
వాడివేడిగా మండల సమావేశం
కొయ్యూరు: మండల కేంద్రంలోని ఎంపీపీ బడుగు రమేష్ అధ్యక్షతన శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. మండలంలోని పాఠశాలల నిర్మాణ పనుల్లో జాప్యంపై చర్చించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సభ్యుడు వారా నూకరాజు, డౌనూరు ఎంపీటీసీ సభ్యుడు అప్పారావు మాట్లాడుతూ పాఠశాలల పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నా సమగ్ర శిక్ష అభియాన్ జేఈ తదితరులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఉపాధి హామీ పథకం పనులు తదితర విషయాలపై ప్రజాప్రతినిధులకు కనీసం సమాచారం ఇవ్వడం లేదని ఎంపీటీసీ గంగాభవానీ, చీడిపాలెం సర్పంచ్ సోమన్నదొర చెప్పారు. ఉపాధిహమీ సిబ్బంది తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీవో అప్పలరాజు మాట్లాడుతూ 700 ఫారంపాండ్లకు సంబంధించి 11,502 మొక్కలు వచ్చాయన్నారు. రైతులకు వాటిని అందజేస్తున్నామన్నారు. మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ముసిలినాయుడు మాట్లాడుతూ నర్సరీల నుంచి నాణ్యత లేని మొక్కలు తేవడంతో అవి చనిపోతున్నాయన్నారు. నర్సరీలపై తమకు అవగాహన ఉందన్నారు. ఏవో ఉమాదేవి మాట్లాడుతూ 635 క్వింటాళ్ల వరి విత్తనాలకు ప్రతిపాదించామన్నారు. విత్తనాల సమస్య లేకుండా చూడాలని జడ్పీటీసీ నూకరాజు ఆమెను కోరారు.మాపింగ్లో బేస్మెంట్కు కూడా చెల్లింపులు చేస్తే నిర్మాణాలు వేగంగా జరుగుతాయన్నారు.కినపర్తి పంచాయతీలో 12 పీవీటీజీ కుటుంబాలకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు కృషి చేస్తామని ఇన్చార్జి తహశీల్దారు కుమారస్వామి సర్పంచ్ శ్రీనుకు తెలిపారు. ఎంపీడీవో ప్రసాద్, పరిపాలన అధికారి బాలమురళీకృష్ణ, జేఈలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.