
విద్యార్థులందరికీ ఇంటర్లో అడ్మిషన్లు
ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కార్తీక్ శ్రీను డిమాండ్
పాడేరు : ఏపీ గిరిజన గురుకుల కళాశాలల్లో రెండు దఫా కౌన్సెలింగ్ నిర్వహించి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరికీ ఇంటర్లో అడ్మిషన్లు కల్పించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కార్తీక్ శ్రీను, జిల్లా సహాయ కార్యదర్శి దర్శి చిన్నారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం వారు పాడేరులో గిరిజన సంక్షేమ శాఖ ఇన్చార్జి డీడీ కమలకు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏటా గిరిజన గురుకులాలు, కాలేజ్ ఆఫ్ ఎక్వ్లెన్స్ల్లో తక్కువ మంది విద్యార్ధులకు ప్రవేశం కల్పిస్తున్నారని, దీంతో చాలామంది పేద గిరిజన విద్యార్ధులకు ఇంటర్లో ప్రవేశాలు దొరకడం లేదన్నారు. పాడేరు ఐటీడీఏ పరిధిలోని 11 మండలాల్లో బాలికల కోసం కేవలం మూడు మాత్రమే గిరిజన బాలికల గురుకుల కళాశాలలు ఉన్నందున గిరిజన విద్యార్థినులకు సీట్లు దొరకడం లేదన్నారు. అదనంగా బాలికల గిరిజన గురుకుల కళాశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ అడ్మిషన్ ఫీజులు తగ్గించాలన్నారు. గిరిజన గురుకుల కళాశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గిరిజన విద్యార్థులకు ఉచితంగా యూనిఫాం, పుస్తకాలను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అన్ని విద్యా సంస్థల్లో గిరిజన విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం హెల్త్ వలంటీర్లను నియమించాలన్నారు. విద్యార్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను గడువులోగా పరిష్కరించాలని లేని పక్షంలో విద్యార్థులతో కలిసి ఎస్ఎఫ్ఐ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని హెచ్చరించారు.