ఆదిలాబాద్టౌన్: జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. క్యాంప్ కార్యాలయంతో పాటు పోలీసు ముఖ్య కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ పతాకం ఆవిష్కరించి జిల్లా ప్రజలు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణను మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రతిఒక్కరూ పాటుపడాలన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన 13 మంది పోలీస్ సిబ్బందికి సేవా పతకాలు అందజేసి అభినందించారు. అలాగే నేరాల నియంత్రణ, నేరస్తుల పట్టివేతలో విశేష కృషి చేసిన 35 మంది సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఇందులో అదనపు ఎస్పీలు పి.మౌనిక, బి.సురేందర్ రావు, ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, డీఎస్పీలు ఎల్.జీవన్ రెడ్డి, కమతం ఇంద్రవర్ధన్, ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ అధికారులు, పోలీసు ముఖ్య కార్యాలయ సిబ్బంది, రిజర్వ్ సిబ్బంది పాల్గొన్నారు.


