ముందస్తు సాగు వద్దు | - | Sakshi
Sakshi News home page

ముందస్తు సాగు వద్దు

May 30 2025 1:46 AM | Updated on May 30 2025 1:46 AM

ముందస

ముందస్తు సాగు వద్దు

● డీఏవో శ్రీధర్‌స్వామి ● ‘సాక్షి ఫోన్‌ ఇన్‌’కు స్పందన ● రైతుల సందేహాలు నివృత్తి చేసిన జిల్లా వ్యవసాయాధికారి

ఆదిలాబాద్‌అర్బన్‌/ఆదిలాబాద్‌టౌన్‌: ‘జిల్లాలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు నైరుతి రుతుపవనాల ప్రభావంతో కాదు. నైరుతి వానలు పడ్డాక జూన్‌ 15వరకు పత్తి, జూలై 10 వరకు సోయాబీన్‌ విత్తుకోవచ్చు. ముందుగా విత్తనా లు వేస్తే కాత, పూత దశలో తెగుళ్లు ఆశించే ప్ర మాదముంది. ఈసారి 5.85 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా. జిల్లాకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయి’ అని జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్‌స్వామి తెలిపారు. వానాకాలం సాగులో రైతు ల సందేహాలను నివృత్తి చేసేందుకు గురువా రం ‘సాక్షి’ నిర్వహించిన ఫోన్‌ఇన్‌కు స్పందన వచ్చింది. జిల్లా నలుమూలల నుంచి రైతులు ఫోన్‌ చేసి సందేహాలు తెలుపగా డీఏవోతోపా టు వ్యవసాయశాఖ టెక్నికల్‌ అధికారులు విశ్వామిత్ర, విశ్వనాథ్‌ సమాధానాలిచ్చారు.

ప్రశ్న: ప్రస్తుతం వర్షాలు క్రమం తప్పకుండా కురుస్తున్నాయి. ఈ సమయంలో పత్తి విత్తనాలు వేసుకోవచ్చా?

– రాజు (ఇచ్చోడ), సంజీవ్‌ (సీతాగొంది),

అందె ఆనంద్‌ (పొన్నారి), గౌతమ్‌ (సాత్నాల)

డీఏవో: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను చూసి వెంటనే పత్తి విత్తనాలు విత్తుకోవద్దు. నైరుతి వర్షాలు పడ్డాక అంటే జూన్‌ రెండో వారం వరకు విత్తుకోవచ్చు. ముందుగా విత్తనాలు వేస్తే కాయకుళ్లు తెగులు సోకే ప్రమాదముంది.

ప్రశ్న: నకిలీ విత్తనాలను ఎలా అరికడతారు? ఫసల్‌ భీమా గురించి వివరించండి?

– సంగెపు బొర్రన్న,

రైతు స్వరాజ్య వేదిక అధ్యక్షుడు

డీఏవో: నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జి ల్లా, మండలస్థాయి కమిటీలు వేసి నిరంతరం నిఘా ఉంచాం. ఫసల్‌ బీమా యోజన అమలు పై ప్రభుత్వం నుంచి ఇంకా ఆదేశాలు రాలేదు.

ప్రశ్న: ఏ రకం పత్తి విత్తనాలు మంచివి?

– శ్రీనివాస్‌గౌడ్‌, కై లాస్‌ (బజార్‌హత్నూర్‌)

డీఏవో: మన దుకాణాల్లో దొరికే పత్తి విత్తనాలు దాదాపు అన్ని మేలు రకానికి చెందినవే. ముందుగా పంట చేతికివచ్చే ప్లాటినం, సదానంద్‌, నూజివీడు కంపెనీకి చెందిన ఆశ లాంటి విత్తనాలు ఎంపిక చేసుకోవచ్చు.

ప్రశ్న: సోయాబీన్‌కు సబ్సిడీ ఉందా? సోయా, పత్తి విత్తనాలు ఎప్పుడు విత్తుకోవాలి?

– ముండే సురేశ్‌, రాజు (బోథ్‌)

డీఏవో: సోయాకు ఇప్పటికైతే సబ్సిడీ లేదు. సోయాలో అంతరపంటగా ఇంకేదైనా వేసుకో వచ్చు. జూన్‌ 15 వరకు పత్తి, జూలై రెండో వా రం వరకు సోయా విత్తనాలు వేసుకోవచ్చు.

ప్రశ్న: రబీలో జొన్న, ఖరీఫ్‌లో పత్తి సాగు చేశా ను. ప్రస్తుతం ఏ పంట వేస్తే మంచిది?

– సురేందర్‌ (కనుగుట్ట, బోథ్‌), లస్మారెడ్డి (బేల మండలం), అశోక్‌ (భీంపూర్‌), రాకేశ్‌రెడ్డి (ఇచ్చోడ మండలం)

డీఏవో: ఈసారి మొక్కజొన్న వేయండి. ఎకరా కు దాదాపు 30క్వింటాళ్ల వరకు దిగుబడి వ స్తుంది. మక్కను బోదెల పద్ధతిలో సాగు చేస్తూ వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి.

ప్రశ్న: సోయా విత్తన రకాలు తెలుపండి?

– ఆర్టీబీ ప్రసాద్‌ (బోథ్‌), మహేందర్‌

(సాంగిడి, బేల మండలం)

డీఏవో: ఎప్పుడూ ఒకేరకం సోయా విత్తనాలు వేస్తే పురుగు ఆశించే ప్రమాదముంది. మార్కెట్‌లో జేఎస్‌ 335, రవి, ఓంకార్‌ లాంటి రకాలు న్నాయి. నోటిఫైడ్‌ విత్తనాలు వాడాలి. కొన్నప్పుడు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి.

ప్రశ్న: గత సీజన్‌లో సోయాబీన్‌ వేస్తే ప్రస్తుతం ఏ పంట వేస్తే మంచిది?

– దేవన్న (జైనథ్‌), గంగన్న (ధనోర, భీంపూర్‌ మండలం), నర్సయ్య (సిరికొండ)

డీఏవో: గతంలో సోయాబీన్‌ వేస్తే ప్రస్తుతం మినుము, పెసర, కంది వేయాలి. పంట మా ర్పిడి చేస్తేనే ఫలితం ఉంటుంది.

ప్రశ్న: మొక్కజొన్న సాగులో మొక్కకు మొక్కకు మధ్య దూరం ఎంతుండాలి?

– లక్ష్మణ్‌, సిరికొండ

డీఏవో: స్వీట్‌కార్న్‌ విత్తన వైరెటీలు మన దగ్గర కూడా అందుబాటులో ఉన్నాయి. మొక్కకు మొక్కకు మధ్య దూరం 15 సెంటిమీటర్లు, వరుసల మధ్య దూరం 45 నుంచి 60 సెంటిమీటర్లు ఉండేలా చూసుకోవాలి.

ప్రశ్న: కర్ణాటక నుంచి తెలంగాణకు వచ్చే నకిలీ విత్తనాలను ఎలా అరికడతారు?

– వెంకటేశ్‌, తాంసి మండలం

డీఏవో: పోలీస్‌, రెవెన్యూ, వ్యవసాయశాఖల అధికారులతో టాస్క్‌ఫోర్స్‌ బృందాలను నియమించాం. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కేసు నమోదు చేస్తున్నాం. ఇప్పటివరకు సుమారు 50 నకిలీ విత్తన ప్యాకె ట్లు, 10కిలోల లూజ్‌ విత్తనాలు స్వాధీనం చేసుకున్నాం. జిల్లాలోని చెక్‌పోస్టులు, సరి హద్దు గ్రామాల్లో నిఘా పెంచాం.

ముందస్తు సాగు వద్దు1
1/1

ముందస్తు సాగు వద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement