
యుద్ధవాతావరణం
ఏవోబీలో
ఏవోబీలో మావోయిస్టులు(ఫైల్)
ఒడిశాలోని కటాఫ్ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న ప్రత్యేక పోలీసు బలగాలు
భయం గుప్పిట్లో సరిహద్దు
కొయ్యూరు: ఏవోబీలోని మారుమూల గ్రామాలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నాయి. ఎం.భీమవరం పంచాయతీ కాకులమామిడి, యూ.చీడిపాలెం పంచాయతీ రేవులకోట కాంటవరంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య సోమవారం ఎదురు కాల్పులు జరిగాయి. రెండు ప్రాంతాల్లో ఎదురుకాల్పులు జరగడంతో ఆయా ప్రాంతాల గిరిజనులు భయాందోళనలు చెందుతున్నారు.
● కాకులమామిడి మారుమూల గ్రామం.దీనిని ఆనుకుని జ్యోతులమామిడి గ్రామం ఉంది.ఇక్కడ నుంచి పుట్టకోట,పీఎల్ కొత్తూరు మీదుగా దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్లే అవకాశం ఉంది. గతంలో వేసవిలో మావోయిస్టు అగ్రనేతలు ఇక్క డ శిక్షణ ఇచ్చేవారు. ఈ సమాచారం పోలీసు ల కు తెలియడంతో శిక్షణ ఇవ్వడం నిలిపివేశారు.
2016, 2022లలో ఎన్కౌంటర్లు...
మర్రిపాకల సమీపంలో దట్టమైన అటవీప్రాంతం ఉండడంతో మావోయిస్టులు ఎక్కువగా ఇక్కడికి వచ్చేవారు. ఇలావచ్చిన మావోయిస్టులను 2016లో మర్రిపాకలు–పాలసముద్రం మధ్య పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఆజాద్, ఆనంద్,కమలలాంటి సీనియర్ నేతలతో సహా మొ త్తం ఐదుగురు మరణించారు.2022లో అదే ప్రాంతంలో తీగలమెట్ట సమీపంలో జరిగిన ఎన్ కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు.
సాక్షి,పాడేరు: ఏవోబీలో యుద్ధ వాతావరణం నెలకొంది. మళ్లీ తుపాకుల మోత మోగింది. కాకులమామిడి, కాంటవరం అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య సోమవారం రెండు సార్లు ఎదురుకాల్పులు జరిగాయి. దీంతో వాతారణం ఒక్క సారిగా వేడిడెక్కింది. మన్యం నివురుగప్పిన నిప్పులా ఉంది. మారుమూల గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. ఒకే రోజు రెండు సార్లు రెండు చోట్ల ఎదురుకాల్పులు జరగడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర పోలీసుబలగాలు జల్లెడపడుతున్నాయి. మావోయిస్టు పార్టీ కార్యకలపాల నిరోధమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ ఆపరేషన్లో ఏడాది వ్యవధిలోనే మావోయిస్టు పార్టీ భారీగా నష్టపోయింది. వరుస ఎన్కౌంటర్లలో 70 మంది వరకు మావోయిస్టులు,పార్టీ సభ్యులు ప్రాణాలు విడిచారు. దండకారణ్యమంతా పోలీసుల ఆధీనంలోకి వెళ్లింది. ఒకప్పుడు సురక్షిత ప్రాంతమైన ఛత్తీసగఢ్ రాష్ట్రంలో ఇప్పుడు మావోయిస్టు పార్టీ తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొంటోంది. ఉన్న కొద్దిపాటి క్యాడర్ను కాపాడుకునే ప్రయత్నంలో ఆంధ్రా,ఒడిశా రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తున్నారు. ఒడిశాతో పాటు అల్లూరి జిల్లాలోని సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకునే ప్రయత్నాల్లో మావోయిస్టు కీలక నేతలు,పలు దళాల సభ్యులు నిమగ్నమయ్యారు. గుర్తెడు, వై.రామవరం, కొయ్యూరు, జీకే వీధి మండలాల్లోని మారుమూల అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల సంచారంపై అప్రమత్తమైన పోలీసులు కొద్ది నెలల నుంచి కూంబింగ్ను విస్తృతం చేశారు. చింతూరు, ఎటపాక, చింతపల్లి, జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల సరిహద్దుల్లో పోలీసు పార్టీలు నిరంతరం గాలిస్తున్నాయి.
అడవులు జల్లెడ
ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి మావోయిస్టులు ఏవోబీలోకి ప్రవేశిస్తున్నారనే సమాచారంతో ఒడిశాలోని మల్కన్గిరి,కోరాపుట్ జిల్లాలతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.అవుట్ పోస్టుల పోలీసు బలగాలతో పాటు ప్రత్యేక పోలీసు బలగాలు అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. భారీగా పోలీసు పార్టీలు ఏవోబీ వ్యాప్తంగా మకాం వేయడంతో యుద్ధ వాతావరణం నెలకొంది.ఒడిశాలోని మల్కన్గిరి కటాఫ్ ఏరియాలో ఇప్పటికే ఒడిశా పోలీసు బలగాలు దూకుడుతో ఉన్నాయి. మావోయిస్టుల డంప్లను గుర్తించి, కీలక సామగ్రిని స్వాధీ నం చేసుకుంటున్నాయి.సరిహద్దులో ఉన్న ముంచంగిపుట్టు,పెదబయలు పోలీసులు కూడా ఒడిశా పోలీసులకు అన్ని విధాల సహకరిస్తున్నారు. మావోయిస్టు పార్టీకి చెందిన గాజర్ల రవి,అరుణక్క,జగన్ వంటి కీలకనేతలతో పాటు ఛత్తీస్గడ్,ఒడిశా రాష్ట్రాలకు చెందిన మావోయిస్టు క్యాడర్ సంచరిస్తుందనే పక్కా సమాచారంతోనే జిల్లా పోలీసు యంత్రాంగం వ్యూహత్మకంగా వ్యవహరిస్తోంది. కొయ్యూరు,వై.రామవరం సరిహద్దు అటవీ ప్రాంతంలోని ఎదురుకాల్పుల ఘటన నుంచి మావోయిస్టులు తప్పించుకున్నప్పటికీ పోలీసు బలగాలు మాత్రం వెనక్కితగ్గలేదు.మరిన్ని పోలీసు బలగాలు రంగంలోకి దిగడంతో ఈ అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. నలువైపులా పోలీసులు చుట్టుముట్టడంతో మావోయిస్టులు తీవ్ర నిర్భంధం ఎదుర్కొంటున్నారు. ఎస్పీ అమిత్బర్దర్, చింతూరు ఓఎస్డీ, రంపచోడవరం,చింతపల్లి ఏఎస్పీలు,పాడేరు డీఎస్పీతో పాటు సీఆర్పీఎఫ్,ఇతర ప్రత్యేక బలగాల అధికారులు ఏవోబీలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మరోవైపు మారుమూల ప్రాంతాల రహదారుల్లో తనిఖీలు విస్తృతం చేశారు.