చీమకుర్తి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించాలని ఎంఈఓలు–1,2 డీవీఎల్ నరశింహారావు, కే.శివాజీ తెలిపారు. సోమవారం చీమకుర్తిలోని గిరిజన బాలుర పాఠశాలలో మండల స్థాయి ప్రభుత్వ పాఠశాలల వంట చేసే నిర్వాహకులు, హెల్పర్లకు శిక్షణ నిర్వహించారు. టాటా కంపెనీ ఏజెన్సీ సహకారంతో మధ్యాహ్న భోజనంలో పాటించాల్సిన ఆరోగ్య జాగ్రత్తలు, శుభ్రత, నాణ్యత వంటి అంశాలపై వంట ఏజన్సీల వారు పాటించాల్సిన విధానాలపై అవగాహన కల్పించారు. ఈనెల 12న పాఠశాలలను ప్రారంభించే నాటికి ప్రతి ఒక్కరూ నాణ్యతా ప్రమాణాలను పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓలతో పాటు సీఆర్పీలు, వంట ఏజెన్సీ నిర్వాహకులు పాల్గొన్నారు.
ఒంగోలు వన్టౌన్: టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే వృద్ధాప్య పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని.. ఎస్సీ ఎస్టీ, బీసీలకు కార్పొరేషన్ల సబ్సిడీ రుణాల బడ్జెట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఒంగోలులోని సమితి కార్యాలయం వద్ద సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు క్రింద ఉమ్మడి ప్రకాశం జిల్లాకు రూ.9200 కోట్లు తెప్పించినట్లే, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లకు సబ్సిడీ రుణాల నిధులు విడుదల చేయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా కార్యదర్శి కాకుమాను రవి, బొమ్మలు వంశీ, మేడికొండ మురళి, యానాది పరిరక్షణ సమితి ప్రతినిధులు నాగమణి, అంకం కిరణ్ తదితరులు ఉన్నారు.


