కై లాస్నగర్: పర్యావరణ వారోత్సవాలను జిల్లాలో పకడ్బందీగా నిర్వహిస్తామని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక పర్యావరణ వారోత్సవాల నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం జిల్లా కలెక్టర్లు, అధికారులతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీసీ అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. రానున్న వానాకాలం దృష్ట్యా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈనెల 4 నుంచి 10 వరకు గ్రామ, వార్డు సభలను ఏర్పాటు చేసి వివిధ అంశాలపై రైతులతో పాటు ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. పెండింగ్లో ఉన్న భూభారతి, సాదాబైనామా దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఇందులో ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో మంద మకరందు, అదనపు కలెక్టర్లు రాజేశ్వర్, చిత్రు, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, జెడ్పీ సీఈవో రవి, డీపీవో రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
పోస్టర్ ఆవిష్కరణ
ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ముద్రించిన అవగాహన పోస్టర్లను కలెక్టర్ రాజర్షి షా మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా నోడల్ ఆఫీసర్ రాబిన్సన్, ఎండీ జావిద్ అన్వర్ సబీమ్, తదితరులు పాల్గొన్నారు.


