
అధిక దిగుబడినిచ్చే పంటలపై దృష్టి పెట్టాలి
చింతపల్లి: గిరిజన రైతాంగం ఖరీఫ్ సీజన్లో మేలు రకం విత్తనాలతో మంచి దిగుబడులు ఇచ్చే పంటలపై దృష్టి సారించాలని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి సూచించారు. శనివారం మండలంలోని కుడుముసారి పంచాయతీ పరిధి కోటగున్నలు గ్రామంలో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, విజయవాహిని చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్లో అధిక దిగుబడినిచ్చే రకాలు, పంటలు, చీడపీడలు, యాజమాన్యంపై రైతులకు అవగాహన కల్పించారు. సీనియర్ శాస్త్రవేత్త బయ్యపురెడ్డి ప్రభుత్వ పథకాలు, భూసార పరీక్షల ప్రయోజనాలను తెలియజేశారు. వ్యవసాయ సాంకేతిక నిపుణుడు డాక్టర్ అప్పలరాజు వరి నాట్లు, యాజమాన్య పద్ధతులు కోనోవీడర్ వినియోగం తదితర వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీఏఏ రాజశేఖర్, ఎంపీటీసీ పాంగి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
చింతపల్లి ఏడీఆర్ అప్పలస్వామి