
రోడ్డు విస్తరణ వంద అడుగులు చేయాల్సిందే
సాక్షి,పాడేరు: హైకోర్టు ఆదేశాల మేరకు పాడేరుతో పాటు ఏజెన్సీ వ్యాప్తంగా అక్రమణలు తొలిగించి 100 అడుగుల మేర రోడ్లను విస్తరించాలని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు శుక్రవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు రాజకీయ నాయకుల జోక్యం, ఆదిపత్యం సరైంది కాదన్నారు. 1/70 భూ బదలాయింపు నిషేధ చ ట్టం అమల్లో ఉందని, జిల్లాలోని 5వ షెడ్యూల్ ప్రాంత పరిధిలో ప్రధాన కేంద్రాల్లో రోడ్ల విస్తరణ, అక్రమణలు తొలగించి వంద అడుగుల మేర రోడ్డును వెడల్పు చేయాలన్నారు. జిల్లా కేంద్రం పాడేరులో నిత్యం ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతుందన్నారు.అత్యవసర సమయంలో 108, అంబులెన్స్ల్లో రోగులను పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించేందుకు ట్రాఫిక్ సమస్య వల్ల తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. దీనివల్ల ,సత్వర వైద్యానికి విఘాతం ఏర్పడుతుందన్నారు. గిరిజన ప్రాంత ప్రజలంతా పట్టణంలో రోడ్ల అభివృద్ధిని కోరుకుంటున్నారన్నారు.పట్టణ ప్రాంత అభివృద్ధికి భవిష్యత్ కార్యచరణ చూసుకుని పలు రాజకీయ పార్టీల నేతలంతా రోడ్ల విస్తరణకు మద్దతు ఇవ్వాలన్నారు. గిరిజన ప్రాంతాల్లోని రాజకీయ పార్టీల నేతలు రోడ్లపైకి వచ్చి స్వచ్ఛందంగా వైఖరి వెల్లడించాలన్నారు.ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా రోడ్డు అక్రమణలు తొలగింపు, రోడ్డు విస్తరణ పనులు ఆగకుండా కలెక్టర్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే స్థానిక గిరిజనులు, ఆదివాసీ సంఘాలతో కలిసి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు.
పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస
విశ్వేశ్వరరాజు డిమాండ్
అభివృద్ధికి రాజకీయ నేతలు
అడ్డుతగలడం సరికాదని హితవు
హైకోర్టు ఆదేశాలు అమలుచేయకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరిక