వరద తగ్గింది.. బురద మిగిలింది | - | Sakshi
Sakshi News home page

వరద తగ్గింది.. బురద మిగిలింది

Jul 13 2025 7:23 AM | Updated on Jul 13 2025 7:23 AM

వరద త

వరద తగ్గింది.. బురద మిగిలింది

ఈ చిత్రంలో ఉన్నది రైతు మడే అక్షంతరావు. పెంచికల్‌పేట్‌ మండలం నందిగామ గ్రామశివారులో నాలుగెకరాల్లో పత్తి సాగు చేశాడు. మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ప్రాణహిత నదికి వరద పోటెత్తడంతో నాలుగెకరాల పత్తి నీట మునిగింది. సుమారు రూ.80 వేలు నష్టం వాటిల్లింది. తిరిగి పత్తి విత్తనాలు విత్తుకునే పరిస్థితి లేదని వాపోయాడు.

వేలాది ఎకరాల నష్టం..

దహెగాంలో 12 గ్రామాలు, పెంచికల్‌పేటలో 8 గ్రామాలు, బెజ్జూర్‌లో 14 గ్రామాలు, చింతలమానెపల్లిలో 10 గ్రామాలు, కౌటాలలో 8 గ్రామాలు, సిర్పూర్‌లో 9 గ్రామాలు వరదల బారిన పడ్డాయి. ఈ ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోవడంతో పత్తి, వరి, ఇతర పంటలు మునిగిపోయాయి. పెంచికల్‌పేట మండలంలో మురళీగూడ, జిల్లెడ, నందిగామ, కమ్మర్‌గాం గ్రామాల్లో సుమారు 400 ఎకరాల పత్తి నీటమునిగింది. గతేడాది చింతలమానెపల్లిలో 1,200 ఎకరాల్లో పంటలు నష్టపోయినా, అధికారులు సర్వే నిర్వహించినప్పటికీ పరిహారం అందలేదు.

చింతలమానెపల్లి/పెంచికల్‌పేట్‌/వేమనపల్లి: వానాకాలం ప్రారంభంలోనే ప్రాణహిత నది వరదలు కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల రైతుల పంటలను నాశనం చేశాయి. పత్తి మొక్కలు మొలకెత్తుతున్న తరుణంలో వచ్చిన ఈ వరదలు వేలాది ఎకరాల పంటలను తుడిచిపెట్టాయి. గత నాలుగేళ్లుగా ఇలాంటి వరదలతో నష్టపోతున్న రైతులు, అప్పుల భారంతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నారు. ఈ కథనం ద్వారా వరదల ప్రభావం, రైతుల నష్టాలు, పరిహారం కోసం వారి ఆవేదనను వివరిద్దాం.

వరదలతో పంట నష్టం..

ప్రాణహిత నది ఉధృతి కారణంగా కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లోని నదీతీర ప్రాంతాల్లో పత్తి పంటలు నీటమునిగాయి. వేమనపల్లి, కోటపల్లి, దహెగాం, బెజ్జూర్‌, కౌటాల మండలాల్లో వేలాది ఎకరాల పంటలు మూడు నాలుగు రోజుల పాటు నీటిలో మునిగి కుళ్లిపోయాయి. మొలక దశలోనే ఉన్న పత్తి మొక్కలు వరదలో కొట్టుకుపోయా యి. వరద తగ్గిన తర్వాత చేలల్లో ఒండ్రు మట్టి, బురద, ఇసుక మేటలు పేరుకుని, పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. మళ్లీ పంట వేసినా వరద ముప్పు తప్పదనే ఆందోళన రైతుల్లో నెలకొంది.

నాలుగేళ్లుగా నష్టాలే..

గత నాలుగేళ్లుగా ప్రాణహిత నది వరదలు రైతుల పంటలను నాశనం చేస్తున్నాయి. అప్పులు చేసి పంట సాగు చేసిన రైతులు, నష్టాలతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. ఒక్కో ఎకరం పత్తి సాగుకు రూ.16 వేల నుంచి రూ.20 వేల ఖర్చవుతుందని, విత్తనాలు, ఎరువులు, కల్టివేటర్‌, కై కిలి ఖర్చులు తీర్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారం, వేమనపల్లిలో 1,790 ఎకరాలు, కోటపల్లిలో 2,500 ఎకరాలు, బెజ్జూర్‌లో 1,200 ఎకరాలు, దహెగాంలో 900 ఎకరాలు, కౌటాలలో 1,800 ఎకరాల్లో పత్తి పంట నష్టపోయింది. రైతులు సమగ్ర సర్వే నిర్వహించి నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు.

ప్రాణహిత–పెన్‌గంగ ప్రభావం..

సిర్పూర్‌(టి) నియోజకవర్గంలో ప్రాణహిత, పెన్‌గంగ నదులు ప్రవహిస్తాయి. సిర్పూర్‌(టి), కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్‌, పెంచికల్‌పేట, దహెగాం మండలాల్లో ఈ నదుల తీర ప్రాంతాలు వరదల ప్రభావానికి గురవుతున్నాయి. మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు, పెన్‌గంగ, వార్దా తదితర నదులపై ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడం వల్ల ప్రాణహితలో నీటి ప్రవాహం పెరుగుతోంది. గోదావరిలో ఉధృతి పెరిగినప్పుడు ప్రాణహిత నది ప్రవాహం అడ్డుకోబడి, వరద నీరు నిలిచిపోతుంది. దీంతో నదిలో కలిసే వాగులు, కాలువల నీరు పరిసర భూముల్లోకి చేరి పంటలను నాశనం చేస్తోంది. ఈ వరదలు 3 నుంచి 15 రోజుల వరకు కొనసాగుతాయి.

పరిహారం, నష్ట నివారణ చర్యల లేక..

ఏటా పంటలు మునిగినప్పటికీ, ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందడం లేదు. ముంపు ప్రాంతాల ను గుర్తించి, ప్రత్యామ్నాయ పంటలు, రాయితీపై విత్తనాలు, ఎరువులు అందించడం వంటి చర్యలు చేపట్టడం లేదు. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులకు ఈ ప్రాంతాలపై అవగాహన లేకపోవడం, వరద సమయంలో హెచ్చరికలు తప్ప మరో మద్దతు అందకపోవడంపై రైతులు విమర్శిస్తున్నా రు. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఒత్తిడి తెచ్చేందుకు విఫలమవుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.

పంటల బీమా ఉంటే..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పంటల బీమా పథకం అమలులో ఉండేది. అయితే, తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేసింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికలకు ముందు పంటల బీమా పథకాన్ని తిరిగి అమలు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ, అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతున్న రైతులకు ఆర్థిక మద్దతు అందక, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ చిత్రంలో ఉన్నది రైతు డగె అంకులు. గతేడాది ఏడు ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. ఎకరాకు సుమారు రూ.20 వేల పెట్టుబడి పెట్టాడు. గతేడాది వర్షాలతో దిందా గ్రామం సమీపంలోని వాగుకు వరదలొచ్చాయి. ప్రాణహిత నది ముంపు నీటిలో పత్తి మునిగింది. వారం రోజులకు పైగా వరద నీటిలో ఉండడంతో మొక్కలు కుళ్లిపోయాయి. సుమారు రూ.లక్షకుపైగా నష్టం వాటిల్లింది. అధికారులు పంట నష్టం సర్వే నిర్వహించినా పరిహారం అందించలేదు.

పంటలను ముంచిన ప్రాణహిత ఆదిలోనే అన్నదాత ఆశలను తుంచిన వరద మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాలో వేల ఎకరాల్లో పంట నష్టం

మళ్లీ విత్తనాలు విత్తుకోవాల్సిందే.. ఏటా నష్టపోతున్నా.. అందని పరిహారం

వరద తగ్గింది.. బురద మిగిలింది1
1/3

వరద తగ్గింది.. బురద మిగిలింది

వరద తగ్గింది.. బురద మిగిలింది2
2/3

వరద తగ్గింది.. బురద మిగిలింది

వరద తగ్గింది.. బురద మిగిలింది3
3/3

వరద తగ్గింది.. బురద మిగిలింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement