
నేడు అప్పన్నకు మూడో విడత చందనం సమర్పణ
సింహాచలం: జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారికి బుధవారం మూడో విడత చందన సమర్పణ కార్యక్రమం జరగనుంది. తెల్లవారుజామున అర్చకులు ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఇప్పటికే సిద్ధం చేసిన మూడు మణుగుల (సుమారు 125 కిలోలు) పచ్చి చందనంలో మంగళవారం వైదికులు పలు రకాల సుగంధ ద్రవ్యాలను కలిపి సమర్పణకు సిద్ధం చేశారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు కరి సీతారామాచార్యులు, ఉప ప్రధానార్చకుడు సాతులూరి నరసింహాచార్యులు, అర్చకుడు అప్పాజీ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మూడో విడత చందన సమర్పణ కారణంగా బుధవారం అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహించనున్నారు.