
వైద్యవిద్యకు సుస్తీ
వైద్యులను దేవుళ్లతో సమానంగా చూస్తాం. అలాంటి వారిని తయారు చేసే కళాశాలల్లో బోధనా ప్రమాణాలు అత్యున్నతంగా ఉండాలి. వీరికి బోధించేందుకు నాణ్యమైన అధ్యాపక సిబ్బంది ఉండాలి. అందుకు అవసరమైన మౌలిక వసతులు ఉన్నప్పుడే ఉత్తమ వైద్యులు అందుబాటులోకి వస్తారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తారు. జిల్లా కేంద్రం పాడేరులోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పరిస్థితులు ఇందుకు భిన్నం. అధ్యాపకులు, వసతుల కొరతతో అల్లాడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వినవస్తున్నాయి.
సాక్షి,పాడేరు: జిల్లా కేంద్రమైన పాడేరులో గత ప్రభుత్వం మంజూరుచేసిన వైద్య కళాశాలపై ప్రస్తుత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. ఇక్కడ వైద్యవిద్య ప్రారంభమై ఏడాది గడుస్తున్నా మౌలిక వసతులు కల్పించకుండా గాలికొదిలేసింది. పూర్తిస్థాయిలో పోస్టులను భర్తీ చేయకపోవడంవల్ల విద్యార్థులు బోధనపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఉన్నత వైద్యానికి నోచుకోని గిరిజన ప్రాంతాల్లో కార్పొరేట్ వైద్యంతో పాటు, వైద్యవిద్యను అందుబాటులో తెచ్చే లక్ష్యంతో అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. దీనిలో భాగంగా వైద్య కళాశాలను మంజూరు చేసిన ఆయన భవన నిర్మాణాలకు రూ.500 కోట్లు కేటాయించారు. ఈ నేపథ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ కళాశాలపై తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యవిద్యను 150 సీట్లతో ప్రారంభిస్తుందని అందరూ ఊహించారు. అయితే ప్రభుత్వం నామమాత్రంగా 50 సీట్లతో ప్రారంభించింది. ఇది జరిగి ఏడాది కావస్తున్నా పూర్తిస్థాయిలో పోస్టులను భర్తీ చేయలేదు.
● వైద్య కళాశాల ప్రారంభానికి ఏడాది ముందే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 79 పోస్టులను భర్తీ చేసింది. గత ఏడాది వైద్యవిద్యను ప్రారంభించిన కూటమి ప్రభుత్వం మిగతా పోస్టుల భర్తీని పట్టించుకోలేదు. ఇక్కడ 180 పోస్టులకు గాను 79తోనే కళాశాల నడుస్తోంది. అవసరమైన సిబ్బందిని మైదాన ప్రాంతాల నుంచి డిప్యూటేషన్పై కూడా రప్పించలేని పరిస్థితి నెలకొంది. ప్రొఫెసర్లు 17 మందికి గాను ఆరుగురు, అసోసియేట్ ప్రొఫెసర్లు 30 మందికి 18, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 48 మందికి 23 మంది మాత్రమే ఉన్నారు. సీనియర్ రెసిడెన్సీ వైద్యులు, పీజీ ట్యూటర్లకు సంబంధించి 65 పోస్టులకు గాను 16 మంది మాత్రమే ఉన్నారు. దీంతో వైద్య విద్య అభ్యసిస్తున్న తొలిబ్యాచ్ విద్యార్థులకు బోధన పరమైన సౌకర్యాలు కరువయ్యాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
● ఈ ఏడాది మిగతా 100 సీట్లను ప్రభుత్వం పెంచే పరిస్థితులు కనిపించడం లేదు. గతేడాది 50 సీట్లతో ప్రారంభించిన నేపథ్యంలో కనీసం 100 సీట్లతో వైద్య విద్యను ప్రారంభించాలని అప్పటిలో ప్రతిపక్ష పార్టీలు, గిరిజన ప్రజాసంఘాలు, అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి, పాడేరు, అరకు ఎమ్మెల్యేలు మత్స్యరాస విశ్వేశ్వరరాజు,రేగం మత్స్యలింగం, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయినా ఫలితం లేకపోయింది. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యమానికి ప్రతిపక్ష పార్టీలతో పాటు,గిరిజన ప్రజాసంఘాలు సిద్ధమవుతున్నాయి.
పాడేరు కళాశాలపై తీవ్ర నిర్లక్ష్యం
సీట్ల పెంపు ఊసెత్తని ప్రభుత్వం
180 పోస్టులకు 79తోనే నిర్వహణ
అరకొర బోధకులు, సిబ్బందితోకాలక్షేపం
ఉద్యమానికి సిద్ధపడుతున్న
ప్రతిపక్షపార్టీలు, ప్రజా సంఘాలు
సమస్యలు పరిష్కరించాలని మంత్రికి లేఖ
పాడేరు వైద్య కళాశాలలో పూర్తిస్థాయిలో పోస్టులు భర్తీ చేయడంతో పాటు,అన్ని సౌకర్యాలు కల్పించి 100 సీట్లకు పెంచాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి ఇటీవల లేఖ పంపాం. వైద్య కళాశాలను ఇటీవల పరిశీలించినప్పుడు అనేక సమస్యలు గుర్తించా. 180 పోస్టులకు గాను 79 మందితో నిర్వహిస్తున్నారు. వైద్యులు వసతి సమస్య ఎదుర్కొంటున్నారు. వీటన్నింటిని ఈ విద్యాసంవత్సరంలో పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.
– ఎ.అజ శర్మ, ప్రధాన కార్యదర్శి,
ఉత్తరాంఽఽధ్ర అభివృద్ధి వేదిక

వైద్యవిద్యకు సుస్తీ