breaking news
Rukmini Devi Arundale
-
అభ్యుదయ నృత్యకారిణి రుక్మిణీదేవి అరండేల్
రుక్మిణీదేవి అరండేల్ జీవితం సమ్మోహనపరిచేదిగా ఉంటుంది. ఆమె దార్శనికురాలు. దివ్యజ్ఞాన సమాజ సభ్యురాలు. నాట్యకారిణి. నృత్య దర్శకురాలు. జంతు ప్రేమికురాలు. సంప్రదాయ భారతీయ కళలు, హస్తకళల్ని ప్రోత్సహించిన వ్యక్తి, వక్త. అన్నిటినీ మించి మానవతావాది. మదురైలో సనాతన సంప్రదాయ తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన రుక్మిణీదేవి 16 ఏళ్ల వయసులో తన కన్నా 20 ఏళ్లు పెద్దవాడైన బ్రిటిష్ దివ్యజ్ఞాన సమాజ వర్గీయుడు డాక్టర్ జార్జ్ ఎస్.అరండేల్ను పెళ్లి చేసుకుని తన వర్గంలో ప్రకంపనలు సృష్టించారు. ఆమె పై డాక్టర్అనీబిసెంట్, దివ్యజ్ఞాన సమాజ ఉద్యమం, స్వదేశీ ఉద్యమాల ప్రభావం ఉంది. రుక్ష్మిణీదేవి 29 ఏళ్ల వయసులో మైలాపూర్ గౌరి అమ్మ దగ్గర నృత్యం నేర్చుకున్నారు. అనంతరం పండనల్లూర్కు చెందిన గురు మీనాక్షీ సుందరం పిళ్లై వద్ద కూడా నృత్యాభ్యాసాన్ని కొనసాగించారు. ఆమె 31 ఏళ్ల వయసులో దివ్యజ్ఞాన సమాజంలో మొదటిసారి నృత్య ప్రదర్శన ఇచ్చారు. 1936 లో ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ను ప్రారంభించారు. అదే కళాక్షేత్రగా మారింది. శాస్త్రీయ భారతీ నృత్య రూపమైన సాధిర్ను పునరుద్ధరించడంలో (అదే ఇప్పుడు భరతనాట్యం) అరండేల్ రుక్ష్మిణీదేవికి సహాయపడ్డారు. ఇ.కృష్ణయ్యర్ తరువాత సాధిర్కు గౌరవనీయతను తీసుకు వచ్చింది అరండేలే. నృత్య రూపకం విధానం ఆవిర్భావానికి అరండేల్ వైతాళికురాలిగా నిలిచారు. ఆమెలో స్త్రీవాద దృక్పథం లేదా విమోచన పార్శ్యం కూడా ఉండేది. భర్తలు చనిపోయినప్పుడు భార్యలు తల వెంట్రుకలు తీయించుకోవడం పూర్వం ఆచారంగా ఉండేది. రుక్మిణీదేవి తన తండ్రి చనిపోయినప్పుడు తన తల్లికి గుండు గీయించడాన్ని వ్యతిరేకించారు. తన భర్త చనిపోయిన తరువాత కూడా ఆమె తన నుదిటి మీద కుంకుమ పెట్టుకోవడాన్ని యథా ప్రకారం కొనసాగించారు. యువతరానికి, నృత్య చరిత్రకారులకు ఆమె ఒక పరిశీలనాంశం. నిజంగానే ఆమె పునరుజ్జీవనం తీసుకు వచ్చిన మహిళ. దేశాధ్యక్ష పదవిని చేపట్టే అవకాశం ఎక్కువ మంది మహిళలకు రాలేదు. వచ్చిన అవకాశాన్ని తిరస్కరించిన వారూ ఎక్కువమంది లేరు. మొరార్జీ దేశాయ్ 1977లో వెండి పళ్లెంలో పెట్టి ఇచ్చినట్లుగా రాష్ట్రపతి పదవిని ఇవ్వజూపినప్పుడు రుక్మిణీదేవి అరండేల్ నిరాకరించారు. రాష్ట్రపతి భవన్లో ఉండటం కన్నా కళాక్షేత్రంలో ఉండడానికే ఆమె ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. – లీలా శామ్సన్, అరండేల్ శిష్యురాలు, కళాక్షేత్ర ఫౌండేషన్ డైరెక్టర్ -
దివ్య నాట్యం
జంతువులు మాట్లాడలేవు. కానీ నేనూ మీరూ వాటిలో మాట్లాడగలం కదా! వాటితో సంభాషణ జరపగలం కదా! అందుకే నేను వాటి మౌనరోదనను ప్రపంచానికి వినిపించేలా చేయాలని నడుం కట్టాను. మీరూ కట్టండి - రుక్మిణీదేవి అరుండేల్ జీవితం క్షణభంగురం కాదు. అనుక్షణ మాలిక. ప్రతి క్షణంలో చలనం ఉంటుంది. మార్పును తెస్తుంది. మన చుట్టూ ప్రపంచం పరిభ్రమిస్తుంది. మనమూ అనేక పరిభ్రమణలకు లోనవుతాం. ఈ క్రమంలో కేంద్రానికి చేరుతాం. అక్కడ కదలిక ఉండదు. అది సత్యం. అది దివ్యం. ఆ చైతన్యాన్ని పొందడమే దివ్యజ్ఞానం! ఆ దివ్యజ్ఞానాన్ని తాను పొందితే సరిపోతుందా? పదుగురికీ పంచాలి అనుకుంది రుక్మిణి. అప్పటికామె వయసు పదహారు.ప్రముఖ సంస్కృత పండితుడు, పీడబ్యుడీలో ఇంజినీర్ అయిన కె.ఎ.నీలకంఠశాస్త్రి- శేషమ్మాళ్ దంపతులకు 1904 ఫిబ్రవరి 29న రుక్మిణి మధురైలో జన్మించారు. అనీబిసెంట్ నాయకత్వంలోని థియొసాఫికల్ సొసైటీ (దివ్యజ్ఞాన సమాజం) చెన్నైలోని అడయార్ కేంద్రంగా పనిచేస్తోంది. దివ్యజ్ఞానం పట్ల ఆసక్తి కలిగిన నీలకంఠశాస్త్రి రిటైరైన అనంతరం మధురై నుంచి చెన్నైకు మకాం మార్చారు. తండ్రి, అంత కంటే ఎక్కువగా అనీబీసెట్ రుక్మిణిపై ప్రభావం చూపారు. థియొసాఫికల్ సొసైటీ తరఫున న్యూ ఇండియా పత్రికను తెచ్చే డా॥జార్జి అరుండేల్తో రుక్మిణికి తన 13వ ఏట పరిచయం ఏర్పడింది. పత్రికకు కవితలు, వ్యాసాలు కంట్రిబ్యూట్ చేసేది. ఆమె మెచ్యురిటీకి, ఉన్నత విలువల పట్ల గల ప్రేమకు అరుండేల్ ఆశ్చర్యపోయేవాడు. 16వ ఏట ఇరువురూ వివాహం చేసుకున్నారు. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ యంగ్ థియోసోఫిస్ట్స్ హోదాలో ప్రపంచ పర్యటనలు చేస్తోన్న రుక్మిణీ అరరుండేల్ రష్యన్ నాట్యకారిణి అన్నా పావ్లొవా ప్రదర్శించిన ‘డయింగ్ స్వాన్’ బ్యాలే నృత్యం చూసి వివశురాలైంది. ఆమె స్ఫూర్తితో రష్యన్ బ్యాలే అభ్యసించింది. దివ్యజ్ఞానాన్ని వ్యాప్తి చేసేందుకు నాట్యమే సరైన మాధ్యమం అని రుక్మిణి నిర్ణయించుకుంది. ఏ నృత్యం? చంద్రగిరికి చెందిన ముద్దు చంద్రరేఖ తంజావూరులోని ఇందిరా మండపంలో పేరిణి నృత్యాన్ని ప్రదర్శించింది. ఈ నృత్యమే తరువాతి కాలంలో భరతనాట్యం అయ్యింది. దేవదాసీలకే ప్రత్యేకమైన ఆలయనృత్యం కాలక్రమంలో రాజదర్బారులకు, కలవారి లోగిళ్లకు పతనం చెందింది. ఈ నృత్యం పరువుగలవారు చేసేది కాదని సమాజం ముద్రవేసింది. ఇటువంటి పరిస్థితుల్లో మెడ్రాస్ మ్యూజిక్ అకాడెమీలో ఇరువురు దేవదాసీలు చేసిన నృత్యం చూసిన రుక్మిణి అరుండేల్ భరతనాట్యం ద్వారా దివ్యజ్ఞానాన్ని వ్యాప్తిచేయాలని భావించింది. ఈ నిర్ణయం సంప్రదాయ బ్రాహ్మణ పెద్దలకు ఆగ్రహాన్ని కలిగించింది. మొదట విదేశీయునితో పెండ్లి. తర్వాత దేవదాసీల శిష్యురాలు. ఇంకేమైనా ఉందా అని చిటపటలాడారు. తమకు వత్తాసు దొరకని నేపథ్యంలో ‘మా అమ్మాయే’ అనడం తర్వాత కాలంలో వింత! అదలా ఉంచితే మైలాపూర్ గౌరీ అమ్మాళ్, మీనాక్షి సుందరం పిళ్లైల వద్ద రుక్మిణి నాట్యాన్ని నేర్చుకుంది. థియోసాఫికల్ సొసైటీ డైమండ్ జూబ్లీ సెలెబ్రేషన్స్ సందర్భంగా 1935లో అడయార్లో రుక్మిణి అరండేల్ తొలిసారి తన నృత్యాన్ని ప్రదర్శించింది. వివిధ దేశాలకు చెందిన థియోసాఫిస్ట్లు రుక్మిణిని కాశ్మిక్ డ్యాన్స్ ప్రదర్శించిన ‘దేవి’గా అభివర్ణించారు. మరుసటి సంవత్సరమే రుక్మిణి దేవి -అరండేల్ దంపతులు థియోసాఫికల్ సొసైటీలో కళాక్షేత్రను స్థాపించారు. అడయార్ నదికి మెరీనా బీచ్కు మధ్యగల 250 ఎకరాల సువిశాలమైన సహజ ప్రకృతిలో కళాక్షేత్ర దివ్యజ్ఞానాన్ని ప్రసరిస్తోంది. వివిధ దేశాల విద్యార్ధులు ఇక్కడ శిక్షణపొందుతున్నారు. కాంతి కిరణాలై ప్రకాశిస్తున్నారు. కళాక్షేత్రలో నృత్యమే నేర్పరు. నృత్యం ద్వారా వ్యక్తికి - సమాజానికి, వ్యక్తికి - ఇతర ప్రాణులకూ గల విడదీయలేని అనుబంధాన్ని తెలియజేస్తారు. పంచభూతాలు నువ్వు అవుతావు. నువ్వూ పంచభూతాలవుతావు అనే ఎరుకను కలిగిస్తారు. రుక్మిణి మాంసాహార భక్షణకు, జంతు బలులకు వ్యతిరేకి. ఇంటర్నేషనల్ వెజిటేరియన్ యూనియన్కు అధ్యక్షురాలై 1986లో మరణించేవరకూ 31 సంవత్సరాలు ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించారు. నృత్యంపై, దివ్యజ్ఞానంపై ఎన్నో పుస్తకాలు రాసారు. ఇండియా టుడే జాబితాలో నేటి భారతదేశాన్ని రూపొందించిన 100 మందిలో ఒకరుగా రుక్మిణి ఎంపికయ్యారు. సంగీతనాటక అకాడెమీ ఫెలోషిప్ పొందారు. 1956లో పద్మభూషణ్ స్వీకరించారు. భారత పూర్వ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్, రుక్మిణీ అరుండేల్ కంటే వయసులో పెద్ద. ఇరువురూ లీప్ సంవత్సరంలోనే జన్మించారు. ఆయనకు రుక్మిణి పట్ల ఎనలేని గౌరవం, అభిమానం. రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా మొరార్జీ మంత్రి మండలి రుక్మిణీదేవిను నిర్ణయించింది. ఆమె తిరస్కార ముద్రను చూపారు, సున్నితంగా!