కుమ్మక్కయ్యారా..?
బల్దియా టెండర్ల ప్రక్రియ వివాదాస్పదం అయితే రీకాల్.. లేదంటే విచారణ! నిబంధనలకు పాతరేస్తూ నిర్వహణ అనుకూలమైన వారి కోసం అధికారుల ఆరాటం ‘ఇంజినీరింగ్’ తీరుపై ఫిర్యాదుల పరంపర
కై లాస్నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో వీధి దీపాల నిర్వహణ కోసం ఇటీవల రూ.1.26 కోట్ల వ్యయంతో టెండర్లు చేపట్టారు. ఇందులో రూ. 63.20 లక్షల విలువైన టెండర్లను రద్దు చేయ డం చర్చనీయాంశంగా మారింది. సింగిల్ టెండర్ రావడంతోనే రద్దు చేశామని అధికారులు బయటకు చెబుతున్నా ఈ వ్యవహారంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఒక్కటే కాదు.. గతంలోనూ పలు పనుల కోసం నిర్వహించిన టెండర్లలో సైతం తీవ్ర జాప్యం కావడం, నిర్ణీత సమయం దాటిన తర్వాత ఆహ్వానించడం, అందులో కొన్నింటిని రద్దు చేయడం వంటివి చోటు చేసుకోవడం గమనార్హం. వీటిపై కలెక్టర్కు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో పలు పనుల టెండర్లను రీకాల్ చేయడం గమనిస్తే నిబంధనల ప్రకారమే సాగుతున్నాయా అనే విమర్శలు తలెత్తుతున్నాయి. అనుకూలమైన వారికి టెండర్లు కట్టబెట్టేందుకు ఓ అధికారి ఈ వ్యవహారంలో చక్రం తిప్పుతున్నారనే చర్చ సొంత శాఖలోనే సాగుతుండటం గమనార్హం. ఉన్నతాధికారులు పిలిచి తలంటినా సదరు అధికారి తీరులో మార్పు రావడం లేదంటూ చర్చించుకోవడం విస్మయానికి గురిచేస్తోంది.
ఏజెన్సీ వేరైనా పనులు చేసేది ఆయనే..
టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించి త క్కువ కోడ్ చేసిన వారికి పనులు అప్పగించాల్సిన బల్దియా అధికారులు పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అనుకూలమైన కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్టాలనే ఉద్దేశంతో నిబంధనలు కాలరాశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల చేపట్టిన పలు పనులకు సంబంధించిన టెండర్లు ఒకే ఏజెన్సీ దక్కించుకోవడం ఇందుకు బలాన్ని చే కూరుస్తుంది. టెండర్లను ఇతర ఏజెన్సీ దక్కించుకున్నప్పటికీ పనులు మాత్రం అధికార పార్టీకి చెందిన ఓ ‘స్థానిక’ నాయకుడు చేస్తుండటంపై సొంత పా ర్టీలోనే విమర్శలు వ్యక్తమయ్యాయి. కాంగ్రెస్ ఆది లాబాద్ నియోజవర్గ నేతకు సన్నిహితుడిగా చెప్పుకునే ఆ పార్టీ మాజీ కౌన్సిలరే పనులు దక్కించుకుంటున్నట్లుగా ఆ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్లు ఆ నేతకు ఫిర్యాదు చేయడం పరిస్థితికి అద్దం పడుతుంది. సదరు నేత చెప్పినట్లు వినకుంటే తమకెక్కడ ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో కొంతమంది బల్దియా అధికారులు సైతం ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రతీది వివాదాస్పదమే..
ఇటీవల బల్దియా టెండర్ల ప్రక్రియ ప్రతీది వివా దాస్పదమవుతుంది. సమయానికి టెండర్లు నిర్వహించకపోవడం, ఆలస్యంగా తెరువడం, పలు టెండర్లను రీకాల్ చేయడం, కొన్నింటిని రద్దు చేయడం వంటి పరిణామాలు ప్రక్రియలోని లోగుట్టును స్ప ష్టం చేస్తున్నాయి. ఇటీవల చోటు చేసుకున్న కొన్ని టెండర్లను పరిశీలిస్తేఈ విషయం స్పష్టమవుతుంది.
సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించా..
సింగిల్ టెండర్ రావడంతోనే వీధి దీపాల నిర్వహణ టెండర్ రద్దు చేశాం. ఈ ప్రక్రియ నిర్వహణపై సమగ్ర నివేదిక అందించాలని మున్సిపల్ కమిషనర్, ఇంజినీర్ను ఆదేశించాను. వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించి భవిష్యత్తులో పూర్తి పారదర్శకంగా జరిగేలా చూస్తాను.
– ఎస్.రాజేశ్వర్, బల్దియా ప్రత్యేకాధికారి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్
కుమ్మక్కయ్యారా..?


