
వసతులిలా..చదువులెలా?
సాక్షి,పాడేరు: వేసవి సెలవుల అనంతరం జిల్లాలో పాఠశాలలు గురువారం తెరచుకోనున్న నేపథ్యంలో విద్యార్థులకు అవస్థలు తప్పే పరిస్థితులు కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి విద్యావ్యవస్థపై తీవ్ర నిర్లక్ష్యం నెలకొంది. గత విద్యాసంవత్సరంలో అనేక ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యల మధ్య చదువులు కొనసాగించాల్సిన దుస్థితిని విద్యార్థులు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన ముందస్తు చర్యలు కానరావడం లేదు.
– గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాడు–నేడు రెండవ విడతలో 967 పాఠశాలల అభివృద్ధికి చర్యలు చేపట్టింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే వీటి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. చాలా పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాల సమస్యలు నెలకొన్నాయి. మరోవైపు జిల్లావ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ఇప్పటికీ పూర్తికాలేదు. మరో ఐదు రోజుల వరకు ఉపాధ్యాయుల బదిలీల గడువు పెంచడంతో గందరగోళం నెలకొంది.
పూర్తిస్థాయిలో రాని కిట్లు
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పూర్తిస్థాయిలో కిట్లు అందుబాటులోకి తేవడంలోను కూటమి ప్రభుత్వం విఫలమైంది. జిల్లాలోని 2,913 ప్రభుత్వ పాఠశాలల్లో 1,69,175మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికి నోటు, పాఠ్యపుస్తకాలను అందుబాటులో తెచ్చినప్పటికీ ఇతర కిట్లు మాత్రం అరకొరగానే జిల్లాకు సరఫరా జరిగింది.విద్యార్థులు 1,69,175 మందికి గాను, 1,31,673 బెల్టులు, 44 వేల బ్యాగులు, 44,800 యూనిఫాం, 24,886 బూట్లు,సాక్సుల కిట్లు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. పాఠశాలల ప్రారంభం తొలిరోజే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పుస్తకాలతో పాటు అన్ని కిట్లు పంపిణీ చేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించినప్పటికీ గురువారం జిల్లాలో పుస్తకాలకే పరిమితం అయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.
నేటి నుంచి పాఠశాలల
పునఃప్రారంభం
967 పాఠశాలల్లో వెంటాడుతున్న అసౌకర్యాలు
పూర్తిస్థాయిలో జిల్లాకు చేరని విద్యార్థుల కిట్లు
పూర్తికాని ఉపాధ్యాయుల బదిలీలు
‘నాడు–నేడు’ నిలిపివేతతో ఇబ్బందులు
గుత్తులపుట్టు ప్రాథమిక పాఠఽశాలలో నాడు–నేడు పనులు నిలిపివేయడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్ల పనులు కూడా సగానికి పరిమితమ య్యాయి.పాఠశాలలో సమస్యలు నెలకొంటే తమ పిల్లల చదువులకు ఇబ్బందిగా మారుతుంది. పూర్తిస్థాయిలో పాఠఽశాలను అభివృద్ధి చేయాలి. – డి.పాపిటిరాజు,
గుత్తులపుట్టు, పాడేరు మండలం
జిల్లాలో పాఠశాలల వివరాలు
ప్రాథమిక : 2551
ప్రాథమికోన్నత : 91
ఉన్నత : 271
మొత్తం పాఠశాలలు : 2,913
బాలురు : 82,757
బాలికలు : 86,418
మొత్తం విద్యార్థులు : 1,69,175

వసతులిలా..చదువులెలా?