breaking news
Vijay Gupta
-
రొయ్యలకు దేశంలోనే డిమాండ్ పెంచాలి!
ఆక్వాకల్చర్ ప్రపంచంలో రాణించిన అరుదైన భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ గుప్తా. 86 ఏళ్ల క్రితం బాపట్ల జిల్లాలో పుట్టారు. ఆక్వా కల్చర్ నిపుణుడిగా లావోస్ నుంచి బంగ్లాదేశ్ వరకు 22 ఆసియా, ఆఫ్రికా దేశాల్లో విశేష సేవలందించారు. సామాన్య ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తెచ్చారు. నిస్వార్థ సేవలకు గుర్తింపుగా అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ప్రపంచ ఆహార పురస్కారం’ (2005), నోబెల్తో సరితూగే ‘సన్హాక్ శాంతి పురస్కారం ’(2015) అందుకున్నారు.పదవీ విరమణ అనంతరం హైదరాబాద్లో నివసిస్తున్న డా. విజయ్ గుప్తాను ‘సాక్షి సాగుబడి’ పలుకరించింది. ట్రంప్ సుంకాల నేపథ్యంలో అమెరికాయేతర మార్కెట్లను వెతకటంతో పాటు.. దేశీయ మార్కెట్లలో మౌలిక సదుపాయాలు కల్పించి చేపలు, రొయ్యలకు డిమాండ్ పెంచుకోవటానికి పుష్కలంగా ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యాంశాలు..86 ఏళ్ల వయసులో 66లా ఉన్నారు.. మీ ఆరోగ్య రహస్యం ఏమిటి?డా. విజయ్ గుప్తా: ఏమీ లేదు. కష్టపడి పనిచెయ్యటమే. పనితో వయసును జోడించి చూడకూడదండి.. మీరు చెయ్యగలిగినంత కాలం పని చేస్తూనే ఉండాలి. జీవితంలో మీరు ఏమి చెయ్యదలచుకున్నారో ఆ పనిలో సంతృప్తి కోసం పాటుపడాలి. చాలా మంది ధనంలోనే సంతృప్తిని వెదుక్కుంటూ ఉంటారు. కానీ, అది వాస్తవం కాదు. ధనార్జన ఇచ్చే సంతృప్తి పరిమితమైనది. మీరు ఎవరికైనా సహాయంతో అభివృద్ధి చెందిన వాళ్లు చూపే ఆదరణతో లభించే ఆత్మసంతృప్తి అనంతమైనది.2015లో దక్షిణ కొరియా ప్రభుత్వం సన్హాక్ శాంతి బహుమతి నాకు ఇచ్చింది.దానికి ముందు నేను గతంలో పనిచేసిన దేశాల్లో ప్రజల స్పందనను తెలుసుకునేందుకు నాతో పాటు పాత్రికేయులను పర్యటనకు పంపింది. బంగ్లాదేశ్లో ఆరేళ్లు పనిచేసిన నేను పదిహేనేళ్ల తర్వాత మళ్లీ అక్కడి గ్రామాల్లోకి వెళ్తే.. మహిళా రైతులు నన్ను గుర్తిపట్టి చాలా సంబరపడ్డారు. మీరు నేర్పిన ఆక్వా సాగు వల్ల మా పూరి గుడిసెలు ఇప్పుడు పక్కా భవనాలయ్యాయని చూపించి కృతజ్ఞతలు తెలిపారు. ఆ క్షణాల్లో వారి మొహాల్లో నవ్వును చూసినప్పుడు నాకు ఎంతో ఆత్మసంతృప్తి కలిగింది. అది ఏ బహుమతులతోనూ దొరకదు..!బంగ్లాదేశ్ ఆక్వా రైతు మిమ్మల్ని అంతగా గుర్తుపెట్టుకోవటానికి కారణం ఏమిటి?అక్కడ ఆరేళ్లు పనిచేశా. బంగ్లాదేశ్ అంతా లోతట్టు ప్రాంతం. స్థానికంగా ప్రజలు గుంతలు తవ్విన మట్టిని ఎత్తుగా పోసి, వాటిపైన గుడిసెలు వేసుకొని జీవిస్తుంటారు. ఆ గుంతల్లో గుర్రపుడెక్క, దోమలు పెరిగి సమస్యగా ఉండేది. తినటానికి జనానికి తిండి లేదు. అటువంటి స్థితిలో ఆ చిన్న గుంతల్లోనే పెంచుకొని తినే చిన్న సైజు చేపల సాగు సాంకేతికతలను అభివృద్ధి చేశాం. స్థానిక స్వచ్ఛంద సంస్థల ద్వారా రైతుల బృందాలను కూడగట్టాం. ఉమ్మడి బాధ్యతతో కూడిన బృంద రుణాలు ఇప్పించాం. తద్వారా పేద రైతులను అధిక వడ్డీల విషచక్రం నుంచి, ఆహార అభద్రత నుంచి బయటపడేశాం. యూఎన్ఎయిడ్ చరిత్రలోనే బెస్ట్ ప్రాజెక్ట్గా మాకు గుర్తింపు రావటం ఓ మధుర స్మృతి. ప్రభుత్వం అందుకు ఏం చెయ్యొచ్చు..?ఒక్క రొయ్యలకే కాదు, చేపలకు కూడా మన నగరాలు, పట్టణాల్లో అపారమైన మార్కెటింగ్ అవకాశాలున్నాయి. ప్రొటీన్ ఆహారానికి డిమాండ్ ఉన్నా చేపలు, రొయ్యలను చాలా మంది తినకపోవటానికి కారణం.. వాటిని విక్రయించే పద్ధతులు సరిగ్గా లేకపోవటమే. జూబ్లీహిల్స్లో ఇప్పటికీ చేపలను రోడ్డుపక్కన పెట్టి అపరిశుభ్ర పరిస్థితుల్లో అమ్ముతున్నారు. అసలు మెరుగైన మార్కెటింగ్ కల్పించాలన్న చైతన్యం లేదు. నగరాలు, పట్టణాల్లో ఆధునిక వసతులతో ప్రత్యేక దుకాణాలు తెరవాలి. విలువ జోడించి మార్కెటింగ్ గొలుసును నిర్మిస్తే.. చేపలు, రొయ్యలను ప్రజలు బాగా తింటారు. సబ్సిడీలివ్వటం కాదు, మౌలిక సదుపాయాలు కల్పించాలి. పోషకాల పరంగా అడ్వాంటేజ్ ఉందా?పోర్క్, బీఫ్, పౌల్ట్రీతో పోల్చితే చేపలు, రొయ్యల్లో పోషకాలు చాలా ఎక్కువ. కంపేరిటివ్ స్టడీస్ కూడా వచ్చాయి. పర్యావరణ పరంగా చూసినా ఆక్వా ఉత్పత్తులే మెరుగైనవి. ఒకటిన్నర కేజీల మేత వేస్తే కిలో చేపల్ని పెంచే సాంకేతికత అందుబాటులో ఉంది. ఇతర జంతువులకు 12 కిలోల మేత పెడితే గాని ఒక కిలో ఉత్పత్తి రాదు. పశువుల పెంపకం కోసం విస్తారంగా గడ్డి భూములు కావాలి. చేపలు, రొయ్యలు నీటిలో పెరుగుతాయే కానీ అవి నీరు తాగవు. మార్కెటింగ్, కోల్డ్ చెయిన్ సదుపాయాల కొరత, ఆరోగ్య ప్రయోజనాలపై ప్రచార లోపమే సమస్య. యూరోపియన్ యూనియన్ కఠిన నియమాలను అధిగమించేదెలా?ట్రేసబిలిటీ వంటి సదుపాయాలు అన్ని దేశాల్లోనూ అందుబాటులో ఉన్నాయి. అందువల్ల కెమికల్ రెసిడ్యూ లేని విధంగా సస్టయినబుల్ ఫిష్ ప్రొడక్షన్ పద్ధతులను ఆక్వా రైతులకు, పరిశ్రమదారులకు ప్రభుత్వం నేర్పించాలి. తెలిసో తెలియకో మందులు వాడుతున్న మన చిన్న, సన్నకారు రైతులకు లోతైన అవగాహన కల్పించాలి. టెక్నాలజీ ఇవ్వాలి. ఇలా చేస్తే అధిక ధర వచ్చే విదేశీ మార్కెట్లు ఉన్నాయి. ఆఫ్రికాలో ఇలా చేశారు. మన ప్రభుత్వాలు కూడా చెయ్యాలి. అమెరికాయేతర దేశాలతో కూడా ట్రేడ్ అగ్రిమెంట్లకు ప్రయత్నం చెయ్యాలి. ప్రపంచ ఆహార భద్రత భవిష్యత్తు ఎలా ఉంటుంది?రాబోయే 20–30 సంవత్సరాల్లో జంతువులను మాంసం కోసం పెంచటం చాలా ఇబ్బందుల్లో చిక్కుకుంటుంది. జనాభాతో పాటు వారి కొనుగోలు శక్తి పెరుగుతోంది. ఇది ఆసియా దేశాల్లో ఆక్వా అభివృద్ధికి చాలా మంచి అవకాశం. జలవనరులు ఎక్కువగా ఉన్న మన దేశానికి ఇది గొప్ప అవకాశం. అయితే, మన ఆక్వా రంగం ఉత్పాదకతను పెంచుకోవాలి. మన ఉత్పాదకత ఎందువల్ల తక్కువ?ఉప్పునీటి, మంచినీటి చేపలు, రొయ్యల సాగు రంగంలో మనకున్న వనరుల్లో 30–40% మాత్రమే ఇప్పటికి వాడుకుంటున్నాం. ఇంకా పెంచుకోవటానికి చాలా అవకాశం ఉంది. ఉత్పాదకత పెరగాలంటే దేశీయంగా వినియోగం పెరగాలి. మార్కెటింగ్ మౌలిక సదుపాయాలు పెంపొందిస్తే డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ డ్రైవెన్ ఎకానమీగా గుర్తించి ప్రభుత్వాలు ఆక్వా రంగంపై దృష్టి కేంద్రీకరిస్తే రైతులు అందుకుంటారు. – ఇంటర్వ్యూ: పంతంగి రాంబాబు ఫొటో: ఎస్.ఎస్. ఠాకూర్ఆక్వా ఉత్పత్తుల మార్కెటింగ్ పెరిగే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి?కోళ్ల పరిశ్రమతో సరిపోల్చి చూడండి.. 15–20 ఏళ్ల క్రితం కోడి మాంసం తినాలంటే కోడిని కొనుక్కొచ్చి ఇంటి దగ్గర కోసుకునే వాళ్లు. ఇప్పుడు ఎక్కడ చూసినా కోళ్లను కోసి మాంసం అమ్మే దుకాణాలొచ్చేశాయి. కాబట్టే వినియోగదారులు కోడి మాంసాన్ని ఇంత ఉత్సాహంగా వాడుతున్నారు. చేపలు, రొయ్యల అమ్మకానికి, పౌల్ట్రీ మాదిరిగా, మార్కెటింగ్ సదుపాయాలు, విలువ జోడింపు మౌలిక సదుపాయాలను పెద్ద ఎత్తున కల్పించాలి. మార్కెట్ సృష్టిస్తే చేపలు, రొయ్యల ఉత్పత్తిని ఇంకా పెంచుకోవటానికి రైతులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. చేపలు, రొయ్యల పౌష్టికాహార విలువలు, ఆరోగ్య ప్రయోజనాలపై విస్తృతంగా ప్రచార మాధ్యమాల్లో ఎగ్ క్యాంపెయిన్ మాదిరిగా ప్రచారోద్యమం చేపట్టాలి.దేశీయంగా రొయ్యలు ఎక్కువగా తినకపోవటానికి కారణం?ప్రపంచవ్యాప్తంగా ఆక్వా ఉత్పత్తులను ఏడాదికి తలసరి వినియోగం 22 కిలోలు. బంగ్లాదేశ్లో 30–40 కిలోల వరకు ఉంటుంది. మన దేశంలో 6 కిలోలంటారు. కచ్చితమైన గణాంకాలు లేవు. మనవాళ్లు రొయ్యలు ఎక్కువగా తినకపోవటానికి ధర ఎక్కువ కావటం ఒకటి. మరొక అపోహ ఏమిటంటే.. రొయ్యలు తింటే కొలెస్ట్రాల్ ఉంటుందని. అది అపోహే. చేపలతో కూడా ప్రాబ్లమ్ ఏమీ లేదు. నీట్గా ఉండే కోయిస్క్లను ఏర్పాటు చేస్తే వినియోగం పెంచవచ్చు. ప్రభుత్వం నగదు ఇన్సెంటివ్లు ఇవ్వటం కాదు. కోల్డ్చెయిన్, మౌలిక సదుపాయాలు కల్పించాలి. -
‘గిఫ్ట్’ తిలాపియా చేపల సాగుతో ...పోషకాహార భద్రత!
• ‘గిఫ్ట్’ తిలాపియా చేపల సాగుకు కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహం • ‘ ‘ఏక లింగ’ తిలాపియా చేపలతో స్థానిక చేప జాతుల మనుగడకు ముప్పేమీ ఉండదు • ‘ మన చిన్న రైతులకు ఆహార భద్రత.. ప్రపంచ మార్కెట్లకు ఎగుమతులకూ అవకాశం • ‘మొజాంబిక్ తిలాపియా’ సాగుపై తెలంగాణ ప్రభుత్వ ఆంక్షలు సమంజసమే • ‘ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ విజేత, ప్రసిద్ధ ఆక్వా నిపుణుడు డా. విజయ్ గుప్తాతో ఇంటర్వ్యూ చిన్న కుంటల్లో విస్తారంగా ‘గిఫ్ట్’ తిలాపియా చేపల సాగు ద్వారా చిన్న-సన్నకారు రైతులు, పేదలకు పోషకాహార భద్రతను అందించవచ్చని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆక్వాకల్చర్ నిపుణులు డాక్టర్ మోదడుగు విజయ్ గుప్తా ‘సాక్షి సాగుబడి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. చెరువుల్లో తిలాపియా సంతానోత్పత్తిని అరికట్టేందుకు మగ పిల్లలను ఉత్పత్తి చేసి రైతులకు ఇస్తున్నందున జీవవైవిధ్యానికి ముప్పు ఉండదన్నారు. గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించిన డా. గుప్తా.. ఖండాంతరాల్లో ఆక్వా దిగుబడుల పెంపుదలకు విశేష కృషి చేసి.. నీలి విప్లవ పితామహునిగా గుర్తింపు పొందారు. లక్షలాది మంది చిన్న, సన్నకారు రైతులకు ఉపకరించే చేపల సాగు పద్ధతులను రూపొందించడం ఆయన ప్రత్యేకత. ప్రపంచ ఆహార పురస్కారాన్ని(2005), సన్హక్ శాంతి పురస్కారం(2015) అందుకున్నారు. వ్యవసాయక జీవవైవిధ్యంపై ఇటీవల ఢిల్లీలో జరిగిన తొలి సదస్సులో ప్రధాని మోదీ నుంచి పురస్కారాన్ని అందుకున్నారు. ఆక్వాకల్చర్పై ఏపీ ప్రభుత్వానికి గౌరవ సలహాదారుగా ఉన్నారు. తిలాపియా వంటి విదేశీ జాతుల చేపల వల్ల దేశంలోని జల వనరుల్లో స్థానిక జాతుల మత్స్య సంపదకు ముప్పు వచ్చి పడిందన్న వార్తలు దక్షిణాది రాష్ట్రాల్లో ఇటీవల వెలువడుతున్నాయి. మన జలవనరుల్లో సంప్రదాయ చేపల మనుగడకు గొడ్డలిపెట్టుగా మారిందని గుర్తించి, ఈ తిలాపియా చేపల సాగుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అయితే, మరోవైపు తిలాపియా చేపల సాగును కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. మీరేమంటారు? ప్రపంచవ్యాప్తంగా 9 రకాల తిలాపియా చేపలు సాగులో ఉన్నాయి. అందులో మొజాంబిక్ తిలాపియా (ైట్ఛౌఛిజిటౌఝజీట ఝౌటట్చఝఛజీఛిఠట) అనే రకం చేపల సాగుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అయితే, కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది మరొక రకం. దాని పేరు నైల్ తిలాపియా. దాని శాస్త్రీయ నామం ైట్ఛౌఛిజిటౌఝజీట జీౌ్టజీఛిఠట . ఈజిప్ట్లోని నైలు నది పరీవాహక ప్రాంతంలో పెరగడం వల్ల ఆ పేరు వచ్చింది. మొజాంబిక్ తిలాపియా చేప సైజు అంతగా పెరగదు. నైల్ తిలాపియా పెద్ద సైజుకు పెరుగుతుంది. అంతర్జాతీయంగా, వాణిజ్యపరంగా గుర్తింపు పొందిన రకం ఇది. ప్రస్తుతం 170 దేశాల్లో సాగవుతోంది. ఏటా 50 లక్షల టన్నుల మేరకు ఉత్పత్తవుతోంది. దీని సాగుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని రిజర్వాయర్లలో కేజెస్లో కూడా దీన్ని పెంచుతున్నారు. నిజానికి తిలాపియా చేపలు ఆఫ్రికాలో పుట్టినవైనప్పటికీ 1950వ దశకం నుంచి మన దేశంలో ఉన్నాయి. విదేశీ చేప అయినందువల్ల తిలాపియా సాగును అనుమతించాలా లేదా అన్న తటపటాయింపు చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. అనేక కమిటీలు ఏర్పడినప్పటికీ నిర్ణయం తీసుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (ఎన్.ఎఫ్.డి.బి.) ఐదారేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వాన్ని దీనిపై నిర్ణయం తీసుకోమని కోరింది. అప్పుడు కేంద్రం నియమించిన కమిటీ నైల్ తిలాపియా సాగుకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. మొజాంబిక్ తిలాపియా కాదు. అప్పుడు కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం ఇటీవల మొజాంబిక్ తిలాపియా సాగుపై ఆంక్షలు విధించడం సమంజసమే. ► మత్స్య సంపద జీవవైవిధ్యానికి దీని సాగు వల్ల ముప్పు ఉందనే విషయంపై మీ అభిప్రాయం..? జీవవైవిధ్య పరిరక్షణ అత్యవసరమైన అంశమన్నది నా అభిప్రాయం. ఆఫ్రికాలో చాలా సదస్సులు కూడా నిర్వహించాను. అయితే, కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోలో పేర్కొన్న విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకొని సాగు చేస్తే నైల్ తిలాపియా జీవవైవిధ్యానికి ముప్పుగా పరిణమించదన్నది నా అభిప్రాయం. నైల్ తిలాపియా తల్లి చేపల నుంచి రూపొందించిన ‘గిఫ్ట్’ తిలాపియా చేపల సాగుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర ప్రభుత్వాలు కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలనే అనుసరిస్తున్నాయి. అయితే, ఇక్కడ ఉన్న ఒక సమస్య ఏమిటంటే.. మన దేశవాళీ చేపల కన్నా చాలా వేగంగా సంతతిని పెంపొందించుకునే ప్రత్యేక లక్షణం తిలాపియాకు ఉంది. అందువల్లే అవాంఛిత చేప (వీడ్ ఫిష్)గా దీనికి పేరొచ్చింది. 4,5 నెలల వయసులోనే ఇది గుడ్లు పెట్టడం ప్రారంభిస్తుంది. బొచ్చె తదితర కార్పు చేపలకైతే రెండేళ్లు పడుతుంది. తిలాపియా చేప వెయ్యి నుంచి 2 వేల గుడ్లు పెడుతుంది. ఏదైనా ప్రమాదం ఉందంటే పిల్లలను నోట్లో దాచుకొని కాపాడుతుంది. కాబట్టి 95 శాతం పిల్లలు బతుకుతాయి. మన చేపలు గుడ్లు పెట్టి వదిలేస్తాయి. 1 శాతం పిల్లలు మాత్రమే బతకగలుగుతాయి. అందుకని.. ఒక ఏడాదిలోనే తిలాపియా చేపల సంతతి బాగా పెరిగిపోతుంది. మొజాంబిక్ తిలాపియా, నైల్ తిలాపియా రెంటిల్లోనూ ఇదే సమస్య. అందువల్లనే కేంద్ర ప్రభుత్వం మోనో సెక్స్ ‘గిఫ్ట్’ తిలాపియా చేప పిల్లల సాగుకు అనుమతి ఇచ్చింది. ► మోనో సెక్స్ చేప పిల్లలంటే..? చేపల జీవవైవిధ్యానికి నష్టం జరగకుండా ఉండడం కోసం మోనో సెక్స్ (ఏక లింగ) తిలాపియా చేప పిల్లల సాగుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మోనో సెక్స్ అంటే.. పిల్లలన్నీ మగవే ఉంటాయి. హాచింగ్ ప్రక్రియ మొదటి 20 రోజుల్లో పరిమిత మోతాదులో హార్మోన్లు కలిపిన మేత వేస్తారు. దీని వల్ల ఆడ పిల్లలు కూడా మగ పిల్లలుగా మారిపోతాయి. కృష్ణా జిల్లాలోని రాజీవ్గాంధీ సెంటర్ ఫర్ ఆక్వాకల్చర్ ఇలా రూపొందించిన ‘గిఫ్ట్’ తిలాపియా చేపలను రైతులకు అందిస్తున్నది. మలేషియా నుంచి మేలైన నైల్ తిలాపియా తల్లి చేపలను దిగుమతి చేసుకుంటున్నారు. స్థానికంగా నేచురల్ సెలక్షన్ ద్వారా జన్యుపరంగా అభివృద్ధి చేసిన ‘గిఫ్ట్’ (జెనిటికల్లీ ఇంప్రూవ్డ్ ఫామ్ తిలాపియా) తిలాపియా పిల్లలను రైతులకు ఇస్తున్నారు (జన్యుమార్పిడి కాదు). రైతులకు ఇచ్చే గిఫ్ట్ తిలాపియా పిల్లల్లో 92 - 95 శాతం వరకు మగవే ఉంటాయి. కాబట్టి తామర తంపరగా సంతతి పెరిగే ప్రమాదం ఉండదు. కొందరు రైతులు థాయ్లాండ్ నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నారు. ► లింగ మార్పిడి హార్మోన్ల వల్ల వినియోగదారుల ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదా? చేప పిల్ల పుట్టిన 20 రోజుల్లోగానే మేత ద్వారా పరిమిత మోతాదులో హార్మోన్లు ఇస్తారు. ఆ తర్వాతే చేప పిల్లలు రైతులకు ఇస్తారు. ఆ తర్వాత మామూలు మేతతో పెంచుతారు. కాబట్టి వినియోగదారుల ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో దీనికి మంచి ధర పలుకుతోంది. అమెరికాలో గిఫ్ట్ తిలాపియా చేప కిలో 12 డాలర్లు పలుకుతోంది. ► కాబట్టి ఏ రకంగా చూసినా ‘గిఫ్ట్’ తిలాపియాను దూరంగా ఉంచాల్సిన అవసరం లేదంటారా..? ఏక లింగ తిలాపియా పిల్లలను రైతులకు ఇస్తున్నాం కాబట్టి భయమేమీ అవసరం లేదు. నిశ్చింతగా పెంచుకోవచ్చు, తినొచ్చు. గిఫ్ట్ తిలాపియా పిల్లల్లో కొద్ది శాతం ఆడ పిల్లలు కూడా ఉంటాయి. అందుకే, జీవవైవిధ్య పరిరక్షణ దృష్ట్యా జీవభద్రతా చర్యలు తీసుకోవాలని కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలలో పేర్కొంది. ► రైతు స్థాయిలో తీసుకునే జీవభద్రతా చర్యలు ఏమిటి? రైతులకు ఇచ్చే ‘గిఫ్ట్’ తిలాపియా ఏక లింగ చేప పిల్లల్లో కూడా కొద్ది శాతం మేరకు ఆడ పిల్లలు కూడా ఉంటాయి. అందువల్ల చెరువుల్లో నుంచి నీటిని బయటకు (సరస్సులు, నదుల్లోకి) వదిలేటప్పుడు ఈ చేపలు బయటకు వెళ్లకుండా అరికట్టే జల్లెళ్లను ఏర్పాటు చేయమని చెబుతున్నాం. నీటిని వదిలేసిన తర్వాత చెరువుల్లో సున్నం చల్లుతారు. అప్పటికి ఇంకా చేప పిల్లలు, గుడ్లు ఏమైనా మిగిలి ఉంటే చనిపోతాయి. ఎండగట్టిన చెరువులో తర్వాత మళ్లీ ఏకలింగ చేప పిల్లలు తెచ్చి వేసి పెంచుకుంటారు. కాబట్టి సమస్య ఉండదు. ► గిఫ్ట్ తిలాపియా చేపల సాగులో ఉన్న సౌలభ్యం ఏమిటి? ఏక లింగ తిలాపియాలో ఆడ చేప కన్నా మగ చేప వేగంగా పెరుగుతుంది. ఏక లింగ గిఫ్ట్ తిలాపియా చేప పిల్లలు.. సాధారణ కార్పు చేపల కన్నా వేగంగా పెరుగుతాయి. చెరువుల్లో, ఇళ్ల దగ్గర కుంటల్లో మామూలుగా అయితే 5-6 నెలల్లోనే 150 - 200 గ్రాముల సైజుకు ఎదుగుతాయి. ఇంటెన్సివ్ ఫార్మింగ్లో అయితే 4 నెలలకే పెరుగుతుంది. ఎక్కువ విస్తీర్ణంలో పెంచితే కిలో రూ. 50 - 60కే స్థానిక పేద ప్రజలకు అందించవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయడానికి అనువైన కమోడిటీ ‘గిఫ్ట్’ తిలాపియా. 700 - 800 గ్రాముల బరువుకు పెంచితే ఎగుమతి చేయడానికి వీలుగా ఉంటుంది. ముల్లు తీసేసి.. చేప మాంసాన్ని ఎగుమతి చేస్తారు. ► మన దగ్గర నుంచి తిలాపియా ఎగుమతి అవుతోందా? చాలా తక్కువండి. మనం ఇప్పుడు ప్రారంభ దశలోనే ఉన్నాం. కంటూన్యూయస్ సప్లయిస్ ఉంటేనే ఎక్స్పోర్ట్ మార్కెట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. తగిన పరిమాణంలో ఉత్పత్తి పెంచడం, నాణ్యతా ప్రమాణాలు పాటించ గలిగితే తిలాపియా ఎగుమతులు చేయొచ్చు.. ఆంధ్రలో ఫిష్ ఫార్మర్స్ నిజానికి విస్తృతంగా 50 - 200 ఎకరాల్లో పెంచుతున్నారు. అందుకే వీరిని వ్యాపారవేత్తలని పిలవాలి. ‘గిఫ్ట్’ తిలాపియా నిజానికి పావెకరం, అరెకరం, ఎకరం పొలమున్న చిన్న, సన్నకారు రైతులకు అనువైనది. ► తిలాపియా సాగు చిన్న, సన్నకారు రైతులకు ఎలా అనువైనదంటారు? చిన్న చిన్న కుంటలు, దొరువుల్లో కూడా వేగంగా పెంచుకోవచ్చు. ప్రతికూల పరిస్థితులను తట్టుకునే గుణం దీనికుంది. ఆక్సిజన్ కొంచెం తక్కువగా ఉన్నా, నీటి నాణ్యత అంత బాగోలేకపోయినా పెరుగుతుంది. తక్కువ సాంద్రతలో వేసి (ఎక్స్టెన్సివ్ పద్ధతుల్లో) పెంచేటప్పుడు ప్రొటీన్లు అధికంగా ఉండే మేత వేయాల్సిన అవసరం కూడా ఉండదు. అందుకనే దీన్ని పూర్ మాన్ ఫిష్ అంటారు. కాబట్టే ‘గిఫ్ట్’ తిలాపియాకు ‘ఆక్వాటిక్ చికెన్’ అని పేరొచ్చింది. పెరట్లో కోళ్లు సులువుగా పెంచుకుంటాం కదండి.. అలాగే దీన్ని ఇళ్ల దగ్గర చిన్న కుంట ఉన్నా నిశ్చింతగా పెంచుకోవచ్చు. పెద్ద సాంకేతిక పరిజ్ఞానం ఏమీ అక్కర్లేదు. ► మంచినీటి కార్పు చేపలు పెరిగే దాని కన్నా తక్కువ నీటి నాణ్యత ఉన్నా సరిపోతుందా? అవునండి. కొల్లేటి ప్రాంతంలో చేపలను మీటరున్నర - రెండు మీటర్ల లోతు నీటిలో పెంచుతుంటారు. కొంచెం ఆక్సిజన్ తగ్గినా చేపలు చనిపోతూ ఉంటాయి. తిలాపియాకు అంత సమస్య ఉండదు. అర మీటరు నుంచి మీటరు లోతు నీరున్నా, ఆ నీరు అంత నాణ్యంగా లేకపోయినా పెరుగుతాయి. వానాకాలంలో నాలుగైదు నెలలు నీళ్లుండే సీజనల్ చెరువులు కూడా తిలాపియా పంట తీసుకోవచ్చు. అప్పటికే 200 గ్రాముల బరువు వస్తుంది. చెరువు కొద్ది నెలల్లో ఎండిపోతుంది కాబట్టి జీవవైవిధ్యానికీ సమస్య ఉండదు. నీటిని సరస్సులు, నదుల్లోకి వదలకుండా జాగ్రత్తపడితే.. తెలంగాణ వంటి చోట్ల కూడా చెరువుల్లో గిఫ్ట్ తిలాపియా పెంచుకోవచ్చు. ► చిన్న కుంటల్లో చిన్న రైతులు పెంచడానికి వీలైన చేపలు ఇంకేమి ఉన్నాయి? మూల అనే చిన్న చేప ఉంది. విటమిన్-ఎ ఎక్కువగా ఉంటుంది. 3-4 అంగుళాలు పెరుగుతుంది. ఐదారు గ్రాముల బరువు పెరగ్గానే తినొచ్చు. చాలా దేశాల్లో, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో దీన్ని ప్రోత్సహిస్తున్నారు. ఆటో బ్రీడింగ్ దీని ప్రత్యేకత. చెరువులో ఒకసారి వేస్తే చాలు.. దాని సంతతి అలా పెరుగుతూనే ఉంటుంది. వారానికోసారో రెండుసార్లో కొన్ని చేపలు పట్టుకొని తింటూ ఉండొచ్చు. బెంగాల్లో అయితే కూరగాయలతో కలిపి గుప్పెడు చిరు చేపలు వేసి వండుకు తింటారు. అలా పేద ప్రజల్లో విటమిన్-ఎ లోపాన్ని తగ్గించడానికి మూల చేప ఉపకరిస్తుంది. ఆహార భద్రతనిస్తుంది. ఆహార భద్రత అంటే తిండి గింజలను బాగా ఉత్పత్తి చేసి, గోదాముల్లో ముక్క బెట్టడం కాదు. ప్రజలకు అందుబాటులోకి తేవాలి. కొనుగోలు శక్తి లేని పేదలు ఇటువంటి చేపలు పెంచుకునేలా ప్రోత్సహిస్తే పౌష్టికాహార భద్రత కలుగుతుంది. పెరట్లో కుంటలో పెంచుకుంటూ ఉంటే.. సొర, బీరకాయల మాదిరిగా రోజుకు రెండు చేపలు తీసుకొని తింటూ ఉండొచ్చు. చెరువుల్లో వరి తౌడు, చిట్టు చల్లితే చాలు. కొందరు పిట్టు అంటే నూనెగింజల చెక్కను కూడా వరి తౌడులో కలిపి వేస్తుంటారు. కార్పు చేపల సాగులో మేత కూడా వేస్తుంటారు. తౌడులో ప్రొటీన్లు 8-10 % ఉంటాయి. నూనెగింజల పిట్టులో 30-35% వరకు ఉంటుంది. ► కోస్తా తీరప్రాంతంలో భూముల్లో భూగర్భ జలాల్లోకి ఉప్పునీరు చొచ్చుకు రావడం పెనుసమస్యగా ఉంది. ఈ భూముల్లో ఉప్పు నీటితో చేపలు పెంచుకోవచ్చా? పెంచవచ్చు. ‘గిఫ్ట్’ తిలాపియా చేప 15 పీపీటీ మేరకు ఉప్పు సాంద్రతను కూడా తట్టుకొని చక్కగా పెరుగుతుంది (సముద్రపు నీటిలో ఉప్పదనం 35 పీపీటీ మేరకు ఉంటుంది). నీటి ఉప్పదనం అంతకన్నా ఎక్కువ ఉన్నా పెరిగే ఎట్రోప్లస్ (ఉ్టటౌఞఠట), పండుగప్ప వంటి చేపల జాతులు ఉన్నాయి. హర్యానాలో సెలైన్ భూముల్లో చేపలు సాగు చేస్తున్నారు. కృష్ణా జిల్లాలోని రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ ఆక్వాకల్చర్ (కేంద్ర ప్రభుత్వ సంస్థ) గిఫ్ట్ తిలాపియా, పండుగప్ప పిల్లలను రైతులకు అందిస్తున్నది. గిఫ్ట్ తిలాపియా పిల్లలు, ఇతర వివరాల కోసం... బి. అప్పలనాయుడు, సహాయ ప్రాజెక్టు మేనేజర్, ఆర్.జి.సి.ఎ. తిలాపియా ప్రాజెక్టు, కొణతనపాడు, ప్రొద్దుటూరు పంచాయతీ, కంకిపాడు మండలం, కృష్ణా జిల్లా, ఆం. ప్ర. మొబైల్ : 98665 30366 E mail: tilapiargca@gmail.com ఇంటర్వ్యూ : పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఫొటోలు : తూనుగుంట్ల దయాకర్, స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సాక్షి


