
● పైలట్ ప్రాజెక్ట్గా భోరజ్ మండలం ఎంపిక ● నేటి నుంచి
కై లాస్నగర్: భూ సమస్యలు పరిష్కరించి రైతుల కు భరోసా కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టం అమల్లో భాగంగా జి ల్లాలో కొత్తగా ఏర్పడిన భోరజ్ మండలాన్ని పైల ట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేశారు. నేటినుంచి ఈ నెల 16వరకు గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. షెడ్యూల్ ఖరారుతో పాటు తహసీల్దార్ల ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలను నియమిస్తూ కలెక్టర్ రాజర్షిషా ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులే స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లనున్న నేపథ్యంలో తమ సమస్యల పరిష్కారం కోసం రైతులు గంపెడాశలు పెట్టుకున్నారు.
తహసీల్దార్ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు..
భోరజ్ తహసీల్దార్ ఎల్.రాజేశ్వరీ, భీంపూర్ తహసీల్దార్ కె.నలంద ప్రియ, బేల తహసీల్దార్ రఘునాథ్ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో టీంలో నాయబ్ తహసీల్దార్, ఇద్దరు ఆర్ఐలు, సర్వేయర్, సీనియర్ అసిస్టెంట్/జూనియర్ అసిస్టెంట్, ఎంపీఎస్వో స్థాయి కలిగిన ఎనిమిది మంది ఉద్యోగులను నియమించారు. వీరితో పాటు జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్లతో కూడిన ఎనిమిది మంది ఉద్యోగులతో మరో మూడు హెల్ప్ డెస్క్లను నియమించారు. జిల్లాలోని పలు తహసీల్దార్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ బాధ్యతలను అప్పగించారు. ఒక్కో గ్రామాన్ని ఈ 16 మంది అధికారులు, ఉద్యోగులు సందర్శించి అక్కడి రైతులకు భూ భారతి చట్టం విధి విధానాలపై అవగాహన కల్పిస్తారు. వారి నుంచి భూ సమస్యలపై అర్జీలు స్వీకరించనున్నారు. ఉదయం 9నుంచి సాయంత్రం 4గంటల వరకు వీరంతా గ్రామంలోనే ఉండనున్నారు. సంబంధిత రైతులు రాతపూర్వక దరఖాస్తులను అందించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే నిర్ణీత ప్రొఫార్మాను జిల్లాకు పంపించింది. అధికారులు వాటిని అందజేయనున్నారు. దాన్ని పూర్తి చేసి అవసరమయ్యే ధ్రువీకరణ పత్రాలను జతచేసి అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. వాటిని విచారణ అనంతరం పోర్టల్లో నమోదు చేయనున్నారు.
సమస్యలు బోలేడు..
గత ప్రభుత్వం అమలు చేసిన ధరణిలో పలు సమస్యలకు సంబంధించి ఆప్షన్లు లేకపోవడంతో గ్రామాల్లో భూ సమస్యలు పేరుకుపోయాయి. వాటి పరిష్కారం కోసం కొన్నేళ్లుగా బాధితులు అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇలాంటి వారంతా కొత్త చట్టంపై ఆశలు పెట్టుకున్నారు. సర్వేనంబర్లలో తప్పిదాలు, భూమి మిస్సింగ్, సరిహద్దుల వివాదం, పేర్ల మార్పిడి, డిజిటల్ సిగ్నిచర్, భూ విస్తీర్ణంలో తేడాలు, విరాసత్, సాదాబైనామా వంటి సమస్యలు ఈ సదస్సుల ద్వారా పరిష్కారమై తమకు లబ్ధి చేకూరుతుందని ఆశపడుతున్నారు.
కోర్టా గ్రామంలో ఇటీవల రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు(ఫైల్)
సద్వినియోగం చేసుకోవాలి
భూభారతి చట్టంపై అవగాహన కల్పించడంతో పాటు సమస్యలను పరిష్కరించేందు కోసమే గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం. సంబంధిత రైతులు సదస్సుకు వచ్చి నిర్ణీత ప్రొఫార్మాలో దరఖాస్తులు అందజేయాలి. సమస్యలను క్షేత్రస్థాయిలోనే విచారించి జూన్ 2లోగా వాటిని పరిష్కరిస్తాం. రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలి.
– ఎల్.రాజేశ్వరి, తహసీల్దార్, భోరజ్
సదస్సుల నిర్వహణ షెడ్యూల్ ఇలా..
భోరజ్ మండలంలో మొత్తం 28 రెవెన్యూ గ్రామాలున్నాయి. ఒక్కోరోజు మూడు గ్రామాల్లో సదస్సులు కొనసాగనున్నాయి. తొలిరోజున కోర్టా, గణేశ్పూర్, పూసాయి గ్రామాల్లో నిర్వహించనున్నారు. 6న మిర్జాపూర్, కేదార్పూర్, అవాల్పూర్, 7న బాలాపూర్, మాండగడ, అకోలి, 8న పిప్పర్వాడ, హత్తిఘాట్, హషంపూర్, 9న గిమ్మ(కే), శేఖాపూర్, సావాపూర్, 12న గిమ్మ(బి), డోల్లారా, దాదాపూర్, 13న లేఖర్వాడ, కామాయి, సిర్సన్న, 14న పౌజ్పూర్, గూడ, పెండల్వాడ, 15న తరోడా, కరన్వాడీ, రాంపూర్(టి), 16న భోరజ్ గ్రామాల్లో సదస్సులు నిర్వహించనున్నారు. వీటి నిర్వహణకు నోడల్ అధికారిగా ఆదిలాబాద్ ఆర్డీవో బి.వినోద్కుమార్ వ్యవహరించనున్నారు.