
నేడు చలో పాడేరు ఐటీడీఏ
సాక్షి,పాడేరు: జీవో నంబర్ 3 పునరుద్ధరణ,ప్రత్యామ్నాయ జీవో,ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ సాధన డిమాండ్లతో బుధవారం చలో పాడేరు ఐటీడీఏ ఆందోళన నిర్వహించాలని ఆదివాసీ ప్రజా సంఘాలు నిర్ణయించాయి. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన జీవో నంబర్ 3 పునరుద్ధరణ హామీని వెంటనే అమలు చేయాలన్న డిమాండ్తో ఆదివాసీ ప్రజాసంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో ఆందోళనకు శ్రీకారం చుట్టాయి. ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీగా ఏర్పడిన ఆదివాసీ సంఘాల నేతలు రెండు రోజులుగా ‘చలో పాడేరు ఐటీడీఏ’పై మండల కేంద్రాలు,గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.కమిటీ సభ్యుడు కూడా రాధాకృష్ణ మంగళవారం పాడేరులోని జూనియర్ కళాశాల హాస్టల్ విద్యార్థులతో సమావేశమై చలో ఐటీడీఏ ఆందోళనకు తరలిరావాలని కోరారు. ఏజెన్సీలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, ప్రజా సంఘాలు, గిరిజన విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యావంతులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని చలో ఐటీడీఏ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఎస్సీ సాధన కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.