breaking news
sangeetha kalanidhi
-
సహగమపదని..!
వాకా మంజులారెడ్డి సంగీత కచేరీ వేదిక మీద సహవాయిద్యాలతో అలరించే వాళ్లలో ఎక్కువగా మగవాళ్లే కనిపిస్తుంటారు. ఈ తరం మహిళలు ఆ భేదాన్ని తుడిచేస్తున్నారు. రేపు (మే 11, శనివారం) హైదరాబాద్, రవీంద్ర భారతిలో జరుగుతున్న సంగీత విభావరిలో పాల్గొంటున్న వాద్యకారులంతా మహిళలే. వయోలిన్, సహ వయోలిన్, మాండలిన్, ఫ్లూట్, మృదంగం, తబలా, ఘటం, మోర్చింగ్వాద్యాలను మహిళలే వాయిస్తారు. మొత్తం ఎనిమిది మంది మహిళలు పంచుకోనున్న ఈ వేదిక దక్షిణ భారతమంతటికీ ప్రాతినిధ్యం వహిస్తోంది. వయోలిన్ విద్వాంసురాలు అవసరాల కన్యాకుమారి సంగీత ప్రపంచ వైతాళికుల్లో ఒకరు. మద్రాసు మ్యూజిక్ అకాడమీ నుంచి సంగీత కళానిధి పురస్కారం అందుకున్న తొలి మహిళా వయోలిన్ వాద్యకారిణి ఆమె. దాదాపుగా యాభై ఐదేళ్ల సంగీత సాధనలో ఆమె దేశ విదేశాల్లో వేలాది కచేరీలు నిర్వహించి ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాలందుకున్నారు. ఆమెను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ విభాగంలో పద్మశ్రీ పురస్కారం అందుకున్న తొలి మహిళ కన్యాకుమారి. పదేళ్ల కిందట తమిళనాడులో తీవ్రమైన దుర్భిక్షం నెలకొన్న తరుణంలో పద్మనాభస్వామి కోవెలలో స్వరజతి నిర్వహించారు. అప్పుడు వర్షం కురిసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ‘‘అది మా సంగీతకారుల గొప్పతనం కాదు, స్వరం– సాహిత్యం కలయికల గొప్పతనం’’ అన్నారామె. ఆమె కీర్తికిరీటంలో మరో కలికితురాయి అఖండం. ఎనభై మంది సంగీతకారులతో ఒక్కొక్కరు అరగంట చొప్పున ఇరవై నాలుగ్గంటల సేపు నిరంతరాయంగా సంగీత కచేరీ నిర్వహించారామె. విజయనగరంలో పుట్టిన తాను చెన్నైలో స్థిరపడడానికి కారణం అక్కడ సంగీతానికి ఉన్న ఆదరణేనన్నారు. ‘‘తమిళనాడులో సంగీతానికి ప్రత్యేక ఆదరణ ఉంది, ఆ కారణంగానే మన తెలుగు కళాకారులు అనేక మంది చెన్నైలో స్థిరపడుతున్నారు. ద్వారం వెంకటస్వామి నాయుడు, బాల మురళీకృష్ణ, సుశీల వంటి సంగీతఖనులు తమిళనాడుకి వెళ్లడానికి కారణం తమిళుల సంగీతారాధన, కళకు లభిస్తున్న గౌరవాలే. నా యాభై ఐదేళ్ల సంగీత ప్రయాణంలో పాతిక సంగీత సాధనాలతో జుగల్బందీ ప్రయోగాలు చేశాను. వాయిద్యకారులుగా మహిళలు తక్కువగానే ఉన్నారు. ఫ్లూటు, మాండలిన్, ఘటం, మోర్చింగ్లో అయితే మరీ తక్కువ. ప్రస్తుతం వోకల్ మ్యూజిక్తో పోలిస్తే ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్కి ఆదరణ తగ్గుతోంది. వోకల్ రాణించాలంటే ఇన్స్ట్రుమెంట్స్ సహకారం తప్పని సరి. అన్ని రకాల సంగీతరీతులనూ గౌరవించగలిగినప్పుడే కళ సమతుల్యంగా ఉంటుంది’’ అన్నారు కన్యాకుమారి. కావేరి తీరాన గోదావరి సంగీతం మాది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. ఐదేళ్లకు చెన్నైలో ఉన్న తాతగారి దగ్గరకు వెళ్లిపోయాను. నాకు మాండలిన్ నేర్పించాలనేది ఆయన కోరికే. ఆరేళ్ల నుంచి ప్రాక్టీస్ చేసి, ఎనిమిదేళ్లకు తొలి కచేరీ ఇచ్చాను. త్యాగరాజు ఆరాధన ఉత్సవాల సందర్భంగా తమిళనాడులో కావేరీ నది తీరాన తిరువాయూర్లో తొలి ప్రదర్శన ఇచ్చే భాగ్యం కలిగింది. అది త్యాగరాజు పుట్టిన ఊరు. అప్పట్లో నన్ను చైల్డ్ ప్రాడిజీ బేబీ నాగమణి అనేవారు. చెన్నైలో చిన్మయ విద్యాలయలో చదువుకున్నాను. ఆ స్కూలు సాంస్కృతిక కళలను ప్రోత్సహిస్తుంది. తొమ్మిదేళ్లకే సౌత్ ఆఫ్రికాలో పదిహేను కచేరీలు చేయగలిగాను. కాశ్మీర్ తప్ప దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కచేరీలు చేశాను. నా తొలి గురువు, మామయ్య అయిన యు.పి రాజుగారితో వివాహమైంది. చెన్నైలో స్థిరపడ్డాం. చెన్నైలోనే ‘శాస్త్రీయ మాండలిన్ శిక్షణ’ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాం. – ఉప్పలపు నాగమణి, మాండలిన్ వాద్యకారిణి అష్ట స్వర సంగమమ్ విజయనగరంలో పుట్టిన కన్యాకుమారి, పాలకొల్లు వాద్యకారిణి బేబీ నాగమణి, హైదరాబాద్ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుంచి తబలాలో పట్టా పుచ్చుకున్న కేరళ మహిళ రత్నశ్రీ, బెంగుళూరు నుంచి ఫ్లూట్ కళాకారిణి వాణీ మంజునాథ్, మోర్చింగ్ విద్వాంసురాలు భాగ్యలక్ష్మి ఎమ్ కృష్ణ, తమిళనాడు నుంచి మృదంగ విద్వాంసురాలు అశ్విని శ్రీనివాసన్, ఘట వాద్యకారిణి రమ్య రమేశ్, అనుతమ మురళి.. రేపు తెలుగు శ్రోతలను అలరించడానికి హైదరాబాద్లో కొలువుదీరనున్నారు. కన్యాకుమారి ఆధ్వర్యంలో ఈ ‘సంగీత సంగమమ్’ జరుగుతోంది. ఈ సంగీత విభావరిని వెంకటాచలం అయ్యర్ జ్ఞాపకార్థం ప్లాంజెరీ ఫౌండేషన్ నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ నిర్వాహకులు శంకర్ ప్లాంజెరీ, రాజ్యలక్ష్మి ప్లాంజెరీ దంపతులు తెలియచేశారు. నాన్నను చూసి నేర్చుకున్నాను మాది బెంగళూరు. మా నాన్నగారు ప్రముఖ మోర్చింగ్ కళాకారుడు ‘గానకళా భూషణ’ విద్వాన్ డాక్టర్ ఎల్ భీమాచార్. ఆయన ప్రాక్టీస్ చేస్తుంటే రోజూ చూసేదాన్ని. అలా మోర్చింగ్ మీద ఆసక్తి కలిగింది. పదేళ్ల వయసు నుంచి ప్రాక్టీస్ మొదలు పెట్టాను. దేశవిదేశాల్లో పదిహేను వందల కచేరీల్లో పాల్గొన్నాను. డాక్టర్ ఎం. బాల మురళీ కృష్ణ, విదుషి నీల రామ్గోపాల్, విదుషి ఎ. కన్యాకుమారి, సంజయ్, సుధా రఘునాథన్ వంటి ప్రముఖులకు మోర్చింగ్ సహకారం అందించాను. ఆల్ ఇండియా రేడియోలో ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ట్ని. ఈ రంగంలో అమ్మాయిలను తీసుకురావాలనేది నా కోరిక. భాగ్యలక్ష్మి ఎం. కృష్ణ, తొలి మహిళా మోర్చింగ్ కళాకారిణి -
‘సంగీత కళానిధి’ నేదునూరి కన్నుమూత
* అనారోగ్యంతో విశాఖలో తుదిశ్వాస విడిచిన ‘నాదబ్రహ్మ’ * కృష్ణమూర్తి మృతిపై పలువురు ప్రముఖుల సంతాపం * అన్నమయ్య సంకీర్తనల స్వరకల్పనకు ఎనలేని కృషి విశాఖపట్నం, పిఠాపురం: శాస్త్రీయ సంగీతంలో అఖండ ప్రతిభాశాలి, సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి(86) సోమవారం ఉదయం కన్నుమూశారు. కొద్ది నెలలుగా అనారోగ్యంతో ఉన్న ఆయన విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. విశాఖలోని ఎంవీపీ కాలనీ సెక్టార్-6లో నివాసముంటున్న కృష్ణమూర్తి తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ కొత్తపల్లిలో 1927, అక్టోబరు 10న నేదునూరి శ్రీరామ్మూర్తి, విజయలక్ష్మి దంపతులకు నాలుగో బిడ్డగా జన్మించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో కంచికామకోటి ఆస్థాన విద్వాంసుడిగా పని చేశారు. టీటీడీ అన్నమయ్య సంకీర్తనల స్వరకల్పనకు ఆయన విశేషంగా కృషి చేశారు. మద్రాసు సంగీత అకాడమీలో 50 ఏళ్ల పాటు పాడారు. తల్లే తొలి గురువు నాదబ్రహ్మ నేదునూరి కృష్ణమూర్తికి సంగీతం తల్లి నుంచి వంశపారంపర్యంగా ఉద్భవించింది. మేనమామ, తల్లి విజయలక్ష్మిలు పాడిన అష్టపదులు, తరంగాలు, ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలు వింటూ నేదునూరి పెరిగారు. సంగీత ఓనమాల స్వరసాధనకు తల్లే ఆయనకు తొలి గురువు. విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో చేరి ద్వారం నరసింహారావునాయుడు వద్ద మెళకువలు నేర్చుకుని వయొలిన్ వాయిద్యంలో శిక్షణ పొందారు. గురువు సలహా మేరకు గాత్ర సంగీత సాధన కూడా కొనసాగించారు. అనంతరం శ్రీపాద పినాకపాణి శిష్యరికంలో తనదైన శైలిని సృష్టించుకుని సంగీత విద్వాంసుడుగా ఎదిగి అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రభుత్వ సంగీత కళాశాల్లో ప్రిన్సిపాల్గా సేవలందించారు. ఆలిండియా రేడియోలో కర్ణాటక శాస్త్రీయ సంగీత ఆడిటేషన్ బోర్డు సభ్యుడిగా, మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో విశిష్ట కమిటీ సభ్యుడిగా సేవలందించారు. మద్రాసు కృష్ణగాన సభ ఆయనను ‘సంగీత చూడామణి’ బిరుదుతో, మ్యూజిక్ అకాడమీ ‘సంగీత కళానిధి’ బిరుదుతో గౌరవించాయి. స్వరవిలాస్, నాద సుధానిధి, సంగీత విధ్వన్మణి, సంగీత విద్యాభ్యాసం, నాదయోగి, గాన కళాభారతి తదితర 51కి పైగా అవార్డులు ఆయన్ను వరించాయి. నాదసుధా తరంగణి సంస్థ ద్వారా నాదయోగి ఆత్మకథ, 108 భద్రాచలం రామదాసు కీర్తనలు, భక్తిరస కీర్తనలు, 200కి పైగా అన్నమయ్య సంకీర్తనలు, 25 యోగ నారాయణ కీర్తనలను స్వరపరిచారు. నేదునూరి శిష్యుల్లో ప్రముఖులు మల్లాది సోదరులు(శ్రీరామప్రసాద్, శ్రీరవికుమార్), స్వర్గీయ డాక్టర్ దోమడ చిట్టబ్బాయి, గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, శోభారాజు, కోకా సత్యవతి, వి.లలితా చంద్రశేఖర్, జి.శారదా సుబ్రహ్మణ్యం, డాక్టర్ కె. సరస్వతీ(ఏయూ సంగీత విభాగం ప్రొఫెసర్) పలువురి సంతాపం నేదునూరి మృతికి పలువురు సంగీతకారులు, అభిమానులు సంతాపం తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు కామినేని, రఘునాధరెడ్డి, అయ్యన్నపాత్రుడు, గంటాశ్రీనివాసరావు, సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఏపీ మండలి చైర్మన్ చక్రపాణి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, మద్రాసు సంగీత అకాడమీ కార్యదర్శి (చెన్నై) పప్పు వేణుగోపాల్ సంతాపం తెలిపారు. సంగీత ప్రపంచానికి తీరని లోటు: జగన్ నేదునూరి కృష్ణమూర్తి మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కర్ణాటక సంగీతానికి, తెలుగువారికి ఎనలేని సేవలు అందించారని జగన్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహా విద్వాంసుడిని కోల్పోయాం సంగీత ప్రపంచం ఓ మహా విద్వాంసుడిని కోల్పోయింది. ఎందరికో సంగీతంలో మెళకువలు నేర్పిన గురువు దూరమయ్యారు. - ఆకొండి మధుసూదనరావు, సంగమేశ్వర సంగీత సమాఖ్య కార్యదర్శి పిఠాపురం ఆయన సంగీతం మరపురానిది ఆయన సంగీతం వింటే తన్మయత్వానికి లోనయ్యే వాళ్లం. పిఠాపురంలో ఎన్నోసార్లు కచేరీలతో అలరించారు. ఆయన్ను కోల్పోవడం సంగీత ప్రియులకు తీరని లోటు. - రేగెళ్ల సత్యనారాయణ శర్మ, పిఠాపురం మూగబోయిన పిఠాపురం అక్కడ పుట్టిన ‘చిగురు కొమ్మైన చేవ’ అని ఓ గడ్డ పౌరుష ప్రతాపాలను వర్ణించారో కవి. అదే మాదిరిగా తమ బిడ్డ సంగీత ప్రపంచంలో మేరునగంలా నిలిచాడని పిఠాపురం వాసులు స్మరించుకుంటున్నారు. పిఠాపురానికి చెందిన ప్రముఖ కవి అవంత్స సోమసుందర్ సంగీత దిగ్గజం కృష్ణమూర్తి గురించి చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. కృష్ణమూర్తి తండ్రి శ్రీరామ్మూర్తికి పిఠాపురం సంస్థానంలో ఉద్యోగం రావడంతో కుటుంబం అక్కడే స్థిరపడింది. కృష్ణమూర్తి వారి పూర్వీకుల స్వగ్రామమైన నేదునూరు పేరుతోనే ప్రాచుర్యం పొందారు. స్థానిక కోటవారి వీధిలో ఉండే వారి కుటుంబం అనంతరం ఆకొండి వారి వీధిలోకి మారింది. కృష్ణమూర్తి ఐదో తరగతి వరకు చదువుకుని సంగీతం నేర్చుకోవడానికి సిద్ధమయ్యారు. తొలి కచేరీని ఉప్పాడ కొత్తపల్లిలో గణపతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించారు. తీపి జ్ఞాపకం కర్నూలులో వడ్రంగిగా పనిచేసే ఓ కార్మికుడికి సంగీతమంటే ప్రాణం. అక్కడ కచేరీ నిర్వహించడానికి వెళ్లిన నేదునూరికి ఆ వడ్రంగి అప్పటికప్పుడు చేతి గడియారం స్టాండ్ ఒకే చెక్కతో తయారు చేసి ఇచ్చారు. అనంతరం నేదునూరి దాన్ని నాకు ఇచ్చారు. నేను ఇప్పటికీ దాన్ని ఉపయోగిస్తున్నా. నెల క్రితం చివరిసారి స్వగ్రామానికి.. నేదునూరి పిఠాపురం పాదగయ క్షేత్రాన్ని గత నెల 2న దర్శించుకున్నారు. శ్రీకుక్కుటేశ్వరస్వామి, శ్రీరాజరాజేశ్వరీదేవి, శ్రీపురుహూతికా అమ్మవారు, దత్తాత్రేయుడు, సాయిబాబాలను దర్శించుకున్నారు. ఆల యాభివృద్ధికి లక్ష రూపాయలను విరాళం గాఅందజేశారు. స్నేహితులను పేరుపేరునా పలకరించారు.