Viper
-
6 ఫీట్లు పొడవు.. 40 కిలోల బరువు.. కాటేస్తే ఖతమే!
ఈ చిత్రంలో ఉన్న రక్తపింజర పాము సుభాష్నగర్బస్తీలోని ఓ ఇంట్లో రెండు రోజుల క్రితం వచ్చిదూరింది. బస్తీని ఆనుకుని అటవీప్రాంతం ఉండటంతో రక్త పింజర వచ్చినట్లు తెలుస్తుండగా దాని పొడవు 6 ఫీట్లు, బరువు 40 కిలోల వరకు ఉంది. ఈ పాము కాటేస్తే మనిషి బతికే అవకాశాలు ఉండవు. అంతటి ప్రాణాంతకమైన సర్పాన్ని స్నేక్ క్యాచర్ దుర్గా రాజేష్ పట్టుకుని అటవీప్రాంతంలో వదిలిపెట్టాడు.ఈ చిత్రంలో పడగవిప్పి బుస కొడుతున్న నాగుపాము బెల్లంపల్లి బస్తీలో ఉన్న ఓ వాటర్ ప్లాంట్లో గురువారం వచ్చింది. 6 ఫీట్లకు పైగా పొడువు ఉన్న పామును పట్టుకోబోయిన సీనియర్ స్నేక్ క్యాచర్ దుర్గా రాజేష్ను అరగంటకు పైగా ముప్పు తిప్పలు పెట్టింది. ఆఖరుకు అతికష్టంగా పట్టుకున్నాడు. మంచిర్యాల జిల్లా: పురాతన బొగ్గుగనుల ప్రాంతం బెల్లంపల్లి సర్పాలమయంగా మారింది. నిత్యకృత్యంగా విషసర్పాలు విచ్చలవిడిగా సంచారం చేస్తున్నాయి. జననివాసాలు, ఇళ్ల పరిసరాలు, వీధులు, రోడ్లపై ఎక్కడపడితే అక్కడ స్వైరవిహారం చేస్తున్నాయి. రక్తపింజరలు, నాగుపాములు ఇళ్లలో వచ్చి తిష్ట వేస్తుండగా, తేళ్లు సైతం దూరుతున్నాయి. ప్రాణాంతకమైన సర్పాలు, తేళ్ల బెడద పురప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. వీటి సంచారంతో చిన్నారులు, మహిళలు, వృద్ధులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల అకాల వర్షాలు కురుస్తుండటంతో పుట్టల్లోంచి పాములు, తేళ్లు బయటకు వస్తున్నాయి.ఏ బస్తీలో చూసినా..మున్సిపాలిటీలో 34 వార్డులు ఉండగా వీటిలో సగానికి పైగా వార్డుల్లో పాముల ప్రభావం ఉంది. ముఖ్యంగా అటవీ, శివారుబస్తీలు, మూసివేతకు గురైన కార్మికవాడలు, తుమ్మ, పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి చిత్తడిగా ఉన్న ప్రతీ ప్రాంతం కూడా పాములు, తేళ్లకు నిలయాలుగా మారాయి. శాంతిఖని, 65 డీప్, సుభాష్నగర్, నెంబర్–2 ఇంక్లైన్, రైల్వే రడగంబాల బస్తీ, అంబేడ్కర్ రడగంబాల బస్తీ, పెద్దనపల్లి, సుబ్బారావుపల్లి, కాల్టెక్స్ ఏరి యా, గంగారాం నగర్, గాంధీనగర్, కన్నాల బస్తీ, మధునన్ననగర్, టేకుల బస్తీ, 24 డీప్ ఏరియా, కొత్తబస్టాండ్ ఏరియా ఇందిరమ్మ కాలనీ, కాంట్రాక్టర్ బస్తీ, షంషీర్నగర్, రవీందర్నగర్, అంబేద్కర్నగర్, బెల్లంపల్లి బస్తీ, హన్మాన్ బస్తీ, అశోక్నగర్, బూడిదగడ్డ, బాబుక్యాంపు బస్తీ, గోల్బంగ్లాబ స్తీ తదితర కార్మిక, కార్మికేతర బస్తీల్లో పాములు, తే ళ్ల సమస్య స్థానికులను తీవ్ర వేదనకు గురిచేస్తోంది.వారం రోజుల్లో..పాముల్లో రక్త పింజర, తాచుపాములు ప్రమాదకరమైనవి. వీటి కాటుకు గురైతే ప్రాణాలు కోల్పోయే ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. అవి జన నివాసాల్లో సంచరిస్తుండడం గమనార్హం. కాల్టెక్స్, 65 డీప్ ఏరియా, శాంతిఖని, సుబ్బారావుపల్లి, గంగారాంనగర్, గోల్ బంగ్లాబస్తీ, నెంబర్–2 ఇంక్లైన్, సుభాష్నగర్ తదతర ప్రాంతాల్లో రక్త పింజరల ప్రభావం అ«ధికంగా ఉండగా ఇతర బస్తీల్లో నాగుపాములు సంచరిస్తున్నాయి. ఇళ్ల పరిసరాలు, గల్లీలు, వీధుల్లో పిచ్చిమొక్కలతో చిత్తడి వాతావరణం ఉండగా , కొన్ని బస్తీలను ఆనుకుని అటవీ ప్రాంతం ఉండటం, మూసివేతకు గురైన బొగ్గు గనులు పాములకు స్థావరాలుగా మారడంతో పాముల సమస్య ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది. వారం రోజుల్లో ఏకంగా 30కిపైగా స్నేక్ క్యాచర్లు పట్టుకున్నట్లు సమాచారం. వీటిలో 15 వరకు రక్తపింజరలు ఉండగా మిగతా తాచుపాములు ఉన్నాయి. తేళ్లు కూడా లెక్కలేనన్నీ ఇళ్లలోకి వస్తున్నట్లు పురప్రజలు చెబుతున్నారు. పట్టుకున్న పాములను స్నేక్ క్యాచర్లు ప్లాస్టిక్ బాటిళ్లు, సంచుల్లో వేసి అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి వదిలి పెడుతున్నారు. జననివాసాలకు చేరువలో ఉన్న పిచ్చిమొక్కలను తొలగించి, సర్పాల సమస్యను పరిష్కరించాలని పురప్రజలు కోరుతున్నారు. -
ఇదేం వింత ప్రకటన..రక్తపింజరను పట్టుకురావడమా..?
ప్రభుత్వాలు నేరస్తులను పట్టుకునేందుకు రివార్డులు ప్రకటించడం చూశాం. అంతగా లేకపోతే కాస్త ధనవంతులు తమ వాళ్ల కోసం, లేదా పోయిన వస్తువులు తీసుకొస్తే వేలల్లో డబ్బిస్తామని ప్రకటించడం విని ఉంటారు. ఇలాంటి ప్రమాదకరమైన వింత ప్రకటన గురించి మాత్రం విని ఉండరు. ఇలాంటి వింత ప్రకటన ఇచ్చిన తొలి ప్రభుత్వం ఆ దేశమే కాబోలు. ఏం జరిగిందంటే..బంగ్లాదేశ్లో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఆ దేశ అవామీ లీగ్ పార్టీ జనరల్ సెక్రటరీ షాహ్ మద్ ఇష్తియాక్ ఆరిఫ్ ఓ వింత ప్రకటన చేశాడు. ఆయన ఎవరైనా.. రక్తపింజరి పాముని చంపితే వారికి రూ. 35 వేలకుపైగా పారితోషకం ఇస్తామని ప్రకటించాడు. అందుకు సంబంధించిన విషయం నెట్టింట తెగ వైరల్ అయ్యింది కూడా. ఆ తర్వాత రోజునే మాట మార్చి రక్తిపంజరిని పట్టుకొచ్చిన వారికే ఆ రివార్డు అని ప్రకటించాడు ఆరిఫ్. అయితే అలియాబాద్ యూనియన్లో రెజాల్ అనే రైతు ఈ విషయం తెలుసుకుని బహుమతి ఎలాగైన పొందాలని అనుకుంటాడు. అనుకున్నదే తడువుగా రక్తపింజరని రెజాల్ తన స్నేహితుల సాయంతో ప్రాణాలు పణంగా పెట్టి మరీ పట్టుకున్నాడు. దాన్ని ఓ పెద్ద వంటపాత్రలో ప్యాక్ చేసి నేరుగా ఫరిదీపూర్ ప్రెస్క్లబ్కి తీసుకువచ్చాడు. అయితే ఆ ప్రభుత్వం రెజాల్కు మొండి చేయి చూపి ఇంతవరకు ఎలాంటి పారితోషకం అందజేయలేదు. ఇక ఎదురు చూసి.. చూసి.. రెజాల్ రెండు రోజుల క్రితమే ఆ పాముని చంపినట్లు తెలిపాడు. ఇలా రెజాల్ మాదిరిగా చాలామంది ఆ ప్రకటనను చూసి రక్తపింజర్లను పట్టుకుని నగరానికి వస్తుండటం గమనార్హం. వారందరికీ కూడా ఎలాంటి రివార్డు దక్కలేదు. అయితే సదరు పార్టీ నేత మాటమార్చి.. పాములు పర్యావరణంలో భాగమే. కాకపోతే ఫరీద్పూర్ ప్రజలు వీటివల్ల భయపడుతున్నారని ఇలా ప్రకటించామే తప్ప ప్రతిఫలం ఇస్తామనలేదంటూ బుకాయించాడు. పైగా ప్రకటించిన రివార్డు గురించి ఊసెత్తిన పాపాన పోలేదు. అబ్బా..! నాయకులు ఎంతలా మాట మార్చగలరు అని అక్కడ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. నిజానికి ఇలా ప్రకటించడం చట్ట విరుద్ధమని ఫరీద్పూర్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ గోలమ్ ఖుద్దూస్ భుయాన్ అన్నారు. నిజానికి ఈ పారితోషకం కోసం ప్రాణాలు పణంగా పెట్టారు వారంతా..ఒకవేళ ఆ క్రమంలో చనిపోవడం లేదా గాయపడటం జరిగితే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ఫైర్ అయ్యారు. ఇలాంటి ప్రకటనలు కారణంగా చాల పాములు చనిపోయే అవకాశం ఉంటుందన్నారు. వాటిని పట్టుకున్న వారంతా మనుషులు సంచరించిన ప్రదేశంలో విడిచిపెట్టాలని సదరు ఫారెస్ట్ ఆఫీసర్ విజ్ఞప్తి చేశారు కూడా. (చదవండి: పసుపు ఆరోగ్యంపై ఇంతలా ప్రభావవంతంగా పనిచేస్తుందా?) -
పాము విషంతో కరోనాకు చెక్!?
సాక్షి,న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సృష్టించిన కలకలం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఇండియాలో రెండో దశలో కరోనా మహమ్మారి వేలమందిని బలితీసుకుంది. అటు మూడో వేవ్ తప్పదన్న నిపుణుల హెచ్చరికలు ఆందోళన పుట్టిస్తున్నాయి. ఈనేపథ్యంలో ఓ పాము విషంతో కరోనాకు చెక్ పెట్టొచ్చని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. ప్రారంభ దశలోనే కరోనాకు చెక్ పెట్టవచ్చని బ్రెజిల్లోని పరిశోధకుల బృందం తేల్చింది. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బ్రెజిల్ అడవుల్లో కనిపించే సర్పం జరారాకుసోకు చెందిన విషంతో కోవిడ్19ను అంతం చేయవచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సైంటిఫిక్ జర్నల్ మాలిక్యూల్స్మెడికల్ జర్నల్లో ప్రచురించిన ఒక అధ్యయనం అణువులు జరారాకుసు పిట్ విషం ద్వారా ఉత్పత్తైన అణువు కోతి కణాలలో వైరస్ సామర్థ్యాన్ని 75శాతం నిరోధించింది. జరారాకుసో విషంలో ఉండే పెప్టైడ్ అణువులు వైరస్లో రెట్టింపవుతున్న ముఖ్యమైన ప్రోటీన్ను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుందని సావోపౌలో బుటాంటన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాఫేల్ గైడో రాయిటర్స్తో చెప్పారు. అంతేకాదు ఈ పెప్టైడ్ అణువులను ల్యాబ్ల్లోనూ అభివృద్ధి చేయవచ్చని గైడో తెలిపారు. బ్రెజిల్ అడవుల్లో జరరాకుసోను వేటాడటానికి బయలుదేరిన వ్యక్తుల పట్ల ఆయన అందోళన వ్యక్తం చేశారు. వారు ప్రపంచాన్ని కాపాడాలని అనుకుంటున్నారు కానీ పద్ధతి ఇది కాదనీ, కేవలం విషంతోనే కరోనాను నయం చేయలేమనేది గుర్తించాలన్నారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఇంకా అధ్యయన దశలోనే ఉన్నారు. కాగా బ్రెజిల్లో కనిపించే అతిపెద్ద సర్పంగా జరారాకుసోకు సుమారు రెండు మీటర్ల పొడవు ఉంటాయి. అట్లాంటిక్ తీర ప్రాంత అడవులతో పాటు బొలివియా, పరాగ్వే, అర్జెంటీనా దేశాల్లో ఈ సర్పాలు సంచరిస్తుంటాయి. -
ప్రభుత్వాస్పత్రికి వస్తే ప్రాణాలే పోయాయి
వైద్యశాలలో నిండుకున్న వ్యాక్సిన్లు పాముకాటుతో వ్యవసాయ కూలీ మృతి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతుడి బంధువుల ఆందోళన రేపల్లె ప్రధాన రహదారిపై మృతదేహంతో నిరసన పోలీసుల జోక్యంతో ఆందోళన విరమణ ప్రభుత్వ వైద్యశాలల్లో అన్ని వసతులు ఉన్నాయని, నిరంతరం వైద్యులు అందుబాటులో ఉండటంతో పాటు అన్ని రకాల మందులు సిద్ధంగా ఉన్నాయని గ్రామసభల్లో పాలకులు ప్రచారం చేస్తే నిజమేననుకున్నాం. పాముకాటుకు గురై ప్రాణాపాయ స్థితిలో వ్యక్తిని బతికించుకుందామని తీసుకొచ్చాం. తీరా వచ్చాక వైద్యులు సకాలంలో స్పందించలేదు. మందుల్లేవని చావుకబురు చల్లగా చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రాణాలు దక్కేవి.’ అంటూ మృతుడి బంధువులు బోరున విలపించారు. మృతదే హంతో రాస్తారోకో చే శారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన రేపల్లె పట్టణంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. రేపల్లె మండలంలోని గుడ్డికాయలంక గ్రామానికి చెందిన చిట్టిమోతు ప్రసాద్(50) వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం వేకువజామున గ్రామ సమీపంలోని ఓ పొలంలో గడ్డి మోపులు కట్టేందుకు వెళ్లారు. గడ్డిలో ఉన్న పాము ప్రసాద్ భుజంపై కాటు వేసింది. కాలువేసింది రక్తపింజరిగా గుర్తించిన ప్రసాద్ వెంటనే విషయాన్ని చుట్టుపక్కల వారికి తెలిపాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది బాధితుడిని రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషమంగా ఉన్న ప్రసాద్కు చికత్స చేసే విషయంలో వైద్యులు సకాలంలో స్పందించలేదని, పాము కాటుకు విరుగుడు మందులు కూడా అందుబాటులో లేకపోవటంతోనే మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. మందులు అందుబాటులో ఉంటే ప్రసాద్ ప్రాణాలు పోయేవికావంటూ ఆసుపత్రి ఆవరణంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. గతంలో జరిగిన గ్రామసభల్లో ప్రభుత్వ వైద్యులు, పాలకులు ప్రభుత్వ వైద్యశాలలో అన్ని వసతులు, మందులు ఉన్నాయని ప్రచారం చేస్తేనే ఇక్కడికి తీసుకువచ్చామని విలపించారు. ఇలాగైతే ప్రభుత్వ వైద్యశాల పట్ల నమ్మకం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ప్రధాన రహదారిపై మృతదేహాన్ని ఉంచి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పట్టణ సీఐ వి.మల్లికార్జునరావు ఆధ్వర్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి రాస్తారోకోను విరమింపజేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


