
● ఔట్సోర్సింగ్ ఏజెన్సీల గుర్తింపు నిబంధనల్లో మార్పులు
సాక్షి,ఆదిలాబాద్: జిల్లాలో ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ఎంప్యానల్మెంట్ గుర్తింపు అంశంలో అధికారులు ఎట్టకేలకు సడలింపులు ఇచ్చారు. నిబంధనల్లో మార్పులు చేశారు. అనంతరం టెండర్లు తెరిచి పత్రాలను పరిశీలన ప్రక్రియ చేపట్టారు. త్వరలోనే ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు.
నిబంధనల్లో మార్పులిలా..
ఔట్సోర్సింగ్ ఏజెన్సీ రెండేళ్లలో రూ.కోటి టర్నోవర్ కలిగి ఉండాలి.. వంద మంది ఉద్యోగుల నిర్వహణ చేసిన అనుభవం ఉండాలి.. ఇది టెండర్ నోటిఫికేషన్లో పొందుపర్చిన నిబంధనలు.. వీటిపై పలు విమర్శలు వ్యక్తమయ్యాయి.. ‘సాక్షి’లో దీనిపై ఈనెల 9, 13 తేదీల్లో ‘అంతా మా ఇష్టం’.. ‘టెండర్ వివాదాస్పదం’ శీర్షికలతో కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. ఇటీవల ప్రజావాణిలో కొంత మంది ఏజెన్సీ నిర్వాహకులు ఈ నిబంధనలపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో పరిశీలన చేయాలని కలెక్టర్ రాజర్షిషా అప్పుడే ఆదేశాలు జారీ చేశారు. తాజాగా ఈ రెండు అంశాల్లో కొత్త ఏజెన్సీలకు మినహాయింపు ఇచ్చారు.
29 దరఖాస్తులు రాక..
జిల్లాలో ఔట్సోర్సింగ్ ఏజెన్సీల గుర్తింపునకు సంబంధించి కొత్త ఎంప్యానల్మెంట్ ఏర్పాటు కోసం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈనెల 2 నుంచి 13వరకు జిల్లా ఉపాధికల్పన శాఖ కార్యాలయంలో ఏజెన్సీల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 32 దరఖాస్తులు విక్రయించగా, 29 ఏజెన్సీలు దరఖాస్తు చేసుకున్నాయి. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి సమక్షంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ఈ టెండర్లు తెరిచారు. కమిటీకి కన్వీనర్ కమ్ మెంబర్ అయిన ఉపాధి కల్పనశాఖ ఇన్చార్జి అధికారి మిల్కా, సభ్యులైన కార్మికశాఖ అధికారులు ముత్యం రెడ్డి, రాజలింగు పాల్గొన్నారు. దరఖాస్తు చేసుకున్న ఏజెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు. ఆ ఏజెన్సీలకు సంబంధించి డీడీ నంబర్, సొసైటీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఈపీఎఫ్, ఈఎస్ఐ, జీఎస్టీ, పాన్కార్డు, వారు పొందుపర్చిన కమీషన్ పర్సెంటేజ్ వంటి వివరాలు పరిశీలించారు. ఈ సర్టిఫికెట్లన్నీ కరెక్ట్గా ఉన్నాయా.. లేదా అనే దానిపై సూక్ష్మంగా పరిశీలన చేసిన తర్వాత కొత్త ఎంప్యానల్మెంట్కు ఎంపికయ్యే ఏజెన్సీల పేర్లను ప్రకటించనున్నారు. దానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.
ఔట్సోర్సింగ్ ఏజెన్సీల పత్రాలను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, అధికారులు
లోకల్.. నాన్లోకల్ లొల్లి
దరఖాస్తుదారుల్లో లోకల్, నాన్లోకల్ లొల్లి మొ దలైంది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి ఏజెన్సీ నిర్వాహకులు కొత్త ఎంప్యానల్మెంట్లో గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై స్థానిక ఏజెన్సీల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతుంది. ప్రధానంగా ఇ తర జిల్లాలో తాము దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లినప్పుడు వారు విభేదిస్తూ తమను దూరంగా ఉంచుతున్నారని, అలాంటప్పుడు జిల్లా అధికారులు ఈ విషయంలో పరిశీలన చేసి ఇక్కడ కూడా నాన్లోకల్ ఏజెన్సీలను గుర్తించవద్దని డిమాండ్ చేస్తున్నారు. అయితే కొంత మంది అధికారులే నాన్లోకల్ ఏజెన్సీలకు వంత పాడుతున్నారనే విమర్శలున్నాయి. ప్రధానంగా ఈ ఏజెన్సీలతో ఆ అధికారులకు సంబంధం ఉందని పలువురు స్థానిక ఏజెన్సీల నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
పరిశీలిస్తున్నాం..
దరఖాస్తు చేసుకున్న ఏజెన్సీలలో వారికి అన్ని విధాలా అర్హత ఉందా.. లేదా అనేది పరిశీలన చేస్తాం. నాన్లోకల్ ఏజెన్సీలు దరఖాస్తు చేసుకోవద్దని నిబంధన లేదు. టెండర్ నిబంధనలో పొందుపర్చిన అంశాల్లో కొత్త ఏజెన్సీలకు టర్నోవర్, పోస్టుల నిర్వహణలో అనుభవాన్ని మినహాయించాం. పాత ఏజెన్సీలకు మాత్రం ఈ నిబంధనలు యథావిధిగా వర్తిస్తాయి. గతంలో వివిధ ఏజెన్సీలు ఉద్యోగులకు వేతనాలు సరిగ్గా చెల్లించని అంశాన్ని దృష్టిలో ఉంచుకొని సెక్యూరిటీ డిపాజిట్ కింద ఈఎండీ రూ.5లక్షలను ఖరారు చేశాం.
– మిల్కా, ఉపాధికల్పన జిల్లా ఇన్చార్జి అధికారి, ఆదిలాబాద్

● ఔట్సోర్సింగ్ ఏజెన్సీల గుర్తింపు నిబంధనల్లో మార్పులు