
రాఖీకి ఆర్టీసీ సిద్ధం
● పండుగల నేపథ్యంలో ప్రత్యేక బస్సులు ● రాఖీల బుకింగ్ కోసం స్పెషల్ కౌంటర్లు
ఆదిలాబాద్: రాఖీ పండుగతో పాటు వరలక్ష్మి వ్రతం వరుస సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ పెరగనుంది. ఈ మేరకు ఆర్టీసీ ముందస్తు చర్యలు చేపట్టింది. రీజియన్ పరిధిలో ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. పండుగ సందర్భంగా అక్కాచెల్లెళ్లు తమ సోదరులకు రాఖీ కట్టేందుకు పుట్టింటికి వెళ్తారు. మహాలక్ష్మి పథకం ప్రారంభమైనప్పటి నుంచి మహిళలు పెద్ద ఎత్తున ఆర్టీసీలో ప్రయాణం చేస్తున్నారు. అలాగే వరుస సెలవుల దృష్ట్యా ఉద్యోగులు, కుటుంబాలతో ఇతర ప్రదేశాలకు వెళ్తుంటారు. ఈ మేరకు రద్దీ దృష్ట్యా ఆర్టీసీ స్పెషల్ బస్సుల ఏర్పాట్లు చేపట్టింది.
ఈ నెల 7నుంచి షురూ..
ఈనెల 8న వరలక్ష్మివ్రతం, 9న రాఖీ పౌర్ణమి, 10న ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజుల పాటు సెలవులు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 7, 8 తేదీల్లో హైదరాబాద్ నుంచి ఉమ్మడి ఆదిలాబాద్లోని వివిధ ప్రాంతాలకు 46 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. అలాగే 10, 11, 12 తేదీల్లో ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భైంసా, మంచిర్యాల, నిర్మల్, ఉట్నూర్ డిపోల నుంచి హైదరా బాద్కు 72 బస్సులను నడపనున్నారు. రద్దీ ఎక్కువగా ఉంటే అదనంగా మరిన్ని సర్వీసులు నడిపేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
రిజర్వేషన్ ఇలా..
పండుగల దృష్ట్యా ముందస్తుగా రిజర్వేషన్ చేసుకోవాలనుకునే వారి కోసం రిజర్వేషన్ కౌంటర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే www. tgsrtcbus. in వెబ్సైట్ ద్వారా బస్సుల సీట్లను బుక్ చేసుకోవచ్చు. డిమాండ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున వీలైనంత త్వరగా బుకింగ్ చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు.
118 ప్రత్యేక బస్సులు..
ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో వరలక్ష్మీవ్రతం, రాఖీ పౌర్ణమి దృష్టిలో ఉంచుకొని 118 ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం. అలాగే ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్లోని జేబీఎస్, ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని ప్రధాన బస్స్టేషన్లలో మే ఐ హెల్ప్ యూ సేవా కేంద్రాలను ఏర్పాటు చేశాం. రీజియన్ పరిధిలోని బస్స్టేషన్ల నుంచి పలు గ్రామాలకు ప్రయాణికుల రద్దీ బట్టి బస్సులను ఏర్పాటు చేస్తాం. – ఎస్.భవానీప్రసాద్,
ఆర్టీసీ రీజినల్ మేనేజర్, ఆదిలాబాద్

రాఖీకి ఆర్టీసీ సిద్ధం