సాక్షి,పాడేరు: ఏజెన్సీలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు జ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. జలుబు, గొంతినొప్పి జ్వరంతో బాధపడే వారే ఎక్కువగా ఉన్నారు. జిల్లా కేంద్రం పాడేరులోని జిల్లా సర్వజన ఆస్పత్రికి గత వారం రోజుల నుంచి రోగులు భారీగా వస్తున్నారు. ప్రతిరోజు ఓపీ 400 దాటుతోంది. పాడేరు ఏజెన్సీలో చింతపల్లి, అరకు ఏరియా ఆస్పత్రులు, ముంచంగిపుట్టు సీహెచ్సీతో పాటు 11మండలాల పరిధిలోని అన్ని పీహెచ్సీల నుంచి రిఫరల్ కేసులన్నీ జిల్లా ఆస్పత్రికే వస్తున్నాయి.
రోగులతో రద్దీ
జిల్లా ఆస్పత్రి శుక్రవారం రోగులతో రద్దీగా మారింది. ఓపీ చీటీల కోసం చాలా సమయం నిరీక్షించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 584 మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. వీరిలో జ్వరాలతో బాధపడే వారు అధికంగా ఉన్నారు. జ్వర తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులకు మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ రక్తపరీక్షలు జరిపారు. తీవ్ర జ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 35 మందిని ఇన్పేషెంట్లుగా చేర్చి వైద్యసేవలు అందిస్తున్నారు.
నిండిపోయిన వార్డులు
జిల్లా ఆస్పత్రిలోని అన్ని వార్డులు రోగులతో నిండిపోయాయి. 420 పడకలు ఉండగా 400 మంది ఇన్పేషెంట్లు వైద్యసేవలు పొందుతున్నారు. జనరల్ , చిన్నపిల్లల విభాగాల పడకలు రోగులతో నిండిపోయాయి. సీజనల్ వ్యాధుల తీవ్రత నేపథ్యంలో జిల్లా ఆస్పత్రికి రోగుల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది. మరోవైపు పాత ఆస్పత్రిలోని ప్రసూతి విభాగం కూడా రద్దీగా ఉంది. ఇక్కడ కూడా రోజువారి వైద్యపరీక్షలతో పాటు డెలివరీ కేసుల సంఖ్య అధికంగానే ఉంటోంది.
పాడేరు జిల్లా ఆస్పత్రికి
రోగుల తాకిడి
వారం రోజుల నుంచి రద్దీ
400 దాటుతున్న ఓపీ
ఒక్కరోజే 584 మందికి వైద్య పరీక్షలు
జ్వర పీడితులే అధికం
నిండిపోయిన వార్డులు
సీజనల్ వ్యాధుల విజృంభణ
సీజనల్ వ్యాధుల విజృంభణ