. చంద్రబాబు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పార్టీ చేపట్టిన ర్యాలీ కార్యక్రమాన్ని చిత్రీకరించేందుకు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఏర్పాటు చేసిన డ్రోన్ కెమెరాను పోలీసులు ఉద్దేశపూర్వకంగా నిలిపివేశారు.
వాహనాన్ని ప్రారంభించిన నాయకులు
సేకరించిన కోటి సంతకాల ప్రతులను విజయవాడకు తరలించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాన్ని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మాజీ ఎమ్మెల్యేలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, చెట్టి పాల్గుణ వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
ఉద్యమాలు చేపడతాం
జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు పెట్టి తమ నిర్ణయాన్ని ప్రకటించారన్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తే వైఎస్సార్సీపీ చూస్తూ ఊరుకోబోదని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామన్నారు. జిల్లాలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ విజయవంతమైందన్నారు.
పేదల పక్షాన వైఎస్సార్సీపీ
మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ నిత్యం పేదల పక్షాన ఉంటూ వారి సంక్షేమం కోసమే పని చేస్తుందన్నారు. ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తే, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమంతో పాటు ప్రజారోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. ప్రజలంతా తగిన సమయంలో గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
ప్రజా వ్యతిరేక విధానాలకుపాల్పడుతున్న సర్కార్
అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందన్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య అధికమైందన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వైఎస్సార్సీపీ నాయకులు, పార్టీ శ్రేణులపై అక్రమ కేసులను బనాయిస్తూ భయపెడుతోందని చెప్పారు. వైఎస్సార్సీపీ నిత్యం ప్రజల పక్షానే ఉంటూ ఉద్యమాలు చేస్తుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్ల కాలంలో రాష్ట్ర ప్రజలు చేసిన మేలు ఏమి లేదని చెప్పారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే.. ప్రైవేటుపరం చేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను తిరిగి ప్రజలకు అప్పగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ మండల అధ్యక్షులు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్ష, కార్యదర్శులు, పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు.
భారీ ఎత్తున ర్యాలీలో పాల్గొన్న ప్రజలు, పార్టీ శ్రేణులు
స్వార్థ ప్రయోజనాల కోసమే ప్రైవేటీకరణ
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కోసమే ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన సంతకాలను పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి ఈనెల 18న రాష్ట్ర గవర్నర్కు అందజేయనున్నట్టు చెప్పారు.
ప్రజా తిరుగుబాటు తప్పదు
పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సొత్తయిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేసే హక్కు చంద్రబాబు ప్రభుత్వానికి లేదన్నారు. ప్రైవేటీకరణపై ప్రజా తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాల కూడా ఏర్పాటు చేయలేదని చెప్పారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తే జీర్ణించుకోలేని చంద్రబాబు ప్రభుత్వం వాటిని ప్రైవేట్పరం చేయటానికి పూనుకోవడం దుర్మార్గమన్నారు.
చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ పోటెత్తిన జనం
వైద్య సేవలు కష్టతరమే
వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేస్తే పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలందడం కష్టతరంగా ఉంటుంది. పీపీపీ విధానాన్ని అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకించారు. వైఎస్సార్సీపీ చేపట్టిన ఉద్యమాలకు మా మద్దతు ఉంటుంది. భవిషత్లో కూటమికి చెంపదెబ్బ తప్పదు. అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ తీరును వ్యతిరేకించాలి.
–మాదల మోహన్రావు, జి.ముంచంగిపుట్టు పంచాయతీ, పాడేరు మండలం.
పేదలకు తీరని ద్రోహం
పేద ప్రజలకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తోంది. పేద ప్రజల కోసం జగనన్న ప్రభుత్వ వైద్యకళాశాలలను ఏర్పాటు చేస్తే, చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరించేందుకు యత్నిస్తోంది. పేద,బడుగు, బలహీన వర్గాల ప్రజలకు వైద్య కళాశాలలను దూరం చేస్తే తగిన బుద్ధిచెబుతాం.
– నీలపు సూరిబాబు, ఆర్టీఐ రాష్ట్ర కార్యదర్శి, కొయ్యూరు మండలం
మాజీ ముఖ్యమంత్రి జగన్ పిలుపుతో కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన
సంతకాల ప్రతులతో పాడేరులో భారీ ర్యాలీ
ర్యాలీలో పాల్గొన్న వేలాదిమంది గిరిజనులు
ప్రజాగ్రహం
ప్రజాగ్రహం
ప్రజాగ్రహం
ప్రజాగ్రహం


