breaking news
retired MEO
-
పెట్రోల్ పోసి కాలబెట్టాలె!
కరీంనగర్ రూరల్: ‘‘నా భూమి కోసం 15 ఏళ్లుగా చెప్పులరిగేలా తిరుగుతున్నా.. ఎవరూ పట్టించుకుంటలేరు. అధికారులందరిని పెట్రోల్ పోసి కాలబెట్టాలె..’’అంటూ కరీంనగర్ మండలం బొమ్మకల్కి చెందిన బాధితుడు మల్లికార్జున్ సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో హల్చల్ చేశాడు. రిటైర్డు ఎంఈవో మల్లికార్జున్కు బొమ్మకల్లో 3.24 గుంటల భూమి ఉంది. 15 ఏళ్ల క్రితం తన కుమారుడు విజయ్ పేరిట పాసుపుస్తకం ఎందుకిచ్చారని, తన భూమిని తనకే ఇవ్వాలని పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్నాడు. కొడుకు పేరిట రిజిస్ట్రేషన్ ఉండడంతో అధికారులు మిన్నకున్నారు. దీంతో సోమవారం జరిగిన ప్రజావాణికి వచ్చిన మల్లికార్జున్ రెవెన్యూ అధికారుల తీరుపై మండిపడ్డాడు. పదిహేనేండ్ల నుంచి తిరుగున్నా పట్టించుకోవడం లేదంటూ, అధికారులపై పెట్రోల్ పోసి కాలపెట్టాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మల్లికార్జున్ తీవ్ర పదజాలంతో అధికారులను దూషిస్తుండడంతో డీఆర్వో ప్రావీణ్య పోలీసులకు తెలిపారు. ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకోగా, స్ధానిక నేతల విజ్ఞప్తి మేరకు మల్లికార్జున్ను విడిచిపెట్టారు. -
కొడుకులిద్దరూ ఎస్సైలు తరచూ తండ్రి అరెస్ట్..
మెదక్ : అతనొక రిటైర్డ్ ఎంఈఓ...ఆయన ఇద్దరు కొడుకులు ఎస్సైలుగా పని చేస్తున్నారు. ఒకరు సివిల్ ఎస్సైగా, మరొకరు ఏఆర్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. కానీ ఆ తండ్రిని మాత్రం పోలీసులు తరచూగా అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్కు తరలిస్తున్నారు. స్టేషన్కు తరలించి స్వంత పూచీకతుపై ఏ సాయంత్రానికి వదిలిపెడుతున్నారు. ఇంతకీ ఆ తండ్రి చేసిన నేరం ఏంటని అనుకుంటున్నారా? ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటం చేయడమే ఆ అరెస్ట్లకు కారణం పేదల పక్షాన నిలబడి ప్రశ్నించడమే.. మెదక్ పట్టణం అజంపుర వీధికి చెందిన సార శ్యాంసుందర్ 1977 సంవత్సరంలో ఎజ్జీటీగా ఉపాధ్యాయ వృత్తిలో చేరి ఎంఈఓ స్థాయికి ఎదిగారు. 58 సంవత్సరాల ఆయన సర్వీస్లో వేలాది మంది విద్యార్థులకు బతుకు దారి చూపిన ఆయన 2012 సంవత్సరంలో మెదక్ ఎంఈఓగా రిటైర్డ్ అయ్యారు. ఆయనకు నలుగురు సంతానం. వారిలో ఇద్దరు కొడుకులు ఎస్సైలుగా స్థిరపడ్డారు. ఒకరు హైదరాబాద్లో సివిల్ ఎస్సైగా విధులు నిర్వహిస్తోంటే, మరో కొడుకు సీఆర్పీఎఫ్ ఎస్సైగా ఛత్తీస్ఘడ్లో ఉద్యోగం చేస్తున్నారు. శ్యాంసుందర్కు నెలనెలా ఐదంకెల పింఛన్ సైతం వస్తోంది. ఎలాంటి ఆర్థిక బాధలు, ఇబ్బందులు లేవు. కానీ ఆయన బాధంతా సమాజంలోని సమస్యలపైనే. వాటిపైనే ఆయన పోరాటం. టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సరసన చేరిన ఆయన జేఏసీ జిల్లా కో–చైర్మన్గా కొనసాగుతున్నారు. కోదండరాం పిలుపునిచ్చే ప్రతీ ఆందోళనలో ముందుంటూ పాల్గొంటున్నారు. నిరుద్యోగ నిరసన ర్యాలీలో పాల్గొని అరెస్టయ్యాడు. కరీంనగర్ జిల్లా నేరళ్ల ఘటన బాధితులను పరామర్శించేందుకు వెళ్లి అక్కడ అరెస్టయ్యాడు. రైతు రుణమాఫీలు, అన్నదాతల ఆత్మహత్యలపై కోదండరాం చేపట్టిన ఆందోళనలో అరెస్టయ్యాడు. కొలువుల కొట్లాటకు నిరసనకారులు వెళ్లకుండా ముందస్తుగా పోలీసులు అరెస్టు చేసిన ఘటనలోనూ శ్యాంసుందర్ మాస్టారును అదుపులోకి తీసుకున్నారు. ఇలా ప్రజా సమస్యలపై ముందుండి పోరాటం చేస్తున్న శ్యాంసుందర్ అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. అంతేకాకుండా మెదక్ మండలం బూర్గుపల్లి గ్రామానికి చెందిన మర్కిలి పోచయ్య దుబాయి వలసవెళ్లి గుండెపోటుతో మృతి చెందాడు. నెలల తరబడి అతడి మృతదేహాన్ని తీసుకురాకపోవడంతో శ్యాంసుందర్ మాస్టారు బాధిత కుటుంబీకులతో కలిసి మెదక్లోని రాందాస్ చౌరస్తాలో ధర్నా చేశారు. పోచయ్య మృతదేహాన్ని రప్పించడంలో కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా సామాజిక కార్యక్రమాల్లోనూ ఆయన ముందుండి ఇతరులకు తన వంతు సేవ చేస్తుంటాడు. తనతోటి పెన్షన్దారులతో కలిసి జిల్లా కమిటీని వేసి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుంటాడు. పెద్ద వయస్కులు, నడవలేని వారికి ప్రతీ యేటా లైఫ్ సర్టిఫికెట్లను సంబంధిత అధికారులకు సబ్మిట్ చేస్తూ వారికి అండగా ఉంటున్నాడు. తన సామాజిక వర్గానికి చెందిన నిరుపేద విద్యార్థులకు ఫీజులు కట్టడం, కోచింగ్లు ఇప్పించడం వంటి పలు కార్యక్రమాలను సైతం చేస్తూ మన్ననలు పొందుతున్నాడాయన. ప్రశ్నించేతత్వం ఉండాలి ప్రతీ వ్యక్తి ప్రజా సమస్యలపై ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలి. సమస్యలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తేనే వాటిని నెరవేర్చుతారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేస్తే వాటిపై గళమెత్తాలి. అప్పుడే సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయి. దీన్ని ప్రతీ ఒక్కరూ అలవర్చుకోవాలి. నిరుపేదలు ఆపదలో ఉంటే వారి తరఫున నిలబడడం, అత్యవసర సమయంలో తోచిన ఆర్థిక సహాయం చేయడంలో ఉన్న తృప్తి మరెందులోనూ ఉండదు. – సార శ్యాంసుందర్, రిటైర్డ్ ఎంఈఓ, జేఏసీ, ఎస్సీసెల్ నాయకుడు -
రిటైర్డ్ ఎంఈవో ఫలసాయం
రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులవినియోగానికి స్వస్తి సేంద్రియ సేద్యంతో మెరుగైన దిగుబడి నేడు మల్యాల మండలం ఓబులాపూర్లో మామిడి సాగుపై రైతులకు శిక్షణ జిల్లా రైతులు వేలాది ఎకరాల విస్తీర్ణంలో మామిడితోటలను సాగు చేస్తున్నారు. మామిడి సాగుపై సరైన అవగాహన లేక వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి చేతులు కాల్చుకుంటున్నారు. రైతులకు మెలకువలు నేర్పించి మేలైన దిగుబడులు సాధించేలా తోడ్పాటునందించాల్సిన ఉద్యానవన అధికారులు కనిపించకుండా పోతున్నారు. మామిడిలో తెగుళ్ల నివారణ కోసం, అధిక ఫలసాయం కోసం రైతులు రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులనే నమ్ముకుని నష్టపోతున్నారు. కొక్కు అశోక్కుమార్ సైతం మొదట్లో అందరిలాగే ముందుకు సాగాడు. శ్రమకు తగిన ఫలితం రాకపోవడంతో ఆలోచనలో పడ్డాడు. మామిడిలో అధిక దిగుబడి సాధించడంపై పలు ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యూడు. ఈ ఏడాది పైసా ఖర్చు లేకుండా ఏకంగా ఎనిమిది లక్షల ఆదాయం ఆర్జించబోతున్నట్టు ధీమాగా చెబుతున్నాడు. నాడు ఎంఈవోగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్ది.. నేడు మామిడి రైతులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాడు. -జగిత్యాల వ్యవసాయంలో విత్తనాలు, రసాయన ఎరువులు, పురుగు మందులపై పెట్టే పెట్టుబడులు ఏటేటా పెరుగుతున్నారు. ఆ ఖర్చుకు తగ్గట్టుగా ఆదాయం రాక రైతులు అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటున్నారు. హరితవిప్లవం తర్వాత అధిక దిగుబడి అంటూ సంప్రదాయ వ్యవసాయాన్ని వదిలేసి రసాయనాల వైపు పరుగులు తీస్తున్నారు. దీంతో భూములు నిస్సారమై దిగుబడులు గణనీయంగా తగ్గారు. రసాయనాల ప్రభావంతో భూమిలో రైతులకు మేలు చేసే పురుగులు కూడా కనుమరుగవుతున్నారు. జగిత్యాల పట్టణం పోచమ్మవాడకు చెందిన కొక్కు అశోక్కుమార్ అనే రిటైర్డ్ ఎంఈవో వినూత్న ప్రణాళికతో పెట్టుబడి లేని సంప్రదాయ వ్యవసాయం చేస్తున్నాడు. తోటి రైతుల కోసం ఆదివారం తన తోటలో ఒక్కరోజు శిక్షణ ఇస్తుండడం విశేషం. ఎనిమిది ఎకరాల్లో మామిడి అశోక్కుమార్ మల్యాల మండలం ఓబులాపూర్ శివారులో ఎనిమిదెకరాల భూమి కొనుగోలు చేశాడు. ఉద్యోగ విరమణ తర్వాత భూమిని చదును చేయించి మామిడి మొక్కలు నాటాడు. మొదట్లో అందరిలాగే బస్తాలకు బస్తాలు రసాయన ఎరువులు వేయడం, నాలుగైదుసార్లు క్రిమిసంహారక మందులు పిచికారీ చేయడం, ఐదారుసార్లు మామిడివేర్లు తేలేటట్టు ట్రాక్టర్తో దున్నించడం చేశాడు. దీంతో భూమి కొనుగోలుకు అరుున ఖర్చు కంటే మామిడితోట నిర్వహణపై పెట్టే ఖర్చు మూడింతలు ఎక్కువగా ఉండేది. ఇలా నాలుగైదు ఏళ్లు రసాయన మందులు విపరీతంగా పిచికారీ చేస్తుండటంతో మామిడితోటలో దిగుబడి పెరిగే బదులు కొమ్మతొలుచు పురుగు, ఆకుమచ్చ ఏర్పడం మొదలైంది. పలు రకాల తెగుళ్లు, రోగాలు వచ్చి మామిడిని నష్టం చేస్తుండేవి. హైదరాబాద్లో శిక్షణ హైదరాబాద్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ (ఎన్ఐపీహెచ్ఎం) మామిడి రైతులకు శిక్షణ ఏర్పాటు చేసింది. ఈ విషయం తెలుసుకున్న అశోక్కుమార్ అక్కడికి వెళ్లి నాలుగైదు నెలలపాటు శిక్షణ పొందాడు. విద్యాధికుడు కావడంతో ప్రకృతిని ఎలా కాపాడాలి? ప్రకృతి సమతుల్యత దెబ్బతిని పంటలకు మేలు చేసే పురుగులు ఎలా కనుమరగవుతున్నారుు? అనే విషయాలతోపాటు జీవన ఎరువులను ఎలా తయారు చేయాలి? వాటిని ఎలా వాడాలి? అనే అంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. మొదలైన మిత్ర పురుగుల పెంపకం శిక్షణ తర్వాత ఎన్ఐపీహెచ్ఎం శాస్త్రవేత్తలు ఉచితంగా రెడ్విడ్ బగ్స్, బ్రేకాన్స్, ట్రైకోగ్రామా, ట్రైకోకాడ్స్ వంటి మిత్రపురుగులను ఒక్కో జత అందించారు. దీంతో ఈ పురుగులను లార్వా దశ నుంచి ఎగిరే దశ వరకు ఇంటి దగ్గర పెంచుతున్నాడు. ఇవి కొద్ది రోజుల్లోనే ఒక్కో పురుగు తన జాతి లక్షణాన్ని బట్టి 400-500 గుడ్లు పెడుతుంటాయి. ఇలా ఏడాదిలోనే మిలియన్, ట్రిలియన్ మిత్ర పురుగులను తయారు చేసి, మామిడితోటలో వ దులుతుంటాడు. ఈయన మామిడితోటకు వెళితే పురుగుమందుల వాసనకు బదులు మంచి సువాసన వెదజల్లే మిత్ర పురుగులు కనువిందు చేస్తూ, స్వాగతం పలుకుతుంటాయి. ప్రతీ కొమ్మ మీద సాలేపురుగులు వంటివి కనిపిస్తాయి. ఏడాదికి ఒకమారు మాత్రమే మామిడి తోటను దున్నిస్తాడు. భూమి బలోపేతం కోసం మరిన్ని చర్యలు భూమిని సారవంతం చేసేందుకు సుభాష్ పాలేకర్ విధానంలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయానికి మరింత ఆధునికతను జోడించాడు. చిక్కుడు, పెసర, కంది, మినుములు, ఉలువలు, జనుము, జీలుగ వంటివి సేకరించి, వర్షాలు కురియగానే మామిడితోటలో చల్లుతాడు. ఒక లీటర్ ఆవుమూత్రం, ఆవుపేడతో తయారు చేసిన జీవామృతంలో, 100 గ్రాముల టైకో డెర్మా శిలింధ్రంతోపాటు 100 గ్రాముల సుడోమోనాస్ బ్యాక్టీరియాతో లీటర్ ద్రావణం తయారవుతుంది. దీంట్లో విత్తనాలను మూడు రోజులు నానబెట్టి, తర్వాత ఆరబెట్టాలి. విత్తనాలు చల్లుతున్నాడు. ఇలా రెండేళ్లుగా చేస్తున్నాడు. పంటకు వచ్చిన తర్వాత వాటి నుంచి విత్తనాలను మరో పంటకు సేకరించి, మొక్కలను అలాగే వదిలేస్తాడు. ఈ మొక్కలు మిత్ర పురుగులకు ఉపయోగకరంగా ఉండటంతోపాటు భూమికి మల్చింగ్గా పనిచేస్తాయి. వర్మి కంపోస్టు, వర్మివాష్ మామిడి చెట్లకు వర్మి కంపోస్టు, వర్మి వాష్ను ఉపయోగిస్తారు. ఒక లారీ పేడ తెప్పించి దాంతో వర్మి కంపోస్టు తయారు చేస్తాడు. ఇందుకోసం రెండు షెడ్లు నిర్మించుకున్నాడు. ఇందులో తయారైన వర్మికంపోస్టును మొక్కలకు పోస్తాడు. ఓ డ్రమ్ములో ఇసుక, కంకరరాళ్లు, వర్మి కంపోస్టు పోసి, అందులో ఆవు మూత్రం పోసి వర్మి వాష్ తయారు చేస్తుంటాడు. దీనిని లీటర్ల కొద్ది చెట్లకు అందిస్తుంటాడు. వీటి తయారీలో ఎక్కడ కూడా నీటిని ఉపయోగించడు. ఆవును కొనుగోలు చేసి, దాని ద్వారా వచ్చే మూత్రాన్ని సేకరించి అన్ని పదార్థాల్లో ఉపయోగిస్తాడు. ఆవు మూత్రం నేరుగా ఓ తొట్టెలోకి వెళ్లేలా షెడ్డు నిర్మించాడు. జీవామృతం తయారీలో బెల్లంకు బదులు రాలిన మామిడి కాయలను ఓ తోట్టిలో వేసి నెలల తరబడి మాగబెట్టి వాడుతుంటాడు. రెండేళ్లుగా ఇలాంటి పద్ధతులు పాటించడంతో గతేడాది రూ.4 లక్షల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది పెట్టుబడి ఖర్చు లేకపోగా... ఈ విధానంలో దిగుబడి పెరిగే అవకాశముండడంతో దాదాపు రూ.8 లక్షల ఆదాయం కంటే తక్కువ రాదని ఘంటాపథంగా చెపుతుండటం విశేషం. రైతులకు శిక్షణ ఇచ్చే స్థాయికి.. హైదరాబాద్లోని ఎన్ఐపీహెచ్ఎంలో జరిగే కార్యక్రమాల్లో తోటి రైతులకు ఇప్పటికే ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ఇప్పటికే హైదరాబాద్లో శిక్షణ పొందిన జగిత్యాల మండలం లక్ష్మీపూర్, మల్యాల మండలం లంబాడిపల్లె, ఓగులాపూర్, మేడిపల్లి మండలం మాచాపూర్, సారంగాపూర్ మండలం లక్ష్మీదేవిపల్లె, నాగునూర్ గ్రామాలకు చెందిన రైతులతోపాటు, ఆసక్తి ఉన్న ఇతర రైతులకు ఓబులాపూర్లోని తన తోటలో ఒక్క రోజు ఉచితంగా శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాల కోసం రైతు కోక్కు అశోక్కుమార్ను 98661 92761లో సంప్రదించవచ్చు.