జిల్లాలో ఇటీవల హత్యలు పెరిగిపోయాయి. ఇందులో కొన్ని వివాహేతర సంబంధాలు కారణం కాగా.. మరికొన్ని మద్యం మత్తులో చోటు చేసుకుంటున్నా యి. మూడు ముళ్ల బంధాన్ని లెక్కచేయక పక్కదారి పడుతున్న క్రమంలో దంపతుల మధ్య గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో కట్టుకు న్న వారే తోడును కడతేర్చుతున్నారు. ఫలితంగా పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగామారుతోంది. మరోవైపు మద్యం మత్తులో తలెత్తుతున్న గొడవలు హత్యలకు దారి తీస్తున్నాయి. అప్పటివరకు స్నేహితులుగా ఉన్నవారు సైతం చిన్నపాటి గొడవలతో దాడులకు పాల్పడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో బాధిత కుటుంబాల్లో విషాదం నెలకొంటుంది.
వివాహేతర సంబంధాలతోనే..
జిల్లాలో చాలా వరకు వివాహేతర సంబంధాలతోనే హత్యలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీన్ని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే నివారించేందుకు అవకాశం ఉంటుందని పోలీసులు పేర్కొంటున్నారు. క్షణికావేశంతో గొడవలకు దిగి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచిస్తున్నారు. పెద్దల సమక్షంలో కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించే అవకాశం లేకపోలేదని పేర్కొంటున్నారు. హత్యకు పాల్పడితే సమస్య పరిష్కారం కాదు. దీంతో ఇరు కుటుంబాలు రోడ్డున పడతాయి. వారి పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. దారి తప్పినప్పుడు వినకపోతే విడాకులు తీసుకోవచ్చని సూచిస్తున్నారు.
క్షణికావేశ నిర్ణయాలు సరికాదు..
క్షణికావేశంతో తీసుకున్న నిర్ణయాలతో జీవితాలు నాశనం అవుతాయి. దంపతుల మధ్య మనస్పర్దలు ఏర్పడితే పెద్దల సమక్షంలో పరిష్కరించుకోవాలి తప్ప అఘాయిత్యాలకు పాల్పడకూడదు. వివాహేతర సంబంధాలు, పాత కక్షలే దారుణలకు కారణమవుతున్నాయి. హతమార్చడం అనేది సమస్య పరిష్కారం కాదనే విషయాన్ని గ్రహించాలి. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కౌన్సెలింగ్ ద్వారా పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
– ఎల్.జీవన్ రెడ్డి, ఆదిలాబాద్ డీఎస్పీ


