breaking news
Satellite - Linked
-
2026 చివరికల్లా శాటిలైట్ ఆధారిత టోల్వ్యవస్థ
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది చివరికల్లా దేశవ్యాప్తంగా జాతీయరహదారులపై ఉపగ్రహ ఆధారిత టోల్చార్జీల వసూలు వ్యవస్థను అమలుచేస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం ప్రకటించారు. శాటిలైట్ టోల్ విధానం కారణంగా ఇకపై టోల్ప్లాజాల వద్ద చాలాసేపు కిలోమీటర్ల పొడవైన క్యూ వరసల్లో వేచి ఉండాల్సిన బాధ వాహనదారులకు తప్పుతుందని మంత్రి గడ్కరీ చెప్పారు. బుధవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా మంత్రి ఈ వివరాలను వెల్లడించారు. ‘‘కొత్త వ్యవస్థ పూర్తిగా కృత్రిమ ఉపగ్రహ, కృత్రిమ మేథ(ఏఐ)తో అనుసంధానమై పనిచేస్తుంది. దీంతో టోల్ప్లాజాల వద్ద వెయిటింగ్ పిరియడ్ అనేదే ఉండదు. క్యూ వరసల్లో వేచిఉన్నప్పుడు వాహనం ఇంజిన్ ఆన్చేసి ఉండటంతో ఏకంగా రూ.1,500 కోట్ల విలువైన ఇంధనం వృథాగా ఖర్చయిపోతోంది. ఇకపై ఈ వృథా ఉండదు. కేంద్ర ప్రభుత్వానికి సైతం రూ.6,000 కోట్లు పరోక్షంగా ఆదా అవుతాయి. కొన్ని నెలల్లో దేశవ్యాప్తంగా అమలుచేయబోయే మలీ్టలేన్ ఫ్రీ ఫ్లో టోల్(ఎంఎల్ఎఫ్ఎఫ్) విధానంతో వాహనదారులకు ఆర్థికంగా ఎంతో ప్రయోజనం. గతంలో టోల్ వద్ద మ్యాన్యువల్ విధానం ఉన్నప్పుడు ఒక్కో వాహనదారుడు టోల్ఫీజు చెల్లించేందుకు మూడు నుంచి పది నిమిషాల సమయం పట్టేది. ఫాస్టాగ్ వచ్చాక ఈ సమయం 60 సెకన్లు, అంతకంటే తక్కువకు దిగొచ్చింది. ఇకమీదట ఆ సమయం సున్నాకు చేరుకోబోతోంది. టోల్ప్లాజాల వద్ద కార్లు ఏకంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోవచ్చు. టోల్ వద్ద మిమ్మల్ని ఎవరూ ఆపరు’’ అని మంత్రి చెప్పారు. నంబర్ ప్లేట్ను గుర్తుపట్టి.. ‘‘నంబర్ ప్లేట్ను ఫాస్టాగ్, ఏఐ సాయంతో శాటిలైట్ అనేది గుర్తించి టోల్ప్లాజా వద్ద రుసుము చెల్లింపును అత్యంత సులభతరం చేయనుంది. ఇందుకోసం ఏఐ అనలైటిక్స్తో పనిచేసే ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగీ్నషన్(ఏఎన్పీఆర్) వ్యవస్థ, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ఆధారిత ఎల్రక్టానిక్ టోల్ కలెక్షన్(ఫాస్టాగ్)ల కలబోతగా ఎంఎల్ఎఫ్ఎఫ్ విధానాన్ని అమలుచేయబోతున్నాం. దీంతో టోల్ప్లాజాల వద్ద బడానేతల పేర్లు చెప్పి రుసుములు చెల్లించకుండా వెళ్లిపోవడం, బెదిరింపులు, చెల్లింపుల్లో సమస్యలు వంటివన్నీ మటుమాయం అవుతాయి. పేమెంట్ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా జరుగుతుంది. ఇదంతా 2026 ఏడాది చివరికల్లా 100 శాతం అమల్లోకిరానుంది. ఈ విధానంలో ఏవైనా అవకతవకలు చేయాలని కాంట్రాక్టర్లు ప్రయతి్నస్తే అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడం. ఇప్పటికే ఇతర పనులు సవ్యంగా చేయని కాంట్రాక్టర్లను రెండేళ్ల పాటు పనుల నుంచి డిబార్ చేస్తాం. మరోదఫా టెండర్లు వేయడానికి కూడా అనుమతించబోం’’ అని గడ్కరీ స్పష్టంచేశారు. ఆ సమస్యలు మావి కాదు ‘‘జాతీయరహదారులపై నిర్వహణ మాత్రమే కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుంది. రాష్ట్రాల రహదారులు, నగర రహదారుల్లో రోడ్ల నిర్వహణ అనేది మా చేతుల్లో ఉండదు. స్టేట్, సిటీ రోడ్ల సంబంధ సమస్యలను సామాజిక మాధ్యమాల్లో కొందరు జాతీయరహదారుల సమస్యగా తప్పుగా చిత్రీకరిస్తున్నారు. వ్యవస్థను పారదర్శకంగా మార్చి అక్రమాలు జరక్కుండా చూస్తాం. పైలట్ ప్రాజెక్ట్గా ఇప్పటికే ఎంఎల్ఎఫ్ఎఫ్ అమలవుతోన్న టోల్ప్లాజాల్లో ప్రాజెక్ట్ విజయావకాశాలను బేరేజువేసుకుని ఇతర ప్రాంతాల్లో దశలవారీగా ఈ విధానాన్ని విస్తరించుకుంటూ వెళ్తాం. వచ్చే కొన్ని నెలల్లో ఆయా టోల్ప్లాజాల్లో భౌతికంగా అక్కడ ఎలాంటి టోల్బూత్లు, బ్యారియర్లు, మెయిన్టెనెన్స్ సిబ్బంది లేకపోవడంతో నిర్వహణ ఖర్చులు సైతం కలిసిరానున్నాయి’’ అని మంత్రి చెప్పారు. -
అంగుళం తేడా రాకుండా ఆర్ఆర్ఆర్
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్)కు ఖరారు చేసిన అలైన్మెంట్ ఆధారంగా నిర్మించాల్సిన రోడ్డుకు సంబంధించి క్షేత్ర స్థాయిలో భూమి హద్దులను గుర్తించే సర్వే వేగంగా జరుగుతోంది. విదేశాల నుంచి సమకూర్చుకున్న పరికరాలు సహా దేశీయంగా తయారైన ఆధునిక డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (డీజీపీఎస్) పరికరాలతో సర్వే నిర్వహిస్తున్నారు. మొత్తం 12 బృందాలు క్షేత్రస్థాయిలో ఈ పనిచేస్తున్నాయి. సంగారెడ్డి పట్టణం వద్ద మొదలైన సర్వే ప్రస్తుతం జగదేవ్పూర్ సమీపంలోని తుర్కపల్లి వరకు పూర్తయింది. అంగుళం కూడా తేడా రాకుండా, గూగుల్ మ్యాపు ఆధారంగా రూపొందించిన అలైన్మెంట్ ప్లాన్కు తగ్గట్టుగా అక్షాంశ రేఖాంశాల ఆధారంగా భూమిని గుర్తిస్తున్నారు. ప్రతి 5 కి.మీ.కు రెండు గుర్తింపు రాళ్లు ప్రస్తుత అలైన్మెంటు ప్రకారం రోడ్డు ఏయే సర్వే నంబర్ల మీదుగా నిర్మించాలో కచ్చితంగా గుర్తించే పని చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం దానికి సంబంధించిన గుర్తులేవీ పెట్టడం లేదు. రోడ్డును నిర్మించే గ్రామాలు, సర్వే నంబర్లకు సంబంధించి గెజిట్ విడుదలయ్యాకే ఆ పని జరగనుంది. ప్రస్తుతం రోడ్డు మార్గం అక్షాంశ రేఖాంశాలను నిర్ణయిస్తున్నారు. ఇందుకు ప్రతి 5 కిలోమీటర్లకు రెండు గుర్తు రాళ్లను పాతి వాటి మీద డీజీపీఎస్ పరికరాలు ఉంచడం ద్వారా సూక్ష్మస్థాయి తేడా కూడా లేకుండా ఫీల్డ్ అలైన్మెంటును నిర్ధారిస్తున్నారు. అయితే ఈ గుర్తింపు రాళ్లను చూసి, అవే రోడ్డు హద్దు రాళ్లుగా భావిస్తున్న రైతులు, స్థానికులు సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆ రాళ్లకు, ప్రతిపాదిత రోడ్డు హద్దులకు సంబంధం లేదని, అలైన్మెంటు ప్రకారం అస లైన హద్దులను గెజిట్ విడుదలయ్యాకే ఏర్పాటు చేస్తామని సిబ్బంది చెబుతున్నారు. పూర్తిగా శాటిలైట్ సిగ్నల్స్ ఆధారంగా.. ఆర్ఆర్ఆర్ నిర్మించే సంగారెడ్డి, చౌటకూరు, హత్నూరు, నర్సాపూర్, శివంపేట, తూప్రాన్, గజ్వేల్, వర్గల్, మర్కూక్, జగదేవ్పూర్, తుర్కపల్లి, యాదాద్రి, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్ మండలాల పరిధిలోని 120 గ్రామాల మీదుగా ఈ సర్వే జరుగులోంది. ప్రస్తుతానికి 90 కి.మీ. మేర సర్వే పూర్తయింది. బహిరంగ విచారణ తర్వాతే.. ఆర్ఆర్ఆర్ నిర్మించే గ్రామాలు, సర్వే నంబర్లతో కూడిన గెజిట్ విడుదల చేసిన తర్వాత అభ్యంతరాల స్వీకరణకు 21 రోజుల గడువు ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి బహిరంగ విచారణ నిర్వహించనున్నారు. ఇది పూర్తయిన తర్వాతనే ఆర్ఆర్ఆర్కు కావాల్సిన 100 మీటర్ల వెడల్పు భూమిపై హద్దులు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రక్రియ నెలన్నర నుంచి రెండు నెలల తర్వాతే మొదలు కానుంది. -
సో... సొరచేపలకు థ్యాంక్స్!
సైన్స్ సొరచేపలు సముద్రంలో ఏంచేస్తాయి? అనే ప్రశ్నకు- ‘‘ఏం చేస్తాయండీ...తమ పనేదో తాము చేసుకుంటాయి’’ అనే సరదా సమాధానమైతే రావచ్చుగానీ, వాటి గురించి మాట్లాడుకోవడానికి సీరియస్ విషయాలే ఉన్నాయి. తమ పనేదో తాము చేసుకోవడమే కాదు మానవాళికి అవసరమైన మంచి పని కూడా చేసి పెడుతున్నాయి. వివిధ స్థాయులలో నీటి ఉష్ణోగ్రతలను తెలుసుకోవడానికి గత దశాబ్దకాలంగా యూనివర్శిటీ ఆఫ్ మియామి(అమెరికా) పరిశోధకులు సొరచేపలను ఉపయోగించుకుంటున్నారు. వాటికి ఏర్పాటు చేసిన శాటిలైట్-లింక్డ్ ట్యాగ్ల ద్వారా సమాచార సేకరణ సాధ్యమవుతోంది. తాజా విశేషం ఏమిటంటే, కేవలం నీటి ఉష్ణోగ్రతలు మాత్రమే కాదు... గాలివానలు, తుపానుల గురించి తెలుసుకునే వీలుందని చెబుతున్నారు పరిశోధకులు. సొరచేపలు అందించే సమాచారంలో ఎన్నో హెచ్చరికలు నిక్షిప్తమై ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. ఒకవేళ ప్రమాదవశాత్తు సొరచేపలకు అమర్చిన ట్యాగ్లు వాటి నుంచి విడిపోయినా... అప్పటివరకు అది సేకరించిన సమాచారం మాత్రం మాయం కాదు. దానికి సంబంధించిన డాటా రికార్డ్ అవుతూనే ఉంటుంది. ‘‘కచ్చితమైన సమాచారాన్ని ఇవ్వడంలో వాటికి మించి సాధనాలు లేవు. ఆధునిక పరికరాలు చేయలేని పనిని కూడా అవి చేసి పెడుతున్నాయి. ఖచ్చితమైన సమాచారమే కాదు కీలక సమాచారాన్ని ఇస్తున్నాయి’’ అంటున్నాడు సముద్రజీవజాల శాస్త్రవేత్త జెరాల్డ్ ఆల్ట్. సొరచేపల నుంచి సేకరించిన సమాచారం తుపానుల బలాబలాలను అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. ‘‘ఇది ప్రారంభం మాత్రమే... సొరచేపలు మనకు అందించే సమాచారంతో విపత్తుల గురించి తెలుసుకోవడమే కాదు.. ఎన్నో కొత్త విషయాలు కూడా తెలుసుకోవచ్చు’’ అంటున్నారు పరిశోధకులు.


