
కొత్తగా కళ్లు తెరిచెనే.!
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కు లో రెండు జంతువుల పిల్లలు సందడి చేస్తున్నాయి. ఇటీవల గర్భం దాల్చిన రెడ్–నెక్డ్ వాలబీ, మౌస్ డీర్ ఒక్కో పిల్లకు జన్మనిచ్చాయి. ప్రస్తుతం తల్లీపిల్లలు రెండూ ఆరోగ్యంగా ఉన్నాయి. మౌస్ డీర్ పిల్ల తన తల్లితో కలిసి ఎన్క్లోజర్లో చురుకుగా తిరుగుతూ సందర్శకులకు కనువిందు చేస్తోంది. మరోవైపు రెడ్–నెక్డ్ వాలబీ పిల్ల ఇంకా తన తల్లి పొట్టభాగంలోని సంచిలోనే సురక్షితంగా ఉంది. సాధారణంగా రెడ్–నెక్డ్ వాలబీ గర్భం దాల్చిన 30 రోజుల్లోనే పిల్లకు జన్మనిస్తుంది. పుట్టినప్పటి నుంచి ఆ పిల్ల సుమారు ఏడు నెలల పాటు తల్లి సంచిలోనే ఉండి పాలు తాగుతూ పెరుగుతుంది. దాదాపు 12 నెలల వయసు వచ్చాక పూర్తిగా బయటకు వచ్చి స్వతంత్రంగా జీవించడం ప్రారంభిస్తుంది. ఈ రెండు పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయని జూ క్యూరేటర్ మంగమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. జూలో జంతువుల పునరుత్పత్తి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని, కొన్ని నెలల కిందట కూడా పలు జంతువులు పిల్లలకు జన్మనిచ్చాయని ఆమె పేర్కొన్నారు. జూ సంరక్షకులు వాటికి నిరంతరం ప్రత్యేక సేవలు అందిస్తున్నారని వివరించారు.