
కొంపముంచింది
కూటమి నేతల కక్కుర్తే
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పుణ్యక్షేత్రాల్లో ఎన్నడూలేని ఘోరాలు, విషాదాలు సంభవిస్తున్నాయి. భక్తుల సౌకర్యాల కంటే.. ఉత్సవ సమయంలో ఎంత ఎక్కువగా సొమ్ము చేసుకోవచ్చనే దానిపై కూటమి నేతల ఆత్రమే వీటికి కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హోం మంత్రి దగ్గర నుంచి.. భీమిలి ఎమ్మెల్యే వరకూ ప్రతి ఒక్కరూ తమ అనుచరులకు కాంట్రాక్టులు, అనుయాయులకు వీఐపీ టికెట్లు ఇప్పించుకోవడంలోనే నిమగ్నమయ్యారు. ఎంత మంది భక్తులు వస్తారు, ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న దానిపై దృష్టిసారించలేదు. కూటమి నేతల కాసుల కక్కుర్తి ఈ దుర్ఘటనతో మరోసారి స్పష్టమైంది.
సాక్షి, విశాఖపట్నం: ఊహకందని విషాదం యావత్ రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఏడుగురి ప్రాణాల్ని బలిగొన్న దుర్ఘటనలో కూటమి ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు.. భారీ వర్షం కారణంగానే ప్రమాదం జరిగిందంటూ ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి నాయకుల వరకూ వంత పాడుతున్నారు. కానీ.. కూటమి నేతల కక్కుర్తి కారణంగానే విషాదం నెలకొందని తెలుస్తోంది. కేవలం తమకు చందనోత్సవం వల్ల ఏం లాభం ఒనగూరుతుందనే దానిపైనే ఎక్కువ దృష్టి సారించారు తప్ప... సామాన్య భక్తులకు అప్పన్న దర్శనం సజావుగా జరిగేలా చూసేందుకు ఎలాంటి ఏర్పాట్లు చెయ్యాలి.. ఎక్కడా ఇబ్బందులు లేకుండా చందనోత్సవాన్ని ఎలా నిర్వహించాలనేదానికి ప్రాధాన్యమివ్వలేదు. ఏర్పాట్లు చేసేందుకు వివిధ రకాల పనుల్ని కాంట్రాక్టు సంస్థలకు అప్పగించారు. ఈ పనులన్నింటినీ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, హోంమంత్రి అనిత స్వయంగా పర్యవేక్షిస్తూ... తమకు నచ్చిన వారికే కాంట్రాక్టులు అప్పగించారు.
ఏర్పాట్లన్నీ గంటా అనుచరులకే..
అదే విధంగా.. ఏర్పాట్ల టెండర్ల వ్యవహారమంతా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నడిపించినట్లు సమాచారం. టెంట్లు, లైటింగ్, ఇతర పనులకు సంబంధించిన మొత్తం టెండర్లన్నీ గంటా దగ్గరుండి మరీ అనుచరులకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇలా కాంట్రాక్టుల ద్వారా అనుచరులకు లబ్ధి కలిగించేందుకు ప్రయత్నించారే తప్ప.. భక్తుల గురించి కనీసం పట్టించుకోలేదు. పోనీ ఆ పనులైనా సక్రమంగా చేపట్టారా అంటే.. దానికి కూడా అతీగతీ లేకుండా పోయింది. ఘటన జరిగిన తర్వాత.. బస్సులు కొండపైన నిలిపేయడంతో భక్తులు దిగువనే ఉండిపోయారు. అక్కడ కనీస సౌకర్యాలు అందక నరక యాతన అనుభవించారు. ఇలా.. సింహాచలంలో జరిగిన దారుణానికి ప్రధాన కారణం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే అయినా.. వరుణుడిపై నెట్టేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
వాటర్ బాటిళ్ల మాయాజాలం!
ప్రతి చందనోత్సవానికి జీవీఎంసీ నీటిని పూర్తిస్థాయిలో సరఫరా చేస్తుంది. దీనికి తోడుగా.. సింహాచలం దేవస్థానానికి మంచినీటి బాటిళ్లని అందించే రెగ్యులర్ కాంట్రాక్టర్ కూడా ఉన్నారు. ప్రతి ఉత్సవానికి వీఐపీలకు 500 మిలీ బాటిల్స్ సరఫరా చేస్తుంటారు. ఈ చందనోత్సవానికి కూడా సదరు కాంట్రాక్టర్ 500 మిలీ బాటిల్స్ని లక్ష సరఫరా చేసే టెండరు అప్పగించారు. జీవీఎంసీ 20 లీటర్ల క్యాన్లు, పేపర్ గ్లాసుల్ని భారీ స్థాయిలో భక్తుల కోసం క్యూలైన్లలో, బస్ పాయింట్స్ దగ్గర, తొలి పావంచా దగ్గర ఏర్పాటు చేసింది. అయినా.. నీటి బాటిళ్లలో హోంమంత్రి మాయాజాలం ప్రదర్శించారు. అవసరం లేకపోయినా.. 250 మిలీ నీటి బాటిల్స్ కచ్చితంగా ఉండాలంటూ హుకుం జారీ చేశారు. భక్తులు లక్షన్నర వరకూ వస్తారని అంచనా వేశారు. అయినా.. 3 లక్షల బాటిల్స్ అవసరమంటూ హోంమంత్రి చెప్పడంతో దీనికి టెండర్లు పిలిచారు. ఈ టెండర్ని హోంమంత్రి ముఖ్య అనుచరుడికి అప్పగించారు. వాస్తవానికి ఈ బాటిల్స్ని 3 లక్షల వరకూ సరఫరా చేస్తామని చెప్పి టెండరు దక్కించుకున్న హోం మంత్రి అనుచరుడు.. కేవలం లక్షన్నర బాటిల్స్ మాత్రమే ఇచ్చి.. లెక్క మాత్రం 3 లక్షలుగా చూపించినట్లు తెలుస్తోంది.