breaking news
Republic Day Chief Guest
-
గణతంత్ర దినోత్సవం; అలా ఇది నాలుగోసారి!
లాస్ట్ మినిట్లో ‘అయామ్ సారీ’ అనేశారు బోరిస్ జాన్సన్. బ్రిటన్ ప్రధాని ఆయన. ముందనుకున్నట్లుగా నేటి మన గణతంత్ర దినోత్సవానికి జాన్సన్ రావడం లేదు. వచ్చే పరిస్థితి లేదు. బ్రిటన్లో కరోనా ‘రెండో రూపం’ దాల్చింది. అందుకే సెంట్రల్ లండన్లోని డౌనింగ్ స్ట్రీట్లో ఉన్న వాళ్ల ప్రధాని పాలనా భవనం ఇండియాకు ‘సారీ’ నోట్ పంపించింది. డిసెంబర్లోనే ఆయన కు ఆహ్వానం పంపాం. ఓకే కూడా అన్నారు. జనవరి కంతా సీన్ మారి పోయింది. 55 ఏళ్ల తర్వాత మళ్లీ ఇదే అతిథి లేకుండా మన రిపబ్లిక్ పరేడ్ జరగబోవడం. ఇంకో అతిథిని పిలవొచ్చు. అయితే అప్పటికే సమయం మించిపోయింది. ఈరోజు జరుగుతున్నది 72 వ గణతంత్ర దినోత్సవం. ఇండియా ఆవిర్భవించాక ఇంతవరకు మూడుసార్లు మాత్రమే ముఖ్య అతిథి లేకుండా రిపబ్లిక్ డే జరిగింది. నేటి పరేడ్ కూడా పూర్తిగా ఇక మన ఇంటి కార్యక్రమం. మనలో మన మాట... అతిథి లేకపోతేనేం! ఈ కార్యక్రమాన్ని నేరుగా సందర్శించే వారు, టీవీలలో వీక్షించే వారు అందరూ అతిథులే ఈసారికి! రిపబ్లిక్ పరేడ్లో ప్రధాని ఇందిరాగాంధీ (1967) అతిథి లేని రిపబ్లిక్ ‘డే’లు మూడంటే మూడేసార్లు 1952లో, 1953లో, 1966లో అతిథి లేకుండా మన రిపబ్లిక్ డే పరేడ్లు జరిగాయి. 1966లో అతిథి లేకపోవడమూ, రాకపోవడమూ కాదు. రాజకీయంగా మనం కొంచెం అస్థిమితంగా ఉన్నాం. ఇండో–పాక్ యుద్ధాన్ని ముగింపునకు తెచ్చేందుకు శాంతి ఒప్పందం విషయమై రష్యాలోని తాష్కెంట్కు వెళ్లిన అప్పటి మన ప్రధాని లాల్బహుదూర్ శాస్త్రి ఒప్పందంపై సంతకాలు అయిన రెండో రోజే 1966 జనవరి 11న హటాత్తుగా మరణించారు. ప్రధాని లేకుండా ఒక్క రోజైనా దేశం ఉండకూడదు. అదే రోజు గుల్జారీలాల్ నందా దేశ ప్రధాని అయ్యారు. జనవరి 24 వరకు ప్రధానిగా ఉన్నారు. జనవరి 24న ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారు. ఇక రిపబ్లిక్ డేకి ఉత్సవాలకు ఉన్న సమయం 48 గంటలు. అతిథిని పిలవలేకపోయాం. ఆ ముందు కూడా 1952, 1953 లలో ఎవర్నీ ఆహ్వానించలేదు. అందుకు ప్రత్యేక కారణం అంటూ లేదు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, భారత ప్రధాని మోదీ (ఫైల్ ఫొటో) అసలు అతిథి ఎందుకు? ఇది మరీ బాగుంది. అతిథి వస్తే ఆ కళే వేరుగా ఉండదా! మన మిలటరీని చూపించుకోవచ్చు. మన ప్రజల్ని, మన సంప్రదాయాల్ని, మనం ఇచ్చే గౌరవ మర్యాదల్ని అతిథికి చూపించవచ్చు. ఇవన్నీ పైపైన. రాజనీతి వ్యూహాలు కొన్ని ఉంటాయి. బ్రిటన్ ప్రధానినే ఈసారి ఎందుకు ఆహ్వానించామంటారు? కారణం ఉంది. బ్రిటన్ ఐరోపా సమాఖ్య నుంచి అధికారికంగా బయటికి వచ్చేసి ఉంది. ఇండియా ఆర్.సి.ఇ.పి. (రీజనల్ కాంప్రెహె న్సివ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్) లోకి వెళ్లేందుకు సంశయిస్తోంది. ఆర్.సి.ఇ.పి. మీద ఇప్పటికే ఆసియాదేశాలు చాలావరకు సంతకాలు చేసేశాయి. బ్రిటన్కి, ఇండియాకు గ్రూప్లో ఒకరిగా ఉండటం ఇష్టం లేదు. అందుకే బ్రిటన్ బయటికి వచ్చేస్తే, ఇండియా లోపలికి వెళ్లడం లేదు. ఈ సమయంలో లండన్, ఢిల్లీ ఒకటిగా ఉంటే.. వాణిజ్యం, పరిశ్రమల రంగాల్లో ఏ ప్రయోజనాలైతే కలిసి సాధిస్తామని ఆ గ్రూపులు అంటున్నాయో వాటినే ఈ రెండు దేశాలూ కలిసి వేరుగా సాధించుకోవచ్చు. అందుకు ఒక సోపానం గౌరవ ఆతిథ్యం కూడా. తొలి అతిథి సుకర్నోతో ప్రధాని నెహ్రూ తొలి అతిథి సుకర్ణో 1947లో మనకు స్వాతంత్య్రం వచ్చింది. రెండున్నరేళ్లకు 1950లో రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకున్నాం. ఆ తెచ్చుకున్న తేదీ జనవరి 26. అదే రిపబ్లిక్ డే. అదే గణతంత్ర దినం. ఆ ఏడాది మన గెస్టు.. స్వతంత్ర భారత గణతంత్ర ఉత్సవానికి తొలి ముఖ్య అతిథి.. ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్ణో. అప్పుడు మన రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్. మన ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. మన తొలి రిపబ్లిక్ డేకి సుకర్ణోను ఆహ్వానించడానికి తగిన కారణమే ఉంది. మనకు 47లో స్వాతంత్య్రం వస్తే, వాళ్లకు 45లో వచ్చింది. ఇంచుమించు అదే సమయంలో ఆసియా, ఆఫ్రికాల్లోని దేశాలు సామ్రాజ్యవాద శక్తుల నుంచి విముక్తి పొందిన తొలినాళ్ల నడకలో ఉన్నాయి. అవన్నీ.. మన ఇండియా సహా.. లోలోపల ఒక స్నేహ వలయంలా ఏర్పడ్డాయి. ఆ స్నేహంతోనే మనం సుకర్ణోను ఆహ్వానించాం. తొలి రిపబ్లిక్ పరేడ్ (1950) తొలి పరేడ్ రాజ్పథ్లోనే! తొలి రిపబ్లిక్ వేడుకలు (1950) కూడా ఇప్పుడు జరుగుతున్నట్లే రాజ్పథ్లోనే జరిగాయి. ఆ ఏడాది రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ ఓపెన్ టాప్ గుర్రాల బగ్గీలో కూర్చొని రాష్ట్రపతి భవన్ నుంచి పరేడ్ గ్రౌడ్స్కి బయల్దేరారు. పరేడ్ ను చూడ్డానికి వచ్చిన వారందరికీ ప్రభుత్వం స్వీట్లు పంచిపెట్టింది. తర్వాతి పరేడ్లు వేర్వేరు ప్రాంతాల్లో జరిగాయి. ఎర్రకోటలో ఒకసారి, ఇర్విన్ స్టేడియంలో ఒకసారి, రామ్లీలా మైదానంలో ఒకసారి.. ఇలా. 1955 నుంచి మాత్రం రాజ్పథ్లోనే రిపబ్లిక్ డేను నిర్వహిస్తున్నారు. -
రిపబ్లిక్డే : చీఫ్ గెస్ట్కు కొత్త కరోనా దెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటన్లో కొత్త కరోనా వైరస్ విజృంభణ కారణంలో బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్ట్రెయిన్ కారణంగా బోరిస్ జాన్సన్ భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. మహమ్మారి నివారణ చర్యలను పర్యవేక్షించాల్సిన అవసరాన్ని పేర్కొంటూ ఆయన తన టూర్ను విరమించుకున్నారు. ఈ మేరకు జాన్సన్ భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో మాట్లాడారు. గత రాత్రి ప్రకటించిన జాతీయ లాక్డౌన్, కొత్త కరోనావైరస్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్ననేపథ్యంలో తాను దేశంలో ఉండడం చాలా ముఖ్యం అని ప్రధాని పేర్కొన్నారు. ప్రణాళిక ప్రకారం ఈ నెలాఖరులో భారతదేశాన్ని సందర్శించలేకపోతున్నారని విచారం వ్యక్తం చేశారని డౌనింగ్ స్ట్రీట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. (దేశంలో విస్తరిస్తున్న కొత్త కరోనా) జనవరి 26, భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ హాజరు కావాల్సి వుంది. అయితే కొత్తరకం కరోనా స్ట్రెయిన్ ప్రకంపనలు కొనసాగుతుండటంతో యూకేలో మరోసారి లాక్డౌన్ విధిస్తున్నట్టు ప్రధాని సోమవారం ప్రకటించారు. దేశంలోని చాలా ప్రాంతం ఇప్పటికే కఠిన ఆంక్షల్లో ఉందనీ, కొత్త వేరియంట్ను నియంత్రించడం అత్యంత క్లిష్టమని, అందుకే దేశవ్యాప్త లాక్డౌన్ విధించాల్సి వచ్చిందని, కొత్త మహమ్మారిని అదుపులోకి తీసుకొచ్చేందకు మరింతగా శ్రమించాల్సి ఉందని జాన్సన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. -
భారత్లో బ్రెజిల్ అధ్యక్షుడు
న్యూఢిల్లీ: బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో నాలుగురోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం భారత్కు చేరుకున్నారు. ప్రధాని మోదీతో సమావేశమై 15 ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. ఇందులో ప్రధానంగా ఆయిల్, గ్యాస్, మైనింగ్, సైబర్ భద్రత ఉన్నట్లు అధికారులు తెలిపారు. అంతేగాక 71వ గణతంత్ర దినోత్సవాలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావడం ఇది మూడోసారి. -
గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా బరాక్ ఒబామా
వార్తల్లో వ్యక్తులు విశ్వసుందరిగా పౌలీనా వేగా కొలంబియాకు చెందిన 22 ఏళ్ల పౌలీనా వేగా మిస్ యూనివర్స్ 2014గా ఎన్నికైంది. జనవరి 26న జరిగిన ఫైనల్స్ పోటీల్లో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన 80 మందికిపైగా పోటీదారులను వెనక్కునెట్టి వేగా విశ్వసుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది. అమెరికాలోని ఫ్లోరిడాలో మిస్యూనివర్స్ 63 ఎడిషన్ పోటీలను నిర్వహించారు. భారత్కు చెందిన నయోనితా ఈ పోటీల్లో టాప్ టెన్లోకి అర్హత సాధించలేకపోయింది. ఈ పోటీల్లో రన్నరప్స్గా మిస్ అమెరికా నియా సాంచెజ్, మిస్ ఉక్రెయిన్ డయానా హర్కూషా, మిస్ జమైకా కాసి ఫెన్నెల్, మిస్ నెదర్లాండ్స్ యాస్మిన్ వర్హెజీన్లు నిలిచారు. ఐరాస శాంతిస్థాపన ప్యానెల్లో సరస్వతీ మీనన్ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్కీ మూన్.. శాంతి స్థాపన కార్యక్రమాల సమీక్ష ప్యానల్లో భారత సామాజికవేత్త సరస్వతి మీనన్ను నియమించారు. ఈ నియామకం ఐరాస జనరల్ అసెంబ్లీ, భద్రతా మండలి ఆమోదించిన నిబంధనలకు అనుగుణంగా జరిగింది. ప్యానెల్లో మొత్తం ఏడుగురు సభ్యులు ఉంటారు. ఈ సలహా బృందం బురుండి, దక్షిణ సూడాన్ తదితర దేశాల్లో పర్యటించి, శాంతిస్థాపన చర్యలను సమీక్షిస్తుంది. ఆర్కే లక్ష్మణ్ కన్నుమూత ‘కామన్ మ్యాన్’ సృష్టికర్త, ప్రఖ్యాత కార్టూనిస్టు ఆర్కే లక్ష్మణ్(94) జనవరి 26న పుణెలోని దీనానాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో అనారోగ్యంతో కన్నుమూశారు. లక్ష్మణ్ పూర్తిపేరు రాసీపురం కృష్ణస్వామి లక్ష్మణ్. 1921, అక్టోబరు 24న మైసూర్లో జన్మించారు. మైసూరు వర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా సాధించారు. ఆ తర్వాత పలు పత్రికల్లో కార్టూన్లు, ఇలస్ట్రేషన్లు వేసి పేరు తెచ్చుకున్నారు. లక్ష్మణ్ 1951లో ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రికలో ‘యూ సెడ్ ఇట్’ శీర్షికతో కామన్ మ్యాన్ కార్టున్లు ప్రారంభించి యావత్ దేశాన్ని ఆకర్షించారు. లక్ష్మణ్ ‘ది టన్నెల్ ఆఫ్ టైమ్’ పేరుతో ఆత్మకథ రాశారు. ‘హోటల్ రివేరా’ తదితర నవలలూ రచించారు. ‘మాల్గుడీ డేస్’ టీవీ ప్రసారాలకు, కొన్ని హిందీ సినిమాలకు ఇలస్ట్రేటర్గా పని చేశారు. కళలు, సాహిత్యం, జర్నలిజంలో విశిష్ట కృషికి ఆయన పద్మవిభూషణ్, మెగసెసే తదితర విశిష్ట పురస్కారాలు అందుకున్నారు. అభిశంసనకు గురైన థాయిలాండ్ మాజీ ప్రధాని సైన్యం మద్దతు ఉన్న థాయిలాండ్ పార్లమెంటు నేషనల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ (ఎన్ఎల్ఏ).. ఆ దేశ మాజీ ప్రధాని ఇంగ్లక్ షినవత్రాను జనవరి 23న అభిశంసనకు గురిచేసింది. దీంతో ఆమెను రాజకీయాల నుంచి అయిదేళ్లు పాటు నిషేధించడానికి అవకాశం ఏర్పడిం ది. బియ్యం సబ్సిడీ పథకంలో అవినీతిని అరికట్టలేకపోయారన్న కారణంగా ఇంగ్లక్ను అభిశంసించారు. జాతీయం గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా బరాక్ ఒబామా భారత 66వ గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరయ్యారు. జనవరి 26న ఢిల్లీలో జరిగిన వేడుకల్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి సైనిక కవాతు, శకటాల ప్రదర్శన, వైమానిక విన్యాసాలను తిలకించారు. ఈ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు ముఖ్య అతిథిగా రావడం ఇదే తొలిసారి. భారత్లో రెండోసారి పర్యటించిన తొలి అమెరికా అధ్యక్షుడు కూడా ఒబామాయే. దేశం కోసం ప్రాణాలర్పించిన నాయక్ నీరజ్కుమార్, మేజర్ ముకుంద్ వరదరాజన్లకు మరణానంతరం ప్రకటించిన అశోకచక్ర పురస్కారాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. స్మార్ట్సిటీల అభివృద్ధి ఒప్పందం విశాఖపట్నం(ఏపీ), అలహాబాద్(యూపీ), అజ్మీర్(రాజస్థాన్)లను స్మార్ట్సిటీలుగా అభివృద్ధి చేసే అంశంపై ఆయా రాష్ట్రాలు, అమెరికా మధ్య జనవరి 25న అవగాహనా ఒప్పందం కుదిరింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, అమెరికా, భారత అధికారుల సమక్షంలో అమెరికా వాణిజ్య, అభివృద్ధి సంస్థ (యూఎస్టీడీఏ) డెరైక్టర్ లియోకాడియా ఐజ్యాక్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావులు పరస్పరం విశాఖ స్మార్ట్ సిటీకి సంబంధించిన అవగాహనా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. అణు ఒప్పందంపై అవగాహన అణు ఒప్పందంపై నెలకొన్న ప్రతిష్టంభనకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, భారత ప్రధాని నరేంద్ర మోదీలు జనవరి 25న ఢిల్లీలో జరిపిన చర్చలు తెరదించాయి. ఇద్దరు అగ్రనేతల మధ్య హైదరాబాద్ హౌస్లో మూడు గంటల పాటు కొనసాగిన చర్చల్లో.. అణు ఒప్పందం అమలుకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు.. ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడంపైనా ఒప్పందాలు ఖరారు చేసుకున్నారు. ‘బేటీ బచావో.. బేటీ పఢావో’ను ప్రారంభించిన మోదీ బాలికాసంక్షేమం, లింగ వివక్ష అంతం లక్ష్యాలుగా ‘బేటీ బచా వో.. బేటీ పఢావో’(ఆడపిల్లల్ని కాపాడండి.. ఆడపిల్లల్ని చదివించడం)’ ప్రచార కార్యక్రమాన్ని హరియాణలోని పానిపట్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 22న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాలికలకు ఆర్థిక స్వావలంబన కల్పించే ‘సుకన్య సమృద్ధి యోజన’ను మోదీ ప్రారంభించారు. దీన్ని బాలికలు తక్కువగా ఉన్న 100 జిల్లాల్లో అమలు చేస్తారు. ఇది పదేళ్ల లోపు బాలికలకు ఎక్కువ వడ్డీ(9.1%), ఆదాయపన్ను రాయితీ లభించే డిపాజిట్ పథకం. పుట్టినప్పటి నుంచి పదేళ్లలోపు కనీసం వెయ్యి రూపాయల డిపాజిట్తో బ్యాంకుల్లో కానీ, పోస్టాఫీసుల్లో కానీ అకౌంట్ను ప్రారంభించవచ్చు. అందులో ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.5 లక్షలను డిపాజిట్ చేయొచ్చు. ప్రారంభించిన నాటి నుంచి 21 ఏళ్ల పాటు లేదా ఆ బాలికకు వివాహం అయ్యేంత వరకు ఆ అకౌంట్ క్రియాశీలంగా ఉంటుంది. బాలికకు 18 ఏళ్లు నిండిన తరువాత ఉన్నత చదువుల కోసం పాక్షికంగా డబ్బును తీసుకోవచ్చు. భారత మామిడిపై నిషేధం ఎత్తేసిన ఈయూ భారత్ నుంచి దిగుమతి అయ్యే మామిడి పండ్లపై నిషేధం ఎత్తేయాలని ఐరోపా యూనియన్ (ఈయూ) జనవరి 20న నిర్ణయించింది. ఈ పండ్లలో పురుగుమందుల అవశేషాలు ఉన్నాయంటూ 2014, మే 1 నుంచి 2015 డిసెంబర్ వరకు నిషేధం విధిస్తూ ఈయూ గతంలో నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భారత్ మామిడి మొక్కల సంరక్షణ వంటి వాటిలో గణనీయ పురోగతి సాధించినందున నిషేధం అవసరం లేదని ఈయూ భావించింది. జాతీయ వారసత్వ అభివృద్ధి పథకం దేశంలోని వారసత్వ నగరాలను అభివృద్ధి చేయడానికి కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన ‘హృదయ్ (హెరిటేజ్ సిటీస్ డెవలప్మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన)’ పథకాన్ని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు జనవరి 21న ఢిల్లీలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం కింద తెలంగాణలోని వరంగల్, ఆంధ్రప్రదేశ్లోని అమరావతి, రాజస్థాన్లోని అజ్మీర్, ఉత్తరప్రదేశ్లోని వారణాసి, మధుర, పంజాబ్లోని అమృత్సర్, గుజరాత్లోని ద్వారక, బీహార్లోని గయ, కర్ణాటకలోని బాదామి, ఒడిశాలోని పూరీ, తమిళనాడులోని కాంచీపురం, వేలాంగణి నగరాలను ఎంపిక చేశారు. ఇందులో వరంగల్ నగరానికి రూ. 40.54 కోట్లు, ఏపీలోని అమరావతికి రూ.22.26 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో నగరాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించి, పూర్తి పారిశుద్ధ్య పరిస్థితులు నెలకొల్పాల్సి ఉంటుంది. పర్యాటకులకు పూర్తిస్థాయి భద్రతకు చర్యలు తీసుకోవాలి. దేశంలో 2,226కు చేరిన పులుల సంఖ్య దేశంలో పులుల సంఖ్య 2014లో 2,226కు చేరినట్లు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ జనవరి 20న విడుదల చేసిన ‘స్టేటస్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా-2014’ నివేదికలో వెల్లడించింది. ప్రపంచంలోని పులుల సంఖ్యలో 70 శాతం భారత్లో ఉన్నాయి. 2010 నాటికి 1,706 ఉండగా, 30.5 శాతం వృద్ధితో 2014 నాటికి 2,226కు పెరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 2010 లో 72 పులులు ఉండగా, 2014 నాటికి 68కి తగ్గింది.కేరళలోని పెరియార్ టైగర్ రిజర్వ్కు నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) అవార్డును జనవరి 20న ప్రకటించారు. రిజర్వ్ విస్తరణలో ప్రజా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించినందుకు ఈ అవార్డు దక్కింది. వృద్ధిలో చైనాను అధిగమించనున్న భారత్ భారత వృద్ధిరేటు 2016లో 6.5 శాతంగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) జనవరి 20న విడుదల చేసిన ప్రపంచ ఆర్థిక నివేదికలో అంచనా వేసింది. ఇదే ఏడాది చైనా వృద్ధిరేటు 6.3 శాతంగా ఉండొచ్చని తెలిపింది. భారత వృద్ధిరేటు 2014లో 5.8 శాతం (చైనా 7.4 శాతం) ఉండగా, 2015లో 6.3 శాతం ఉండొచ్చని అంచనా వేసింది. ముడిచమురు ధరల క్షీణత, పరిశ్రమల్లో పెట్టుబడులు పుంజుకోవడం వంటివి భారత్కు అనుకూల అంశాలని నివేదికలో పేర్కొన్నారు. పురస్కారాలు తొమ్మిది మందికి పద్మ విభూషణ్ దేశంలో ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలు ‘పద్మ’ అవార్డులను కేంద్ర ప్రభుత్వం జనవరి 25న ప్రకటించింది. 9 మందికి పద్మ విభూషణ్, 20మందికి పద్మ భూషణ్, 75 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు.పద్మ విభూషణ్: ఎల్కే అద్వానీ (రాజకీయాలు), అమితాబ్ బచ్చన్ (కళలు), ప్రకాశ్ సింగ్ బాదల్ (రాజకీయాలు), డాక్టర్ డి.వీరేంద్ర హెగ్గడే (సామాజిక సేవ), దిలీప్ కుమార్ (కళలు), స్వామి రామభద్రాచార్య(ఆధ్యాత్మికం), ప్రొఫెసర్ రామస్వామి శ్రీనివాసన్ (సైన్స్), కొట్టాయన్ వేణుగోపాల్ (రాజకీయాలు), అల్ హుస్సేనీ అగాఖాన్ (వాణిజ్యం).తెలుగువారికి పద్మశ్రీ అవార్డులు: మిథాలీ రాజ్ (క్రీడలు), పీవీ సింధు(క్రీడలు), డాక్టర్ మంజుల అనగాని (వైద్యం), కోట శ్రీనివాసరావు (కళలు). వైద్యులు నోరి దత్తాత్రేయుడు, పిళ్లరిశెట్టి రఘురామ్. అరుంధతీ సుబ్రహ్మణ్యంకు కుశ్వంత్సింగ్ అవార్డు ప్రముఖ రచయిత కుశ్వంత్సింగ్ స్మారక అవార్డుకు రచయిత్రి అరుంధతీ సుబ్రహ్మణ్యం ఎంపికయ్యారు. రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన సాహితీ ఉత్సవాల్లో జనవరి 24న ఈ అవార్డును ప్రకటించారు. ఆమె రాసిన ‘వెన్ గాడ్ ఈజ్ ఏ ట్రావెలర్’కు పురస్కారం దక్కింది. తొలిసారిగా అందిస్తున్న ఈ అవార్డును ఇంగ్లిష్లో చేసిన రచనలకు, భారతీయ భాషల నుంచి ఇంగ్లిష్లోకి అనువదించే కవులకు అందజేస్తారు. రూ.2 లక్షల నగదును బహూకరిస్తారు. ఎన్ఎండీసీకు బంగారు నెమలి అవార్డు సామాజిక సేవలో మంచి పనితీరు కనపర్చినందుకుగాను 2014 సంవత్సరానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) విభాగంలో నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) బంగారు నెమలి అవార్డును గెలుచుకుంది. సీవీ ఆనంద్కు జాతీయ పురస్కారం సార్వత్రిక ఎన్నికల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించినందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్కు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) జాతీయ ప్రత్యేక అవార్డును జనవరి 21న ప్రకటించింది. ఓటర్లను మభ్యపెట్టకుండా నగదు రవాణాను అడ్డుకోవడం, ఎన్నికల ప్రచారం, పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించినందుకు అవార్డును ప్రకటించారు. రాష్ట్రీయం తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా కడియం శ్రీహరి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి తాటికొండ రాజయ్యను మంత్రివర్గం నుంచి జనవరి 25న తొలగించారు. ఆయన స్థానంలో వరంగల్ ఎంపీ కడియం శ్రీహరిని ఉపముఖ్యమంత్రిగా నియమించి, విద్యాశాఖను అప్పగించారు. గవర్నర్ నరసింహన్.. శ్రీహరితో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు.. విద్యాశాఖ మంత్రిగా ఉన్న జగదీశ్రెడ్డికి విద్యుత్ శాఖను కేటాయించారు. లక్ష్మారెడ్డికి వైద్య, ఆరోగ్య శాఖను అప్పగించారు. క్రీడలు సింగిల్స్ చాంప్స్గా సైనా, కశ్యప్ సయ్యద్ మోదీ స్మారక గ్రాండ్ప్రి గోల్డ్ టోర్నీలో సైనా నెహ్వాల్ మహిళల సింగిల్స్ టైటిల్ను సాధించింది. జనవరి 25న లక్నోలో జరిగిన ఫైనల్లో కరోలినా మారిన్ (స్పెయిన్)పై విజయం సాధించింది. 2009, 2014లోనూ సైనాకు ఈ టైటిల్ లభించింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 15వ ర్యాంకర్ పారుపల్లి కశ్యప్ కిడాంబి శ్రీకాంత్పై గెలిచాడు. 2012లోనూ కశ్యప్ ఈ టైటిల్ నెగ్గాడు. -
25 నుంచి భారత్లో ఒబామా పర్యటన
-
25 నుంచి భారత్లో ఒబామా పర్యటన
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ నెల 25 నుంచి 27 వరకు భారత్లో పర్యటించనున్నారు. భారత గణతంత్ర వేడుకలకు ఒబామా ముఖ్యఅతిథిగా హాజరవుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో జరిగే సీఈఓల సమావేశంలో ఓబామా పాల్గొంటారు. ఈ పర్యటనలో ఆయన ఆగ్రాలోని తాజ్మహల్ను కూడా సందర్శిస్తారు. ఒబామా పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య రక్షణ రంగ ఒప్పందాలు, పౌర అణు ఇంధన ఒప్పందంపై పురోగతి సాధించేందుకు కృషి జరుగుతుందని నిన్న గాంధీనగర్లో అమెరికా విదేశాంగ మంత్రి జాన్కెర్రీ చెప్పారు. గణతంత్ర వేడుకలకు ఒబామా ముఖ్యఅతిథిగా హాజరవుతున్నందున నగర పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతా విధుల్లో అమెరికా ఏజెన్సీలు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు, సైన్యం, పారామిలిటరీ బలగాలతోపాటు ఇరుగుపొరుగు రాష్ట్రాలకు చెందిన పోలీసు బలగాలు కూడా పాలుపంచుకుంటున్నట్లు పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు. ఉగ్రవాదులు ఏక్షణంలోనైనా దాడికి పాల్పడే అవకాశముందనే గూఢచార విభాగం హెచ్చరికల నేపథ్యంలో పోలీసు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్సు టెర్మినళ్లు, మెట్రో రైల్వేస్టేషన్లు, మాల్స్ వంటి కీలక ప్రదేశాలలో ప్రత్యేక బృందాలు మోహరిస్తాయి. అమెరికా అధ్యక్షుడి హోదాలో రెండో పర్యాయం భారత పర్యటనకు వస్తున్న తొలి అధ్యక్షుడు ఒబామాయే కావటం విశేషం.