ఏప్రిల్ నాటికి భూముల సేకరణ
విశాఖ-చెన్నై కారిడార్, ఎస్ఈజెడ్’ విషయమై కలెక్టర్ ఆదేశం
అధికారులతో సమీక్ష
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం-చెన్నై కారిడార్ కోసం నక్కపల్లి వద్ద, ఎస్ఈజెడ్ కోసం అచ్యుతాపురం వద్ద తలపెట్టిన భూసేకరణ పనులను ఏప్రిల్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ ఎన్. యువరాజ్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు భూముల సర్వే, డ్రాప్ట్ నోటిఫి కేషన్, డిక్లరేషన్ ప్రకటన, నష్టపరిహారం చెల్లింపు, గ్రామాల తరలింపు, ఆర్ఆర్ ప్యాకేజీ అమలు, కోర్టు వివాదాల పరిష్కారం తదితర పనులను వేగవంతం చేయాలన్నారు.
తన ఛాంబర్లో జేసీ నివాస్, ఎస్డీసీ సీహెచ్. సత్తిబాబు, ఆర్డీవో గోవిందరాజులు, ఏపీఐఐసీ, రెవెన్యూ అధికారులు, సర్వే కంపెనీల ప్రతినిధులతో భూసేకరణ పనుల ప్రగతిపై కలెక్టర్ శనివారం సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పలు పరిశ్రమల స్థాపనకు, విశాఖ-చెన్నై కారిడార్ పనులకు రాష్ర్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నందున భూసేకరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. నక్కపల్లిలో ఇప్పటికే సుమారు 2,200 ఎకరాల భూసేకరణ జరిగిందని, మరో 1600 ఎకరాలను సేకరించాల్సి ఉందన్నారు. రైతులకు నష్టపరిహారం చెల్లింపు కోసం స్థానిక ఎమ్మెల్యే అధ్యక్షతన రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
రైతు ప్రతినిధులతో రేపు సమావేశం
ఇదే అంశంపై రైతు ప్రతినిధులతో చర్చించేందుకు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్లో సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నక్కపల్లి మండలం రాజయ్యపేట, వేంపాడు, డీఎల్ పురం తదితర గ్రామాల్లో ప్రభుత్వ భూముల సర్వే, సేకరణ పనులను వేగవంతం చేయాలన్నారు. ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయి, ఎక్కడ ఆక్రమణకు గురయ్యాయి తదితర విషయాలపై సమగ్రంగా తెలియజేస్తూ మ్యాప్లను రూపొందిం చాలని, లేకుంటే భవిష్యత్లో వివాదాలు తలెత్తే అవకాశం ఉందన్నారు. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ మనిషా త్రిపాఠి, నక్కపల్లి తహశీల్దార్ సుందర్రావు, ఏపీఐఐసీ అధికారి పి.కృష్ణమూర్తి, సూపరింటెండెంట్ కె.వి.ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.