చీమకుర్తి రూరల్: మండలంలోని తొర్రగుడిపాడు నుంచి నేకునంబాదు వెళ్లే మార్గం మధ్యలో చెక్డ్యాం సమీపాన ఉన్న బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. నవంబర్లో మోంథా తుఫాన్ ప్రభావంతో ఈ బ్రిడ్జిని ఆనుకుని ఉన్న తారురోడ్డు నీటి ప్రవాహానికి కోతకు గురై పెద్ద గొయ్యిలా తయారైంది. ఈ రహదారిపై చీమకుర్తి నుంచి నేకునంబాదు, చండ్రపాడు, లక్ష్మీపురం, మల్లవరం, గుండ్లాపల్లి ఇతర గ్రామాల ప్రజలు ప్రయాణిస్తూనే ఉంటారు. రాత్రి వేళల్లో వాహనదారులు ఈ బ్రిడ్జి దగ్గర ఆదమరిస్తే అంతే సంగతులు. నవంబర్లో మోంథా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ఈ బ్రిడ్జి ఈనాటికీ అలానే ఉంది. కూటమి ప్రభుత్వం తట్టెడు మట్టి అయినా వేయలేదు. ఈ గోతులైన పూడ్చండని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


