breaking news
opinion change
-
రజనీతో అభిప్రాయభేదాలు: కమల్
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత సహ నటుడు రజనీకాంత్తో తనకు అభిప్రాయభేదాలు ఏర్పడ్డాయని మక్కల్ నీది మయ్యం పార్టీ చీఫ్ కమల్హాసన్ చెప్పారు. సినిమాల్లో ఉన్నప్పుడు రజనీతో తనకున్న స్నేహానికి రాజకీయాలు చెక్ పెట్టాయని స్పష్టం చేశారు. ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ మాట్లాడుతూ.. ‘రజనీ రాజకీయాలతో నా రాజకీయ పయనాన్ని పోల్చిచూడవద్దు. రజనీ ఆధ్యాత్మిక రాజకీయాలపై నాకు నమ్మకం లేదు. నాకు ఎలాంటి మతాలు లేవు. అన్ని మతాలు సమ్మతమే. రజనీది ఆధ్యాత్మిక పార్టీ. నా పార్టీది లౌకిక సిద్ధాంతం.. సినిమాల సమయంలో కొనసాగిన స్నేహాన్ని రాజకీయాల్లో ఆశించలేం. రాజకీయాల్లో మా ఇద్దరి మధ్య నెలకొన్న అభిప్రాయభేదాలను తలచుకుంటే బాధగా ఉంది. ఒకరినొకరం విమర్శించుకోకుండా గౌరవప్రదమైన రాజకీయాలు సాగించాలని ఇద్దరం కోరుకుంటున్నాం’ అని తెలిపారు. మరోవైపు హిమాలయాల పర్యటనలో ఉన్న రజనీకాంత్ సంపూర్ణ అరోగ్య పరీక్షల నిమిత్తం అక్కడి నుంచి నేరుగా అమెరికా వెళ్లనున్నారు. -
అందరికోసం పనిచేస్తే కేంద్రానికి మద్దతు
కోల్కతా: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు పట్ల పశ్చిమ బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ స్వరం మారింది. శారదా స్కాంలో తృణమూల్ నేతలనూ సీబీఐ అరెస్టు చేయడంతో పార్టీ ఇరుకున పడిన నేపథ్యంలో సమాజంలోని అన్ని వర్గాల ప్రయోజనాల కోసం నిర్మాణాత్మకంగా కృషి చేస్తే మోదీ సర్కారుకు పూర్తి మద్దతునిచ్చేందుకు తృణమూల్ సిద్ధంగా ఉండేదని మమత అన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత దినం సందర్భంగా శనివారమిక్కడ వివిధ మతాల నేతల ఆధ్వర్యంలో జరిగిన మత సామరస్య ర్యాలీలో పాల్గొన్న ఆమె ఈ మేరకు మాట్లాడారు. ప్రజలను మత ప్రాతిపదికన విభజిస్తూ రాజకీయాలు చేయడాన్ని తాము అంగీకరించబోమని, పాలనను, రాజకీయాలను మిళితం చేయరాదన్నారు. ఇప్పటికైనా అన్ని వర్గాల సంక్షేమం కోసం నిర్మాణాత్మకంగా, వాస్తవికంగా పాలన సాగిస్తే కేంద్రానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని మమత వ్యాఖ్యానించారు. సమాఖ్య వ్యవస్థను గౌరవించండి: బీజేపీ మోదీ ఆదివారం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల సమావేశానికి సమాఖ్య వ్యవస్థను గౌరవించి హాజరు కావాలని మమతకు బీజేపీ విజ్ఞప్తి చేసింది. బెంగాల్ అభివృద్ధిపై కేంద్రం వివక్ష చూపిస్తోందన్న ఆరోపణలను సమావేశంలో ప్రస్తావించవచ్చని కూడా సూచించినా, సమావేశానికి రాకూడదని ఆమె నిర్ణయించడాన్ని తప్పుబట్టింది. పార్టీ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ మాట్లాడుతూ.. రాజకీయ విభేదాలను మమత మరిచిపోవాలని సూచించారు. అన్ని రాష్ట్రాల అభివృద్ధితో దేశం మొత్తాన్నీ ప్రగతిపథంలోకి తీసుకెళ్లాలన్నదే మోదీ ప్రాధాన్యమన్నారు.