
జిల్లా ఆస్పత్రి ఆవరణలో గిరిజనుడి మృతదేహం
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
పాడేరు: నిత్యం రద్దీగా ఉండే పాడేరు జిల్లా ఆస్పత్రి ఆవరణలో అనుమానాస్పద స్థితిలో ఓ గిరిజనుడి మృతదేహం లభ్యమైంది. శుక్రవారం ఉదయం మృతదేహాన్ని చూసిన ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది విషయాన్ని పోలీసులకు చేరవేశారు. సీఐ దీనబంధు నేతృత్వంలో పోలీసు సిబ్బంది జిల్లా ఆస్పత్రికి చేరుకొని మృతదేహం జేబులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా అతడి వివరాలు సేకరించారు. జి.మాడుగుల మండలం నుర్మతి పంచాయతీ పెద్ద జాగీరు గ్రామానికి చెందిన మసాడ నడపయ్య(50)గా ఆయనను గుర్తించారు. మృతుడు పాడేరు పట్టణంలోని సుండ్రుపుట్టులో నివసిస్తున్న కుమార్తె వద్ద గత కొన్ని రోజులుగా ఉంటున్నట్లు తెలిసింది. గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయానికి బాగానే ఉన్న వ్యక్తి ఆస్పత్రి ఆవరణలో శవమై కనిపించడంతో అతడి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. వారి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ఎం.విశ్వేశ్వరరాజు ఆస్పత్రిలో పరామర్శించారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు అంబులెన్స్ సమకూర్చారు.

జిల్లా ఆస్పత్రి ఆవరణలో గిరిజనుడి మృతదేహం