-
మీదీ మాదీ మనదీ ఒకే కథ
కాలం గడిచి గడిచి పోయాక, చాలా ఏళ్ళకెపుడో ఏదో సంఘటన పరిష్కరించలేనిది తటస్థపడినపుడు దారి చూపించగలదు చూడండి.. దానిని మనం అత్యుత్తమ కళా రూపం అంటాం. వేణు ఊడుగుల సినిమా ‘నీదీ నాదీ ఒకే కథ’ అలాంటిదే. ఉదాత్తమైన ఒక దృశ్యకావ్యం కాలం గడిచి చాలా దూరం నడిచివచ్చినా బట్టల పొత్తిళ్ళలో దాక్కుని కూర్చున్న అపురూప పరిమళంలా మనల్ని మనోరంజితం కావిస్తూనే ఉంటుంది. కలతపరచి దిగులుపరచి, మనం ఆలా ప్రవర్తించకూడదనే తెలివిడిని కలిగి స్తూనే ఉంటుంది. చాలా కాలం క్రితం నేను చూసిన ‘రీడర్’ సినిమా నాకివాళ జ్ఞాపకమొస్తోంది. తనకు చదువు రాదని చెప్పుకోవడానికి సిగ్గు పడిన ఒక అమ్మాయి మౌనంగా అనేక సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అనుభవి స్తుంది. అట్లాగే ‘షిండ్లర్స్ లిస్ట్’ నాజీల దురాగతాల సమయంలో ఒక యూదుడు చూపిన అత్యున్నత హృదయస్పందన ఏళ్ళు గడిచినా బాధాభరితమైన రసాయనిక అసమతుల్యతను మనలో కలుగజేస్తుంది. కొరియన్ సినిమా, ‘ఏప్రిల్ స్నో’ అవాంఛితమైన పరిస్థితులలో వైవాహికేతర సంబంధంలోకి వెళ్లిన వివాహిత స్త్రీ పురుషుల ఘర్షణ జ్ఞాపకానికి వచ్చిన ప్రతిసారి హృదయం బరువై మరోవైపుకి ఒత్తిగిలి పడుకోవాలనిపిస్తుంది. ఇదంతా ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నానంటే వేణు ఊడుగుల ‘‘నీదీ నాదీ ఒకటే కధ’’ నాకు ఇలాటి భావాన్నే కలి గించింది. కనుక. కాలం గడిచి గడిచి పోయాక, చాలా ఏళ్ళకెపుడో ఏదో సంఘటన పరిష్కరించలేనిది తటస్థపడినపుడు దారి చూపించగలదు చూడండి.. దానిని మనం అత్యుత్తమ కళా రూపం అంటాం . వేణు ఊడుగుల సినిమా అలాంటిదే. అనేక ఒత్తిళ్ల మధ్య చిక్కుకుని, మార్కెట్ చెబుతున్న మార్గంలో పయనించలేక, సర్వైవల్ అఫ్ ది ఫిట్టెస్ట్ రేస్లో నిలువలేక రాలి పడిపోతున్న, అయోమయానికి, ఆత్మన్యూనతకు లోనవుతున్న అనేకమందిని వేణు మనకు పరిచయం చేశాడు. చాలా సినిమాలు ఉదాత్తతను చెబుతూనే మధ్యలో ఎక్కడో పురుష దాస్యాన్ని చెబుతుంటాయి. ఫిదా సినిమా చూస్తున్నపుడు నాకు ఇలాటి ఆశ్చర్యమే కలిగింది. తాటి చెట్టంత మగవాళ్ళు ఇద్దరుండగా, అక్కకు సహాయానికి చెల్లి ఇండియానుంచి రావడమూ, కాలేజ్లో తన మీదికి వచ్చిన మగపిల్లలపై, వీరనారిని అని చెప్పుకునే నాయిక నాయకుడి వీరత్వ ప్రదర్శనకు ఎదురుచూడటం, ఇంటి చాకిరీ బాధ్యతగా చేయడం, ఆమె వూగిసలాట చాలా చిరాకు తెప్పించింది. వేణు సినిమాలో అలాంటి ద్వైదీయతలు ఉండవు. మొదటినుండి కడదాకా ఒకటే విషయం, స్థిరచిత్తంతో ప్రశ్నిస్తూ వెడతాడు. ‘మీరు సాధించగలరు’ అని ఒకలాటి భ్రమాత్మకత మాదకత వైపుకి నేటి యువతరాన్ని నెడుతున్న అనేక అంశాలను వేణు ప్రశ్నిస్తాడు . వేణు చాలా మృదువైన అబ్బాయి. మితభాషి, ముఖంనిండుగా మాటలు అక్కరలేని మౌనం చిద్విలాసంగా వెలుగుతూ ఉంటుంది. అతనిది ‘‘లవ్ ఎట్ రీజనల్ మైల్ స్టోన్’’ నేను చదివిన మొదటి కవిత. అట్లాగే మనసుకు హత్తుకు పోయింది. ప్రేమ సంబంధాలలోకి ఓ ప్రాంతం ఎలా చొచ్చుకొస్తుందో చెప్తాడు ఈ అబ్బాయి ఎంతో హృద్యంగా. ‘‘వంద ప్లాస్టిక్ సర్జరీలు కావాలి–ఆమె చెంపలపైనున్న నా ముద్దుల తడి ఆరడానికి! ఏడు సముద్రాలు కావాలి – నేను మాత్రమే కని పించే ఆ రెండు కళ్ళని కడుక్కోవడానికి’’ అంటూ నీది మా ఏరి యానే అయితే ఈ గొడవే ఉండేది కాదు అని వెళ్ళిపోయిన ప్రాంతీయేతర ప్రియురాలి గురించి అతను రాసిన కవిత సాహిత్య ప్రపంచంలో ఒక సంచలనం. సామాజిక స్పృహ నిండుగావున్న వ్యక్తి తన ఆలోచనలకు దృశ్య రూపం ఇస్తే అది కచ్చితంగా చాలా పాతదే అయిన మట్టిని చీల్చుకుని బుజ్జి బుజ్జి మారాకులు వేసుకుని ఆత్మవిశ్వాసంతో సూర్యుని దిక్కుకి ధిక్కారంతో తల ఎత్తి ప్రశ్నలు వేస్తున్న చిట్టి మొలకలా ఉంటుంది. వేణు ఇప్పుడు మనముందుంచిన ‘‘నీదీ నాదీ ఒకటే కథ’’ అచ్చం అలాటి సినిమానే. ఎన్నో విలువయిన ప్రశ్నలను ఒక అమాయకుడయినా ఎదిగీ ఎదగని అబ్బాయి చేత అడిగించాడు ఈ దర్శకుడు. సంతృప్తిగా బ్రతకడమంటే ఏమిటీ? సంతృప్తికి కొలమానాలేవి? యూనివర్సిటీలో ఉన్నపుడు క్లాస్ నుంచి తిరిగివస్తుంటే అంత వరకు మట్టి పని చేసిన కూలీలు కేరేజీలు విప్పి వరుసగా కూర్చుని భోజనం చేస్తుండేవారు, మధ్యమధ్యలో బోలెడు చతురులు. ఒక ముద్ద అడిగి పెట్టించుకు తినాలనిపించేది వాళ్ళని చూస్తే. వాళ్ళు సంతృప్తిగా లేరనా? ఇంటికెళ్లి ఉడుకు నీళ్లు పోసుకుని పడుకుంటే వాళ్లకి పట్టే నిద్ర చిరంజీవికి పడుతుందా, మోదీకి పడుతుందా. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో నాకు నచ్చింది వ్యక్తిత్వ వికాస తరగతులూ, పుస్తకాలు. ఈ మధ్య కాలంలో వేలం వెర్రిగా మార్కెట్ను ఆక్రమించుకుంటున్న ఈ అంశం గురించి వేణు భలే చెప్పాడు. ‘‘గొప్ప విజయాలకు ఎల్లప్పుడూ గొప్పత్యాగాలు అవసరమవుతాయి’’ అంటాడు మోటివేషనల్ స్పీకర్ రాబిన్ శర్మ. శాక్రిఫైస్ అనేదానికి పరిమితి ఏమిటీ? ఎంతవరకూ? తల్లిదండ్రులు తమ పిల్లల బంగారు భవిష్యత్తు చుట్టూ అల్లిపెడుతున్న బంగారు వలలో పడి పిల్లలు చేస్తున్న త్యాగాల అత్యాచారాన్ని ఎవరైనా కొలతలు వేస్తున్నారా? వేణు వేసిన అన్నిటి కన్నా పెద్ద ప్రశ్న ఒకటి ఉంది అది ’’డిగ్నిటీ ఆఫ్ లేబర్’’. డిగ్నిటీ అఫ్ లేబర్ అంటే ఏమిటీ, మనమూ, మనపక్కన వ్యక్తి చేస్తున్న పని ఏదయినా అది విలువయినదే. నేను కార్ నడుపుతాను, నువ్వు ఆ కార్ ఓనర్వి అయితే ఏమిటీ, నాకు ఈ వృత్తి వచ్చు, నీకు మరో వృత్తి వచ్చు. ఒక వృత్తి మాత్రమే గొప్పది అని నిర్వచించిన కుట్ర ఎక్కడ మొదలయింది? లేచీ లేవగానే తిండి గింజల కోసం రెక్కలల్లార్చుకుని ఆకాశపు దారుల్లో బయలుదేరే పిట్ట కడుపు నిండాక పడే తృప్తి ముందు రేపటి చింత నిలబడగలదా? సాదా సీదా సెట్టింగుతో, ఎక్కడా కించిత్తు శారీరక ప్రదర్శనలు లేకుండా ఇన్ని ప్రశ్నలు అడిగిన ఈ అబ్బాయికి, ఇంత మంచి సినిమా తీసిన ఈ అబ్బాయికి భవిష్యత్తు మరిన్ని అవకాశపు వాకిళ్ళను తెరిచే ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పక చూడండి, ఎప్పుడో ఒకప్పుడు మనం ఫీలయిన కథ మనందరి కథ, వేణు ఊడుగుల ‘‘నీదీ నాదీ ఒకటే కథ’’. వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి ‘ 80196 00900 -
వెన్నుపోటును మర్చిపోవాలా?
ఆలోచనం కొన్నిసార్లు పట్టుకుని ఉండటం కన్నా వదిలివేయడం మేలు అన్నది కదా ఆ అమ్మాయి. వదిలివేయడం అంటే ఎట్లాగా? సర్వ ధ్వంసం చేయగలిగిన స్థితిలో ఉండి కూడా పట్టుకోకుండా వదిలివేస్తామా? నిన్న దినపత్రికలో తల్లిని హత్య చేసి తలనుపట్టుకుని పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగి పోయిన కొడుకు వార్త ఒకటి చదివాను. ఎందుకనో మనసంతా దిగులు, చిరాకు కమ్ముకున్నాయి. ఎప్పుడో చదివిన ఎస్.ఎల్ బైరప్ప ‘‘గృహ భంగం’’ నవలలో పనికిమాలిన ఇద్దరు కొడుకుల భారాన్ని భుజాలపైకి ఎత్తుకున్న వితంతు తల్లి పాత్ర జ్ఞాపకం వచ్చింది. అదే రోజు రాత్రి హోటల్లో బస చేసిన వెంటనే అలవాటుగా పక్కనే వున్న పత్రికను చేతిలోకి తీసుకున్నాను తిరగేద్దామని. పత్రిక పేరు ‘‘పాస్’’ ప్రకటనలతో నిండిన నాలుగైదు ముందు పేజీలు తిప్పాక, చక్కటి అమ్మాయి ఫొటో. పేరు శర్వాణి పొన్నం, చీఫ్ ఎడిటర్. ప్రారంభ వాక్యాలు ‘‘క్రూర విమర్శ, నిజాయితీరాహిత్యం, వెన్నుపోటు.. వంటి పలు అంశాలను అలాగే పట్టుకోకుండా వదిలేయడమే కొన్నిసార్లు ఉత్తమంగా ఉంటుంది’’ అని రాశారు ఆమె. ఎందుకనో మనసు పదే పదే ఆ వాక్యాల చుట్టూ భ్రమించడం మొదలు పెట్టింది. అంతకు ముందే వస్తూ వస్తూ ప్రయాణంలో చదవడానికి పట్టుకొచ్చిన చువాంగ్ త్సు పుస్తకపు పరిచయ వాక్యాలు జ్ఞాపకం వచ్చాయి. 815వ సంవత్సరంలో చైనా ఆస్థానకవి ‘‘చు ఈ’’ని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడని, రాజ్యం పనితీరుని నిలదీసే ప్రశ్నలు వేస్తున్నాడని దేశబహిష్కారం చేసిందట అక్కడి రాజ్యం. భార్యను మాత్రమే తన వెంట రానిచ్చారు. ఊరు కాని ఊరు, అంతవరకు పొందిన సౌకర్యాలు, మానసిక సౌఖ్యాలు, ఆనందాలు ఏవీ లేని, ఉన్న అన్నిటినుంచి తరిమివేసిన దూరాభారం. ఎలా ఆ దుఃఖం నుంచి బయటపడటం. అప్పుడు చువాంగ్ త్సును చదవటం మొదలు పెట్టాడట చు ఈ. ఆ చదువు నుంచి అతను ‘‘స్వస్థలాన్ని వదిలేయడం, బంధువులకు దూరంకావడం, ఎరుగని కొత్త ప్రాంతంవైపు బహిష్కరణకు గురికావడంతో, నా హృదయం ఎంతో పరితాపానికి, బాధకు గురవుతోంది. చువాంగ్ త్సును సంప్రదించాక, నేను దేనికి చెందినవాడినో కనుగొన్నాను. కచ్చితంగా నా స్థలం కనీసం భూమి కాని చోటే ఉంది’’ అంటూ ‘‘రీడింగ్ చువాంగ్ త్సు’’ అనే పేరుతో ఒక కవితను రాశాడు. చువాంగ్ త్సు ఇంకా అంటాడు ‘‘ఏం జరిగినా దాని వెంట సాగిపో, నీ మనస్సును స్వేచ్ఛగా ఉంచుకో: నీవు ఏం చేస్తున్నావో దాన్ని ఆమోదించడం ద్వారా సమస్థితిలో ఉండు. ఇదే అంతిమమైనది’’ అని. నిజంగా దుర్మార్గమైన విమర్శలనూ, నిజాయితీలేని వ్యక్తులనూ, వెన్నుపోట్లనూ మనసులో పెట్టుకోకుండా సరే లెమ్మని పోనియ్యడం సాధ్యమేనా? అనర్హులై ఉండీ అర్హులను చూసి అసూయపడే మను ష్యులూ, మనం ముందుండాలంటే ముందుండేవాళ్ళని క్రిందికి లాగడమే మార్గం అని నమ్మే వ్యక్తులూ.. కులాలనీ, మతాలనీ, ఉందనీ, లేదనీ ఇంకా అదనీ ఇదనీ, అర్థం కాకనో అర్థం చేసుకునే స్థాయి లేని స్థోమత లేని వ్యక్తులు చేసే ఎన్నెన్ని గాయాలు? కొన్నిసార్లు హృదయానికయ్యే ఈ గాయపు పోట్లు చాలా తీవ్రంగా ఉంటాయి, మానాయనుకున్నా మచ్చలు మరీ భయంకరంగా పడి మిగిలిపోతాయి కదా, అటువంటపుడు మరచిపోదామనుకున్నా మచ్చలు కనిపిస్తున్నపుడు మరి చువాంగ్ త్సు నో, జిడ్డు కృష్ణమూర్తినో చదువుకుంటూ, స్మరించుకుంటూ ఈ గాయాల నదిని దాటివేయగలమా? మళ్ళీ శర్వాణి జ్ఞాపకం వస్తుంది నాకు. కొన్నిసార్లు పట్టుకుని ఉండ టం కన్నా వదిలివేయడం మేలు అన్నది కదా ఆ అమ్మాయి. వదిలివేయడం అంటే ఎట్లాగా? పేజీలు తిప్పుతూ వెళితే రాంగోపాల్ వర్మ ఇంటర్వ్యూ కనిపించింది అదే పత్రికలో. ‘మన జీవనమంతా ఉదయరాత్రాల మధ్యన ఉంచి చూసుకోవడం. ఈ పొద్దు గడిస్తే ఈ రాత్రికి మరణిస్తాం. అందరమూ మరణిస్తాం. మనల్ని మోసం చేసిన వాళ్ళు, వెన్నుపోటుదారులు, అసత్యవంతులు, తప్పు చేస్తూనే దబాయించే దుర్మార్గులూ అందరమూ మరణిస్తాం’ ఆర్వీజీ చెప్పిన ఈ పొట్టి వాక్యం సులభంగా వుంది కదా. ఇలా ఆలోచించుకుంటూ ఉన్నానా.. హఠాత్తుగా క్రైస్తవ మత ప్రేమిక అయిన నా బిడ్డ వచ్చి ‘‘అమ్మా.. అమ్మా!’’ నీ యుద్ధాన్ని నా యుద్ధంగా భావించి నేనే నీ బదులుగా పోరాడుతాను, నిన్ను అవమానపర్చిన వారిని వారి స్వమాంసం వారు తినేట్లు చేస్తాను’ అని వచ్చిందమ్మా ఇవాళ్టి వాక్యం, ఇట్స్ కూల్’’ అంది. నవ్వొచ్చింది. కనుక శర్వాణి చెప్పినట్టు కొన్నింటిని పట్టుకోకుండా వదిలేయడంలో నిజంగానే చాలా సుఖం వుంది కదా. జీవితంలో దమ్ముతో నిలబడి పోరాడాల్సిన అంశాలు చాలానే ఉంటాయి. పోరాడాలి. అలాగే వదిలేసి ముందుకు నడిచిపోవాల్సిన అంశాలూ చాలా ఉంటాయి. ఆగిపోకూడదు. ముందుకెళ్లిపోవాలి. ఎప్పుడు ముందుకెళ్లాలి, ఎప్పుడు పోరాడాలో మన బుద్ధి మనకు తప్పక చెపుతుంది. అందులో మనసును తల దూర్చనీయకపోతే చాలు. కాలం ముందుకే వెళుతుంది. వెనకకు ఎప్పుడూ రాదు. అన్నింటికన్నా ముందుండి ఎప్పుడూ నన్ను నడిపించే హేతువు, నాలో మొలకెత్తే భావ నిస్సత్తువను కాలితో మట్టం చేసే హేతువు ఇదే నిజమని చెప్తుంది. వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి సామాన్య 80196 00900 -
విద్యపై మార్కెట్ నీలినీడలు
ఆలోచనం ఏ మంచం కొనాలో, ఏం తినాలో మార్కెట్ చెబుతుంది. ప్రభుత్వ బడుల్లో మంచి చదువు దొరకదని మార్కెట్టే చెప్పింది. మార్కెట్ ఇంతలా మనల్ని అల్లుకుని వున్న ఈ కాలంలో మోదీ మూస మాటల వల్ల ఏం లాభం జరుగుతుంది? పోయిన శుక్రవారం ఢిల్లీలో ‘‘పరీక్షా పర్ చర్చ’’ అనే కార్యక్రమంలో పాల్గొని, విద్యార్థులతో ముచ్చటిస్తూ, మోడీ ‘‘మీ మొత్తం దృష్టినంతా నేర్చుకోవడంపై పెట్టాలి. ఫలితాలు, మార్కులు అనేవి అనుబంధ ఉత్పత్తులుగా ఉండాలి’’ అని, అంతటితో ఆగక ‘‘తమ పిల్లలు ఏదో అవ్వాలన్న తల్లిదండ్రుల స్వప్నాలను మీరు అంగీకరించాలి’’ అన్నారు. మోదీ పలికిన ఈ ఆణిముత్యాలను నెమరువేసుకుంటూ ఉంటే, నాకు, కార్పొరేట్ కళాశాలల దౌష్ట్యం వల్ల, గత రెండేళ్లలో దాదాపు 450 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారంటూ జరిగిన చర్చలు గుర్తొచ్చాయి. ఇవన్నీ నాకు పదే పదే నా చదువును జ్ఞాపకం చేశాయి. నా తల్లికి నన్ను డాక్టర్గా చూడాలని ఉండేది. నాకేమో మెదడులో ఎడమ భాగం కన్నా కుడి భాగం చురుకుగా పనిచేసేది. ఎడమ వైపు మెదడు తార్కికమైన, క్రమానుగతమైన సైన్స్, మ్యాథ్స్లకు చెందగా, కుడి వైపు మెదడు సమగ్ర చింతన, సృజనాత్మకత, కళా సంగీతాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఏ మనిషికీ కేవలం కుడి లేకా ఎడమ మెదడు మాత్రమే పని చేయడం ఉండదు కానీ, ఒక వైపు మెదడు మరో వైపు కంటే చురుకుగా పని చేయడం సాధారణంగా ఉంటుందట. అట్లా నన్ను వేకువన, మా హాస్టల్లో చదువుకోవడానికని లేపితే, ఎంతకీ నా బుర్రలోకి ఎక్కని ఫిజిక్స్ మెటీరియల్ చేతిలో పట్టుకుని, స్టడీ చైర్లో కూర్చుని, నా చుట్టూ ఆవరించి వున్న లైట్ వెలుతురుకి ఆవల వున్న నిశీధిని దాటి, చాలా దూరంలో వున్న స్మశానంకేసి చూస్తూ, అసలు ప్రపంచం చెప్తున్నట్లు కొరివి దయ్యాలనేవి ఉన్నాయా అని శ్రద్ధగా వెదికేదాన్ని. కొరివి దయ్యాలు కనిపించేవి కావు కానీ, మార్కులు మాత్రం గుడ్డు సున్నాలు వచ్చేవి. నా అదృష్టం బాగుండటం చేత నేను సైన్స్ నుంచి బయటపడి ఆర్ట్స్కి వచ్చాను. అప్పుడిక నా కుడి మెదడు వికసించి, ఎదురు లేకుండా బంగారు పతకాలతో, బహుమతులతో విజయబావుటా ఎగురవేసుకుంటూ వచ్చాను. ఐన్స్టీన్ ‘‘ప్రతి ఒక్కరూ మేధావే. కానీ మీరు చెట్లు ఎక్కగలగడాన్నిబట్టి చేప సామర్థ్యాన్ని నిర్ధారిస్తానంటే అది జీవితాంతం తాను మందమతిని అని నమ్మేస్తూ బతుకుతుంది’’ అంటాడు. నా చదువు గుర్తొచ్చినప్పుడల్లా నాకీ కొటేషన్ జ్ఞాపకం వస్తుంది. అసలు చేపల్ని చెట్లు ఎక్కించాలని నేటి తల్లిదండ్రులు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ప్రాణాలు పోగొట్టుకున్న ఈ 450 మంది పిల్లల తల్లిదండ్రులు వారిని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా మాత్రమే ఎందుకు చూడాలనుకుంటున్నారు? సమాజం మనుషుల ఉన్నతిని డబ్బుతోనే కొలుస్తుంది కనుక, తమ పిల్లలు సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉండాలంటే డబ్బులొచ్చే చదువులు చదవాలన్నది వారి ఆశ. వారి ఆశ లేదా డిమాండు యొక్క సృష్టే కార్పొరేట్ కళాశాలలు. అందరూ అంటున్నట్లు ఆత్మహత్యలకు కారణం కార్పొరేట్ కళాశాలలు కాదు. తల్లిదండ్రులు అందుకు కారణం. తల్లిదండ్రుల ఆశని డబ్బురూపంలో స్వీకరించే కళాశాలలు వారి ఆశలను ఫలింపచేయడానికి రకరకాల పద్ధతులను కనిపెట్టి ‘సప్లై’ చేస్తున్నాయి. సోషల్ డార్వినిజం ‘సర్వైవల్ అఫ్ ది ఫిట్టెస్ట్’ సిద్ధాంతాన్ని చెప్తుంది. ఒత్తిడిని తట్టుకోగలిగిన వాళ్ళు తట్టుకుని డాక్టర్లో మరొకటో కావచ్చు, అలా కాని వాళ్ళు పెద్దల ఆశకు, కళాశాలల ఆచరణకు మధ్యన నలిగి బలి అవుతున్నారు. తల్లిదండ్రులు చేపల్లాంటి తమ పిల్లల్ని చెట్లెక్కాలని కోరుకోవడం వెనుక వున్న ప్రోద్బలాన్ని ‘‘మార్కెట్’’ అంటున్నాడు మైఖేల్ జె.శాండల్ తన ‘వాట్ మనీ కాంట్ బై’ అన్న పుస్తకంలో. ‘‘ఇటీవలి దశాబ్దాల్లో, మార్కెట్ విలువలు జీవితంలోని ప్రతి ఒక్క అంశంపైనా అంటే వైద్యం, విద్య, ప్రభుత్వం, చట్టం, చివరకి కుటుంబ జీవనం పైన కూడా ప్రభావితం చూపుతూ వచ్చాయి. మనం మార్కెట్ ఆర్థిక వ్యవస్థ నుంచి మార్కెట్ సమాజం వైపు కొట్టుకుని పోతున్నాము... ఏ ఆలోచనాత్మకమైన ఎంపిక ద్వారానో మనం ఈ స్థితికి రాలేదు. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిపోయినందువల్ల, మార్కెట్, మార్కెట్ చింతన అనేవి కనీవినీ ఎరుగని ప్రతిష్ఠను ఆస్వాదిస్తున్నట్లుంది. ఇదే నిజం కావచ్చు కూడా.’’అంటారు. నా తండ్రి కాలంలో చదువు ఒక చాయిస్ మాత్రమే, బ్రతుకుదెరువు కాదు. ఇప్పుడలా కాదు ఏ మంచం కొనాలో, ఏం తినాలో మార్కెట్ చెబుతుంది, మనుషుల్ని ప్రలోభ పెడుతుంది. ప్రభుత్వ బడుల్లో మంచి చదువు దొరకదు అని మార్కెట్టే మనకు చెప్పింది. మార్కెట్టు ఇంతలా మనల్ని అల్లుకుని వున్న ఈ కాలంలొ మోడీ మూస మాటల వల్ల ఏం లాభం జరుగుతుంది? ఇప్పుడు మనముందున్న మార్గాలు రెండే. మొదటిది విద్యావ్యవస్థని మార్కెట్ బంధనాలనుంచి తప్పించి, సంపూర్ణంగా ప్రభుత్వ పరిధిలోకి తీసుకుని విద్యను జ్ఞానాన్ని, సంస్కారాన్ని ఇచ్చేదిగా తీర్చిదిద్దడం. రెండు, సోషల్ డార్వినిజం ప్రకారం ఆత్మహత్యలు చేసుకునే పిల్లలు చేసుకోగా, పటిష్టమైన వారే సమాజంలో మిగుల్తారులే అని చూసీ చూడనట్టు ఊరుకోవడం. మోదీ మొదటి మార్గాన్ని ఎంచుకుని ఆ దిశగా అడుగులు వేస్తే ఎంత బాగుంటుంది కదా! వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి ‘ 80196 00900 సామాన్య -
ఒళ్లంతా ముళ్లుండే కాలం..!
‘‘ఈ దేశంలోని ఆడదానికి ఒళ్లంతా ముళ్లుండే రోజు ఎప్పుడొస్తుందా’’ అన్నారొక రచయిత్రి. స్త్రీలు అవసరమైనపుడు ఒళ్లంతా ముళ్లు పుట్టించుకుని తమను తాము రక్షించుకోగల విద్యలో తర్ఫీదు అవ్వాల్సి ఉంది. ఆలోచనం ఢిల్లీ కోర్టులో 2014లో నమోదైన ఒక కేసుపై నిన్న తీర్పు ఇస్తూ జస్టిస్ సీమా మైని ‘‘స్త్రీ తన శరీరమంతటికీ తానే హక్కుదారు. ఆమె అనుమతి లేకుండా ఆమె శరీరాన్ని తాకే హక్కు ఎవరికీ లేదు. తీవ్ర వాంఛాపరులైన, లైంగికంగా విపరీతబుద్ధి కలిగిన మనుషులు ఇలాంటి చర్యల ద్వారా శృంగారపరమయిన కిక్కును పొందుతారు’’ అని పేర్కొంటూ ఆ నేరస్తుడికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్షను, పదివేల జరిమానాను విధిం చారు. తల్లితో వెళుతున్న తొమ్మిదేళ్ల పాపను జన సమ్మర్ధంలో తాకరాని చోట తాకి పైశాచికపు ఆనందాన్ని పొందిన ఒక వ్యక్తికి పడ్డ శిక్ష అది. అలా తాకాలనే కాంక్ష వున్న మగవాళ్లు తమ కోరికను తమలోనే అణిచివేసుకోవాలన్నంతగా భయపెట్టే తీర్పు ఇది. అయితే మన వార్తాపత్రికలు ఆ వార్తకు అతికష్టం మీద 70 పదాల స్థలాన్ని మాత్రమే కేటాయించాయి. బహుశా మీడియాకి వున్న మగ దృక్పథమే కారణం కావచ్చు. ‘భారత్ వంటి స్వేచ్ఛాయుతమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న, సాంకేతికంగా బలమైన దేశంలో, మహిళలు వారు పెద్దవారైనా లేక చిన్నపిల్లలైనా సరే.. బహిరంగ స్థలాల్లో, ప్రత్యేకించి జనంతో నిండి ఉండే మార్కెట్లు, బస్సులు, మెట్రోలలో నిత్యం బాధితులుగా కొనసాగుతుండటం దురదృష్టకరం’ అన్నారు జస్టిస్ సీమా మైని. దేశంలో ప్రతిరోజు ఎన్నో అత్యాచారాలు జరుగుతుండగా వాటిలో వెలుగులోకి వచ్చే అత్యాచారాల సంఖ్యే అతి తక్కువగా ఉంటుంది. అటువంటిది బస్సులో ఏమీ తెలియనట్టు, పనిలో ఏ ఫైలో ఇస్తున్నట్టు ఎరిగీ ఎరగకుండా తాకి ఆనందపడే మగవాళ్ల సంఖ్య రోజుకి కోట్లల్లో ఉంటుంది. నమోదు చేస్తూ వెళితే ఒక్క రోజులోనే, అత్యున్నత స్థానంలో ఉండీ, తోటి మహిళాధికారి రూపెన్తో అసభ్యకరంగా ప్రవర్తించి, పిర్రమీద చరిచిన కేసులో జైలుపాలైన కేపీఎస్ గిల్ లాంటి వాళ్లు బోలెడు మంది కనబడతారు. ఇలాంటి కోట్ల మంది కామ పిశాచుల అత్యాచారాలను అంతరాలు లేకుండా స్త్రీలు ఎదుర్కొంటూ వస్తున్నారు. ఇటీవలి ఇంటర్వ్యూలో మగవాళ్లు అభ్యం తరకర రీతిలో తాకడంపై మాట్లాడుతూ కథానాయిక అనుష్క ‘‘ఈ మధ్య హైదరాబాద్లో నాకిలాంటి ఓ ఘటన జరిగింది. ఆ మూమెంట్లో చంపెయ్యాలన్నంత కోపం వచ్చింది. కానీ, అలా చేయలేం కదా. అందుకే కొట్టాను. ఆ ఘటన జరిగిన రోజు రాత్రి నిద్ర పట్టలేదు. వక్రబుద్ధి ఉన్నవాళ్లే ఇలా చేస్తారనుకుంటా’’ అని పేర్కొన్నారు. అనుష్క చదువుకున్న, ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న, చుట్టూ మందీ మార్బలం ఉన్న వ్యక్తి. ఆమె ఆ క్షణంలో అనుకుని ఉంటే, చంపెయ్యాలన్నంత తన కోపానికి ఒక రూపాన్ని ఇచ్చి ఉండొచ్చు. బాంబే హైకోర్ట్ 2014లో మహేంద్ర చాటే కేసును విచారిస్తూ, ‘మీరు మహిళ భుజంపై మీ చేయి ఉంచినా సరే, ఆ స్పర్శ స్వభావం స్నేహపూర్వకమైనదా, సోదరపూర్వకమైనదా లేక పితృవాత్సల్యంతో కూడినదా అనే అంశంపై వ్యాఖ్యానించవలసింది ఆ మహిళ మాత్రమే’ అని వ్యాఖ్యానించిందని తెలిసి ఉంటే, తనని అభ్యంతరకర రీతిలో తాకిన ఆ వ్యక్తిని కొట్టడానికైనా సరే అతనికి చేయి తగిలించాల్సిన పని లేకుండా అనుష్క కేసు నమోదు చేసి ఉండొచ్చు, ఏ రెండేళ్లో జైలులో కూర్చోబెట్టి మిగిలిన ఆడవాళ్లకు ఒక సెలెబ్రిటీగా మార్గదర్శకం చేసి ఉండొచ్చు. ఆమెకైనా లేదా ఇతర స్త్రీలకైనా చట్టం తమకేం సౌలభ్యతలు కల్పిస్తుందో తమను ఎలా కాపాడుతుందో తెలియకపోవడం, ఆ చట్టాలను ఉపయోగించుకునే చొరవ, తెగువ లేకపోవడం పెద్ద లోపం. అలా తెలిసిన స్త్రీలను కూడా మగవాళ్లు సాంప్రదాయాల పేరు చెప్పి, సామాజిక అస్పృశ్యత బూచిని చూపించి అణచిపెడుతూ ఉంటారు. మగవాళ్లు, తమను తాము రక్షించుకోవడానికి రచించుకున్న ఈ భావజాలాలనుంచి బయటపడే తర్ఫీదు స్త్రీలకూ ఇవ్వాలి. స్త్రీవాద కవి జయప్రభ స్త్రీవాదం తొలిదశలో ‘‘చూపులు’’ అని ఒక కవిత రాశారు. ఇందులో ఆమె.. సెక్సిస్ట్ వైఖరితో ఆడదాన్ని గాయపరచగల మగవాడి చూపులెలా ఉంటాయో.. అవి ఆడవాళ్లని ఎంతగా హింస పెడతాయో చెబుతారు.. ‘‘రెండు కళ్లనించి చూపులు సూదుల్లా వచ్చి/ మాంసపు ముద్దలపై విచ్చలవిడిగా తిరుగుతుంటాయి /చూపులెప్పుడూ ముఖంలోకి చూడవు /మాట ఎప్పుడూ మనసు నించి పుట్టదు /కనిపించినప్పుడల్లా కంపరం పుట్టేలా/ఒంటిమీద చూపులు చెదల్లా పాకుతూ ఉంటాయి’’ అని చెపుతూ ‘‘ఈ దేశంలోని ఆడదానికి/ఒళ్లంతా ముళ్లుండే రోజు/ ఎప్పుడొస్తుందా’’ అని ముగిస్తారు. పాలనా యంత్రాంగంలో ఆకాశంలో సగమన్న స్త్రీకి చిటికెడు చోటుకూడా ఇవ్వని పురుష పరిపాలకులున్న ప్రపంచం ఇది. కవి సుధ ‘‘ఎవరి యుద్ధం వాళ్ళే చేయాలి/నీ యుద్ధం నువ్వే గెలవాలి/నీ రక్తంతో నీ మూలిగతో/నీ కత్తి డాలు నువ్వే చేసుకోవాలి’’ అని చెప్తారు స్త్రీలకు. స్త్రీలు మరోసారి ఉద్యమమై ఒకరికి ఒకరై ఈ వాక్యాలను పునరావృతం చేసుకుంటూ ముందుకు వెళ్లవలసిన అవసరాన్ని ఈ అతిచిన్ని వార్తాకథనం నాకు జ్ఞాపకం చేసింది. స్త్రీలు అవసరమయినపుడు వళ్లంతా ముళ్ళు పుట్టించుకుని తమను తాము రక్షించుకోగల విద్యలో తర్ఫీదు అవ్వాల్సిన అవసరాన్ని కూడా నాకీ వార్తాకథనం గుర్తుచేసింది. సామాన్య కిరణ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి ఫోన్ నెంబర్ : 80196 00900 -
మతసమస్యా, న్యాయసమస్యా?
నమ్మిన మూగజీవులను ప్రేమించడం, వాటికోసం స్వర్గాన్ని కూడా వదులుకోవడం మన సంప్రదాయం. కానీ దీపావళి రోజున పటాసులను పేల్చి వాటికి భంగం కలిగించడం న్యాయమేనా? నేషనల్ కేపిటల్ రీజియన్లో నవంబర్ ఒకటి వరకు బాణాసంచా అమ్మకాలపై నిషేధం విధిస్తూ, అక్టోబర్ 9న సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. చేతన్ భగత్ లాంటి వాళ్ళు ఈ విషయానికి మత రంగు పులమాలని ప్రయత్నిస్తున్నప్పుడు జస్టిస్ ఏ కె సిఖ్రి ‘‘నా గురించి తెలిసినవారికి నేను ఆధ్యాత్మికవాదిగా కనబడవచ్చు, కానీ ఇది న్యాయానికి సంబంధించిన సమస్య’’ అన్నాడు. కోర్టు ఇది ప్రజల ఆరోగ్యాలకు సంబంధించింది, మతాలకు కాదు అని నిర్ద్వందంగా ప్రకటించింది. మనం మనుషులం కదా, మనకు అభ్యుదయాన్ని కోరుకునే నాగరికులు ఉంటారు, కోర్టులుంటాయి, విప్లవ పోరాటాలూ ఉంటాయి. అందుకనే కోర్టుకెళ్లి బాణాసంచా వల్ల చాలా కాలుష్యం పెరిగిపోతుందని బాణాసంచా అమ్మకంపై నిషేధం తీసుకొచ్చాం. కానీ, పాపం భూమిపై సమాన హక్కే ఉన్నా పశు పక్ష్యాదులకు ఇవన్నీ ఏమీ లేవు. అందుకే మీరు పేల్చే బాణాసంచాకు మా చెవులు పగిలిపోతున్నాయి, మా గుండెలు ఆగిపోతున్నాయి, బాణాసంచా పేల్చడం ఆపండి అని కోర్టులకు ఎక్కలేకపోతున్నాయి. బాణాసంచాపై సుప్రీం కోర్టు తీర్పు వినగానే నాకు మొదట మా రాజమల్లిక జ్ఞాపకమొచ్చింది. రాజ మల్లిక నాకు ఇప్పుడే కాదు, డాం అని టపాసు పేలిన ప్రతిసారీ జ్ఞాపకమొస్తుంది. రాజమల్లిక సెయింట్ బెర్నార్డ్ జాతి కుక్క. దాదాపు 60 కిలోల బరువు ఉండి, అతి గంభీరమైన ముఖమూ, స్వభావము కలిగిన శున కం ఇది. చుట్టూ హోంగార్డులు ఉండే మా ఇంటిలో మా ఆవును దొంగిలించడానికి దొంగలు పడినప్పుడు, ఎక్కడో మిద్దె పైన ఉన్న రాజమల్లిక, పశువుల దొడ్డిలోని అలజడిని విని మా ఆవును కాపాడింది. మేముండే చోట అతి పెద్ద భూకంపం వచ్చినపుడు గట్టిగా అరిచి మమ్మల్ని హెచ్చరించింది. అలా కాపాడటానికి అవసరమైన శక్తి దానికి సునిశితమైన దాని చెవులు ఇచ్చాయి. అయితే రాజమల్లికకు ఉన్న ఈ శక్తి దానికి ఈ భూమిపైన టపాసులు పేలే ప్రతి పండుగనాడు నరకాన్ని చూపించింది. ఎంత సముదాయిం చినా దాని ఆందోళనను మేము ఆపలేకపోయినప్పుడు పశువైద్యుడు ఆందోళనను తగ్గించే మాత్రలు కానీ, స్వల్ప స్థాయిలో మత్తు ఇంజెక్షన్ కానీ ఇచ్చేవాడు. చివరికి ఒక వినాయక చవితి నిమజ్జనం రోజు టపాసుల శబ్దానికి భయపడి గుండె ఆగి రాజమ్మ మరణించింది. రాజమల్లికను ‘‘అక్క’’ అని భావించే నా కూతురు ఎన్నోసార్లు ఈ టపాసుల విషయాన్ని ప్రపంచానికి తెలి సేట్లు రాయమని నన్ను బతిమాలుకుంటూ ఉంటుంది. సత్యభామ నరకాసురుని వధించినప్పుడు ప్రజలు చాలా సంతోషించి, ఆ అమావాస్య రోజున దీపాలు వెలిగించి, కాంతితో నింపి ఆనందాన్ని ప్రకటించుకున్నారట. మనిషికి ఆనంద ప్రకటన పట్ల మక్కువ చాలా ఎక్కువ. దీపావళి వచ్చే కాలంలోనే వానలు వంకలూ వచ్చి పురుగూ పుట్రా పెరిగిపోయి ఉంటాయి. ఆ సమయంలో బాణాసంచా పేలిస్తే ఆ పొగకు విష పురుగులన్నీ చస్తాయని ఎవరో ఎక్కడో రాస్తే చదివాను. కానీ ఇవాళ మనం కేవలం దీపావళి సమయంలోనే టపాసులు పేల్చి ఆగిపోతున్నామా? నిజానికి మనుష్యులకు పురుగూ పుట్రా కన్నా కూడా తమ ఆనందాన్ని పక్క వీధివారికో, ఊరి చివరి వారికో చెవులలో మోత మోగించి మరీ వినిపించడం పట్ల చాలా ఆసక్తి ఉంటుంది. మన ఈ ఆసక్తి నోరులేని మూగజీవులను ఎంత బాధపెడుతుందో ఆలోచించకపోతే మనం ఆలోచించగల జీవులం ఎలా అవుతాం? పశు పక్ష్యాదులను భయపెట్టి జీవావరణ సమతుల్యతను దెబ్బతీయడం ఇప్పటికిప్పుడు పెద్ద ప్రమాదకారకంగా అని పించకపోవచ్చు కానీ భవిష్యత్తులో అదే పెద్ద చింతనీయమైన విషయంగా మారవచ్చునేమో కదా! మా తాతకి టామీ అనే దేశీ జాతి కుక్క ఉండేదిట. అది ఎప్పుడూ మా తాతను విడువకుండా తిరి గేది. అది చనిపోయాక మా తాత తినే ప్రతిసారీ మొదటి ముద్దను పక్కన పెట్టడం మొదలు పెట్టాడట. మేం పుట్టాక మాకు మాత్రమే కాదు మా ఊరందరికీ తెలుసు గండవరపు సుబ్బరామిరెడ్డి కుక్క పేరు టామీ అని, ఆయన తినే తిండిలోని మొదటి ముద్దకి అది హక్కుదారని. ధర్మరాజు భార్య, తమ్ముళ్లు మరణిం చాక తానొక్కడే ఒక కుక్క తోడుగా స్వర్గారోహణ చేశాడు. మధ్యదారిలో రథం వేసుకొచ్చి ఇంద్రుడు కలిశాడు, ఇక నడవనక్కరలేదు వచ్చి ర«థమెక్కు అన్నాడు. అందుకు ధర్మరాజు అన్నాడట ఈ కుక్క కూడా ర«థం ఎక్కవచ్చా అని. ఇంద్రుడు కుదరదూ అన్నాడట. కుక్కని వదిలివచ్చేయ్ అని బలవంతపెట్టాడట. అప్పుడు ధర్మరాజు ఇంద్రుడితో అన్నాడట ‘స్వామీ! ఈ కుక్కను వదిలి పెట్టడం నాకు కుదరని పని. దీనిని వదిలేసి వచ్చి పొందే స్వర్గం నాకు అవసరం లేదు. ఇక నువ్వు వెళ్ళు’ (మహాప్రస్థానిక పర్వం–59) అని స్వర్గాన్నే తిరస్కరించాడట. చాలామంది అంటున్నారు బాణాసంచా కాల్చడం మన సంప్రదాయం అని. నిజానికి బాణాసంచాకి వాడే గన్ పౌడర్ చైనా వారి ఆవిష్కరణ. అలా చైనా నుంచి టపాసులు పుట్టాయి. నమ్మిన మూగజీవులను హృదయపూర్వకంగా ప్రేమించడం, వాటికోసం స్వర్గాన్ని కూడా వదులుకోవడం మన సంప్రదాయం. సామాన్య కిరణ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి 91635 69966
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement