breaking news
notice to centre
-
విమాన చార్జీల అడ్డ్డగోలు పెంపు
న్యూఢిల్లీ: దేశంలో ప్రైవేట్ విమానయాన సంస్థలు ఆకస్మికంగా ప్రయాణ ఛార్జీలను, ఇతర రుసుములను పెంచకుండా నిబంధనలు పాటించేలా చూడాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసు జారీ చేసింది. సామాజిక కార్యకర్త ఎస్.లక్ష్మీనారాయణన్ వేసిన పిటిషన్పై సోమవారం జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎకానమీ తరగతి ప్రయాణికులకు 25 కిలోల వరకు లగేజీ ఉచిత సౌకర్యం ఉండగా, దానిని ప్రైవేట్ విమానయాన సంస్థలు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా దీనిని 15 కిలోలకు తగ్గించాయని పేర్కొన్నారు.అదేవిధంగా, విమాన ప్రయాణ చార్జీలు, అనుబంధ ఫీజులను నియంత్రించే వ్యవస్థంటూ ఏదీ లేకుండా పోయిందన్నారు. ఇదే అదనుగా విమాన యాన సంస్థలు ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచుతు న్నాయని, ముఖ్యంగా పండగలు, అననుకూల వాతావరణ పరిస్థితుల్లో మరీ హద్దుమీరు తున్నాయన్నారు. పౌర విమానయాన రంగంలో ప్రయాణికులకు భద్రతతోపాటు పారదర్శకత ఉండేలా సమర్థమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి, డీజీసీఏకి, ఎయిర్పోర్టు నియంత్రణ ప్రాథికార సంస్థకు నోటీసులు జారీ చేసి..తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. -
‘ట్రిపుల్ తలాక్’ చట్టాన్ని పరిశీలిస్తాం!
న్యూఢిల్లీ: ముస్లింలలో తక్షణ ట్రిపుల్ తలాక్ను శిక్షార్హమైన నేరంగా పరిగణించి, మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా కేంద్రం తెచ్చిన చట్టం చెల్లుబాటును పరిశీలించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకరించింది. దీనికి సంబంధించి దాఖలైన పిటిషన్ల మేరకు కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. ట్రిపుల్ తలాక్కు సంబంధించి ‘ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) చట్టం–2019’ని ఇటీవలి పార్లమెంటు సమావేశాల్లో ఆమోదించటం తెలిసిందే. ఈ చట్టం రాజ్యాంగబద్ధతను పరిశీలించాలంటూ వచ్చిన నాలుగు పిటిషన్లపై జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అజయ్ రస్తోగీల ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ వాదిస్తూ, ట్రిపుల్ తలాక్ను శిక్షార్హమైన నేరంగా మార్చడం, మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించడం పట్ల తాము ఆందోళనతో ఉన్నామన్నారు. ట్రిపుల్ తలాక్ చెల్లదని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు చెప్పినందున ఇప్పుడు శిక్షార్హమైన నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదని ఆయన వాదించారు. బాధిత మహిళ వాదన విన్నాకనే బెయిలు మంజూరు చేయాలన్న షరతు కూడా సరికాదని ఖుర్షీద్ తెలిపారు. ‘ట్రిపుల్ తలాక్ చెల్లదని కోర్టు గతంలోనే చెప్పినందున ఇప్పుడు ఆ పద్ధతే లేదు. మరి వారు దేనిని నేరంగా పరిగణిస్తారు’ అని ఆయన ప్రశ్నించారు. దీనికి కోర్టు స్పందిస్తూ మరి ఎవరైనా ఇప్పటికీ ట్రిపుల్ తలాక్ పద్ధతిలో విడాకులిస్తే ఏం చేయాలనీ, దీనికి పరిష్కారం ఏంటని ప్రశ్నించింది. ఖుర్షీద్ సమాధానమిస్తూ ట్రిపుల్ తలాక్ను కోర్టు ఎప్పుడో రద్దు చేసిందని మళ్లీ చెబుతూ, చట్టంలోని వివిధ ఇతర అంశాలను పరిశీలించాలని కోరారు. -
పురుషులు రేప్కు గురయితే..?
సాక్షి, న్యూఢిల్లీ: పురుషులు అత్యాచారానికి గురైతే ఫిర్యాదు చేయడానికి వెనుకాడే పరిస్థితి ఉందని ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఐపీసీ 375, 376 సెక్షన్లు పురుషుల పట్ల వివక్ష చూపుతున్నాయని, మహిళలను ఇవి అపరాధులుగా చేర్చడం లేదని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ సి హరిశంకర్ నేతృత్వంలోని ఢిల్లీ హైకోర్టు బెంచ్ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ప్రస్తుత చట్ట నిబంధనలు మహిళను అత్యాచార బాధితురాలిగా, పురుషుడిని కేవలం నిందితుడిగా గుర్తిస్తున్నాయని.. లైంగిక హింస నేపథ్యంలో జెండర్ ఆధారంగా నేరాన్ని ఎలా అర్థం చేసుకుంటారని పిటిషనర్ సంజీవ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. పితృస్వామ్య సమాజంలో పురుషులు తమపై జరిగే లైంగిక దాడులపై నోరు మెదపలేకపోతున్నారని, మగాళ్లపై అత్యాచార ఘటనలు చాలా తక్కువే అయినా వాటిని విస్మరించలేమని అన్నారు. పురుషులు ఎవరైనా తమపై అత్యాచారం జరిగిందనే ఫిర్యాదు చేస్తే అతడిని సమాజం నిజమైన మగాడుగా గుర్తించదని వాపోయారు. రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వ హక్కు, లింగ ఆధారంగా వివక్షను వ్యతిరేకించే ఆర్టికల్ 15 ప్రకారం మహిళలకు ఉండే హక్కులే పురుషులకూ వర్తించాలన్నారు. కాగా, ఈ పిటిషన్పై న్యాయస్థానం అక్టోబర్ 23న విచారణ జరపనుంది. -
ఏపీ,తెలంగాణ కేడర్ను వేర్వేరుగా విభజించాలి
-
విభజనపై కేంద్రానికి సుప్రీం నోటీసులు
రాష్ట్ర విభజన అంశంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వైఎస్ఆర్సీపీకి చెందిన ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి సహా మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లను విచారణకు స్వీకరించిన సుప్రీం ధర్మాసనం, శుక్రవారం నుంచి విచారణ ప్రారంభించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లను విచారిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ ఏర్పాటుపై తాము స్టే ఇవ్వలేమని ఈ సందర్భంగా ధర్మాసనం తెలిపింది. ఈ కేసును సుప్రీం రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలని నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేవరకు దాఖలైన పిటిషన్లను అప్పటికి సమయం పరిపక్వం కాలేదంటూ సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే.


