ఏలేశ్వరం: ప్రస్తుతం జరుగుతున్న పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచ దేశాలన్నింటికీ నష్టమేనని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు వి.రాంభూపాల్ అన్నారు. యూటీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు అప్పారి వెంకటస్వామి 26వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర స్థాయి స్మారకోపన్యాసం పట్టణంలో ఆదివారం నిర్వహించారు. యూటీఎఫ్ మండల కమిటీ ఆధ్వర్యాన, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు అధ్యక్షతన ‘అమెరికా యుద్ధోన్మాదం – అంతర్జాతీయ పరిణామాలు’ అనే అంశంపై రాంభూపాల్ ప్రసంగించారు. 23 రోజుల క్రితం మొదలైన ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇజ్రాయెల్, ఆమెరికాలు ఇరాన్పై ఏకపక్షంగా యుద్ధం చేస్తూ సామాన్య ప్రజానీకంపై పెనుభారం మోపుతున్నాయని అన్నారు. ఇరాన్ ఉన్మాద స్థితికి చేరుకుంటే ప్రపంచానికే నష్టమన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ, కరోనా ముందు ప్రభుత్వ పాఠశాలల్లో 46 లక్షల మంది విద్యార్థులుండగా ప్రస్తుతం 31.50 లక్షల మంది ఉన్నారని అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు. తొలుత యూటీఎఫ్ మండల శాఖ భవనాన్ని వెంకటేశ్వర్లు, ప్రసాద్ ప్రారంభించారు. యూటీఎఫ్ సభ్యులకు ఉచిత ఆరోగ్య శిబిరం, వివిధ విభాగాలను ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి, మాజీ ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు, ఇళ్ల వెంకటేశ్వరరావు ప్రారంభించారు. యూటీఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించి, ఉద్యమ గీతాలు ఆలపించారు. అనంతరం, యుద్ధం ఆపాలంటూ పట్టణంలోని పలు వీధుల్లో ఉపాధ్యాయులు శాంతి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సూరిబాబు, నగేష్, జిల్లా నాయకులు జట్ల సోమరాజు, కె.రవి, ఆదివిష్ణు తదితరులు పాల్గొన్నారు.


