
నిజరూప దర్శనానికి వేళాయె
నిత్యచందన తేజోమూర్తి..
● నేడు స్వామివారి చందనోత్సవం
● ఉదయం 3.30 గంటల నుంచి
సర్వదర్శనాలు
● రాత్రి 7 గంటలకు
క్యూల ప్రవేశం మూసివేత
విద్యుదీపకాంతులతో సింహగిరి
సింహాచలం: సింహగిరిపై కొలువుదీరిన శ్రీ వరాహ
లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవానికి వేళయింది. ఏడాది పొడవునా చందనం పూతతో దర్శనమిచ్చే స్వామిని, నిజరూపంలో దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. బుధవారం వేకువజామున ఒంటి గంట నుంచి ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా వైదిక కార్యక్రమాలు నిర్వహించి, స్వామివారిపై ఉన్న చందనాన్ని ఒలిచి, నిజరూప భరితుడిని చేస్తారు. దేవస్థానం అనువంశిక ధర్మకర్త కుటుంబ సభ్యులకు తొలిదర్శనం కల్పించి, వేకువజాము 3.30 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పించనున్నారు. రాత్రి 9 గంటల నుంచి స్వామికి సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు. విశేషపూజల అనంతరం స్వామికి తొలివిడతగా మూడు మణుగుల(సుమారు 125 కిలోలు) చందనాన్ని సమర్పిస్తారు.
పటిష్ట ఏర్పాట్లు : చందనోత్సవానికి ఈ సారి రెండు లక్షల మంది భక్తులు వస్తారని జిల్లా యంత్రాంగం అంచనా వేసింది. సర్వదర్శనంతో పాటు రూ.300, రూ.1,000ఽ, రూ.1500ల దర్శనం టికెట్ల క్యూలు ఏర్పాటు చేశారు. వారికి కేటాయించిన స్లాట్ల ప్రకారం దర్శనాలకు అనుమతిస్తారు. రాత్రి 7 గంటలలోపు మాత్రమే సింహగిరిపై దర్శనాల క్యూల్లోకి భక్తులను అనుమతిస్తారు. అనంతరం క్యూల ప్రవేశ ద్వారాలు మూసివేసి, అప్పటి వరకు క్యూల్లో ఉన్న భక్తులకు స్వామి దర్శనం కల్పిస్తారు. సాయంత్రం 6 గంటల వరకు సింహగిరిపైకి బస్సుల్లో భక్తులను అనుమతిస్తారు. చందనోత్సవం సందర్భంగా అన్ని శాఖల సమన్వయంతో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.
చందనంలో సుగంధ ద్రవ్యాల మేళవింపు
చందనోత్సవం అనంతరం బుధవారం రాత్రి స్వామికి సమర్పించే మూడు మణుగుల పచ్చి చందనంలో దేవస్థానం అర్చకులు మంగళవారం పలురకాల సుగంధ ద్రవ్యాలను కలిపారు. సహస్ర ఘటాభిషేకానికి వెండి, మట్టి కలశాలను సిద్ధంచేశారు.
చందనోత్సవానికి
ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
డాబాగార్డెన్స్: అప్పన్న చందనోత్సవానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుందని జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు తెలిపారు. గోశాల నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్, పాతపోస్టాఫీస్, ఆర్కే బీచ్, కొత్తవలస, చోడవరానికి 60 బస్సులు, అడవివరం నుంచి హనుమంతువాక మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్, ఆర్కేబీచ్కు 20 బస్సులు, అడవివరం నుంచి విజయనగరానికి సుమారుగా 20 బస్సులు నడపనున్నట్టు చెప్పారు. అలాగే గోశాల నుంచి సింహాచలం కొండపైకి 35 బస్సులు, అడవివరం నుంచి సింహాచలం కొండపైకి 13 బస్సులు, అడవివరం నుంచి గోశాలకు 3 బస్సులు ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు.
15 వైద్య శిబిరాల ఏర్పాటు
సీతంపేట : చందనోత్సవానికి వచ్చే భక్తుల కోసం కొండపైన 8, కొండ దిగువన 7 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్టు డీఎంహెచ్వో డాక్టర్ పి.జగదీశ్వరరావు తెలిపారు. వైద్య శిబిరాలకు అనుబంధంగా 16 ఏఎల్ఎస్ అంబులెన్స్లు సిద్ధంగా ఉంచినట్టు పేర్కొన్నారు. సింహాచలం గ్రామీణ ఆరోగ్య కేంద్రంలో 24 గంటలు వైద్యాధికారులు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. మెడికవర్, అపోలో, విమ్స్, కేజీహెచ్ ఆసుపత్రులను రిఫరల్ కేంద్రాలుగా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కొండపైన పబ్లిక్ అమినిటీస్ సెంటర్లో 6 పడకలతో తాత్కాలిక వైద్య సదుపాయం కల్పించామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 99492 85370 నంబరుకు సంప్రదించవచ్చని తెలిపారు.

నిజరూప దర్శనానికి వేళాయె