breaking news
Nirupama
-
మయన్మార్లో ఎన్నికల తంతు
ఆంగ్ సాన్ సూకీ ఎన్నికల విజయాన్ని మయన్మార్ సైన్యం దుర్మార్గంగా చేజిక్కించుకుని దాదాపు ఐదేళ్లు గడిచిపోయాయి. ఇప్పుడా సైనిక ప్రభుత్వం ఎన్నికలు నిర్వ హించ తలపెట్టింది. ఇవి డిసెంబర్ 28 నుంచి 2026 జనవరి వరకు జరుగుతాయి. ఈ ఎన్నికల ద్వారా తమ పాల నకు చట్టబద్ధత సాధించాలని సైన్యం విఫలయత్నం చేస్తోంది. కానీ దేశంలో ఇప్పటికే నెలకొని ఉన్న అరాచక పరిస్థితి ఈ ఎన్నికలతో మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది.ప్రధాన రాజకీయ పార్టీ ఎన్ఎల్డీ (నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ) సహా అనేక పక్షాలు సైనిక పాలకులు ప్రకటించిన ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. మయన్మార్ ప్రజాస్వామ్య ఆకాంక్షలకు ప్రతిరూప మైన సూకీని జైల్లో పెట్టిన సైనిక ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా ఆమెపై అనర్హత వేటు వేసింది. అందుకు నిరసన ప్రకటిస్తూ, కొత్త చట్టం కింద రాజకీయ పార్టీగా నమోదయ్యేందుకు ఆమె పార్టీ ఎన్ఎల్డీ నిరాకరించింది. దీంతో సైనిక పాలకులు ఆ పార్టీని రద్దు చేశారు. 2020 ఎన్నికల్లో సూకీ నేతృత్వంలోని ఎన్ఎల్డీ ఘన విజయం సాధించింది. సైనిక ప్రభుత్వం 2008లో ప్రకటించిన రాజ్యాంగం ప్రకారం, జాతీయ పార్లమెంటు ఉభయసభల్లోని 476 స్థానాల్లో 25 శాతం సీట్లు సైన్యానికి రిజర్వు అయ్యాయి. సైన్యం అనుకూల జాతీయవాద పార్టీ యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్ మెంట్ పార్టీ (యూఎస్డీపీ) ఆ ఎన్నికల్లో చావుదెబ్బ దెబ్బతింది. అయిదేళ్ల క్రితం ఆరంభమైన ప్రజాస్వామ్య పునరుద్ధరణ ప్రక్రియను పూర్తి చేస్తాననీ, అందుకు వీలుగా రాజ్యాంగాన్ని సంస్క రిస్తాననీ 2020 ఎన్నికల్లో సూకీ దేశ ప్రజలకు వాగ్దానం చేశారు. కాబట్టి, పగ్గాలు చేపట్టిన వెంటనే సూకీ సైన్యం తోక కత్తిరిస్తారని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న సమయంలో సైన్యం తిరుగుబాటు చేసింది. అధికారం హస్తగతం చేసుకుంది.అదుపు సాధించని సైన్యంవేల మంది ప్రజాస్వామ్య అనుకూల ఆందోళనకారులను సైనిక ప్రభుత్వం జైళ్లలో పెట్టింది. సొంత పౌరుల మీద బాంబులు కురిపించింది. గ్రామాలకు గ్రామాలను తగలబెట్టింది. సూకీని ఎక్కడ నిర్బంధించారో కూడా కచ్చితంగా తెలియదు. ఇంత చేసి కూడా సైన్యం దేశం మీద పట్టు సాధించలేకపోయింది. అనేక ప్రాంతాల్లో ప్రజాస్వామ్య అనుకూల పౌరసేనలు, సాయుధ పోరాట సంస్థలు సైనికులతో పోరు సలుపుతున్నాయి. ఆ ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యపడేది కాదు.‘స్ప్రింగ్ రివల్యూషన్’ పేరిట మయన్మార్లో ఉవ్వెత్తున ఎగసిన ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమం సైన్యాన్ని పూర్తిగా ధిక్కరించాలని నిర్ణయించింది. ‘నేషనల్ యూనిటీ గవర్నమెంట్’ (ఎన్యూజీ)కి అనుబంధంగా పనిచేసే ‘పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సెస్’ వంటి సాయుధ ప్రతిఘటన సంస్థలు ఇందులో భాగం అయ్యాయి. ఎన్యుజి తానే దేశానికి నిజమైన ప్రభుత్వం అని ప్రకటించుకుంది. అజ్ఞాతం నుంచో ప్రవాసం నుంచో పనిచేస్తున్న నాయకులు దీన్ని నడుపుతున్నారు. ఏమైనప్పటికీ, మెజారిటీ స్థానాల్లో సైన్యం అనుకూల యూఎస్డీపీ నెగ్గుతుంది. ఇది సైనిక పాలకులకు మద్దతు ఇస్తుంది.భారత్కు భద్రతా సమస్యభారత్ ఈ ఎన్నికల కోసం ఈవీఎంలు సమకూర్చినట్లు వార్తలు వచ్చాయి. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విష యాన్ని ప్రస్తావించకుండా ఒక ప్రకటన చేసింది: ‘ప్రజాస్వామ్యం దిశగా మయన్మార్ పరివర్తనకు ఇండియా మద్దతు ఇస్తుంది. ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతకు అన్ని రాజకీయ వర్గాల భాగస్వామ్యం కీలకం. మయన్మార్లో శాంతి, చర్చలు, సాధారణ పరిస్థితుల పున రుద్ధరణకు తోడ్పడే అన్ని యత్నాలకూ ఇండియా ఇకమీదట కూడా మద్దతిస్తుంది’.చాలా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పాల్గొనడం లేదనీ, ఇవి స్వేచ్ఛగా, సమ్మిళితంగా జరిగే ఎన్నికలు కావనీ ఇండియాకు తెలుసు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించక పోయినా, కనీసం అక్కడి హింసాకాండకు ఒక రాజకీయ పరిష్కారం చూపించగలిగినా చాలు. నాలుగు ఈశాన్య రాష్ట్రాల వెంబడి మయన్మార్తో ఇండియాకు 1,643 కి.మీ. సరిహద్దు రేఖ ఉంది. ఆ దేశంలో ఏం జరిగినా దాని ప్రభావం మన మీద పడుతుంది.సైనిక తిరుగుబాటు అనంతరం వ్యతిరేక వర్గానికి చెందిన వేల మంది సైనికులు శరణార్థులుగా మిజోరం రాష్ట్రంలోకి పారిపోయి వచ్చారు. చిన్ రాష్ట్రం మీద సైనిక పాలకులు బాంబులు కురిపించి నప్పుడు మిజోరంలోని సరిహద్దు గ్రామీణులు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీయవలసి వచ్చింది. అంతేకాదు, ప్రజాస్వామ్య అను కూల గ్రూపులతో పోరాడేందుకు మయన్మార్ సైన్యం సగాయింగ్ ప్రాంతం (మయన్మార్) లోని ఈశాన్య రాష్ట్రాల తిరుగుబాటు గ్రూపులతో కలసి పనిచేస్తోంది. ఇది ఇండియాకు భద్రత సమస్య. ఇండియా–మయన్మార్–థాయిలాండ్ త్రైపాక్షిక రహదారి ప్రాజెక్టు కూడా మయన్మార్ అలజడుల కారణంగా అసంపూర్తిగా మిగిలి పోయింది.పాలు పోని ఇండియాసూటిగా చెప్పాలంటే, మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమ కారుల్లో మన పట్ల ఉన్న గౌరవాభిమానాలను పణంగా పెట్టి క్రూరు లైన ఆ దేశ సైనిక పాలకులతో ఇండియా సంబంధాలు నెరపింది. తద్వారా ఎంత ప్రయోజనం పొందగలిగింది? మణిపూర్ అశాంతికి మయన్మార్ చొరబాటుదారులే కారణమని నిందిస్తూ కూడా ఇలాంటి విధానం ఎందుకు అనుసరిస్తోంది? తాజాగా, మయన్మార్ సరిహద్దుల వెంబడి ఇండియా దృఢమైన కంచె నిర్మిస్తోంది. ఒకప్పుడు అఫ్గానిస్తాన్లో డ్యూరాండ్ లైన్ వెంబడి కంచె నిర్మించడం ద్వారా వేలాది కుటుంబాలను, గ్రామాలను, తెగలను వేరు చేసిన బ్రిటిష్ పాలకుల తప్పిదాన్నే ఇండియా పునరావృతం చేస్తోంది. చైనా మాత్రం తన సొంత మైనింగ్, మౌలిక సదుపాయాల ప్రాజె క్టులను కాపాడుకునేందుకు తెగల ప్రజలను ఉపయోగించుకుంది. అందుకు ప్రతిగా సైనిక పాలకులకు ఆయుధాలను సమకూర్చింది. ఎట్టకేలకు, ఇండియా ఇప్పుడు మేల్కొంది. ప్రజాస్యామ్య అను కూల ఉద్యమ గ్రూపులతో మంతనాలు జరుపుతోంది. దేశం నుంచి ఆర్భాటం లేకుండా పనిచేసుకోడానికి వారికి అనుమతించింది. ఎన్ని కల ఫలితాలు ఎలా ఉంటాయనేది తెలిసిన విషయమే. పాకిస్తాన్ అధ్యక్షుడు అయ్యేందుకు జనరల్ పర్వేజ్ ముషారఫ్ నిర్వహించిన రెఫరెండం లాంటిదే ఈ ఎన్నికల తంతు. ఇండియాకు ఎదురవు తున్న సవాళ్లు, ఆ దేశంలో పెరుగుతున్న చైనా ప్రభావం ఇలాగే కొన సాగుతాయి. ‘యాక్ట్ ఈస్ట్’ అనేది కలగానే మిగిలిపోనుంది.నిరుపమా సుబ్రమణియన్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఇలాంటి ఎన్నికలతో అనిశ్చితి పోతుందా?
వచ్చే ఏడాది ఏప్రిల్ మొదటి పక్షంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత ముహమ్మద్ యూనస్ ప్రకటించారు. అసలు ఆయనకు అధికారాన్ని ప్రజా ప్రతినిధులకు అప్పగించే ఉద్దేశం ఉందా అనీ ఆయన విమర్శకులు, ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్న తరుణంలో, ఎన్నికలను ప్రకటించడం ద్వారా వారి నోటికి తాళం వేసే ప్రయత్నం చేశారు.బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని బలవంతంగా గద్దెదింపి పది నెలలు గడుస్తున్నా, తాత్కాలిక ప్రభుత్వం దేశంలో కొద్ది మేరకైనా శాంతి భద్రతలను పునరుద్ధరించలేకపోయింది. యూనస్ నిర్ణయాల పట్ల బంగ్లాదేశ్ సైన్యం బాహాటంగానే అసంతృప్తిని వ్యక్తపరచింది. ఉదాహరణకు, ఐక్యరాజ్య సమితి ప్రోద్బలంతో,బంగ్లాదేశ్ నుంచి మయన్మార్లోని రాఖినే రాష్ట్రం వరకు ‘మానవీయ కారిడార్’ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ విషయమై తమను సంప్రదించనేలేదని సైన్యం ప్రకటించింది. ‘‘అన్ని పార్టీలను కలుపుకొనిపోతూ, వీలైనంత త్వరగా’’ ఎన్నికలు నిర్వహించాలని సైన్యం హితవు పలికింది. తాము లేనిదే దేశానికి వేరే దిక్కు లేదని భావించే నాయకులు ఏనాటి నుంచో అనుసరిస్తూ వస్తున్న ఎత్తుగడనే యూనస్ కూడా ఆశ్రయించారు. రాజీనామా చేస్తానని యూనస్ బెదిరించడం, ఊహించినట్లుగానే ఆయనను పదవిలో కొనసాగమని కోరడం జరిగిపోయింది.ఈ ఏడాదిలో జరగాల్సిందే!అయితే, దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరతను కానీ, యూనస్ ఉద్దేశాలపై ఉన్న సందేహాలను కానీ ఏప్రిల్లో ఎన్నికలు నిర్వహి స్తామన్న ప్రకటన తొలగించలేకపోయింది. అవామీ లీగ్ తర్వాత, దేశంలో రెండవ అతి పెద్ద పార్టీ అయిన బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్పీ) కూడా ఎన్నికలకు అంత వ్యవధి తీసుకోవడాన్ని వ్యతిరేకించింది. ఈ ఏడాది ముగిసేలోగా ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ను పునరుద్ఘాటించింది. ఈ విషయంలో అదీ, సైన్యం ఒకే వైపున నిలిచాయి. పదేళ్ళ పైచిలుకుగా బీఎన్పీ వేధింపులకు, అణచివేతకు గురైంది. హసీనా ప్రభుత్వంపై ఆగ్రహావేశాలతో నిండిన దేశంలోని ప్రస్తుత సంక్షుభిత రాజకీయ వాతావరణంలో, ఎన్నికల్లో అతి పెద్ద విజయాన్ని చేజిక్కించుకోవాలని బీఎన్పీ ఉవ్విళ్ళూరుతోంది. ఎన్నికలను వచ్చే ఏడాది నిర్వహించడానికి యూనస్ ఒక సాకు చూపుతున్నారు. పదవిని చేపట్టినపుడు తాను మూడు వాగ్దానాలు చేశాననీ, జాతీయ ఏకాభిప్రాయ సాధన ప్రక్రియ ద్వారా రాజ్యాంగ, ఎన్నికల, ఇతర సంస్థాపరమైన సంస్కరణలు తీసుకొస్తానని అన్నా ననీ, వాటిని నెరవేర్చవలసి ఉందనీ ఆయన చెబుతున్నారు. ఆ తర్వాతనే, ఎన్నికలు అన్నది ఆయన అభిప్రాయంగా ఉంది. బీటలువారిన రాజకీయ, పాలనా, న్యాయ వ్యవస్థలకు కాయ కల్ప చికిత్స చేస్తేనే ఎన్నికలు సత్ఫలితాలు ఇవ్వగలవని యూనస్ వాదన. లేకపోతే గతంలో మాదిరిగానే, ఒకే పార్టీ పాలన కిందకు దేశం వస్తుందనీ, హసీనా మూడు విడతల పాలనలో చూసిన నిరంకుశ పార్శా్వన్నే తిరిగి చూడవలసి ఉంటుందనీ అంటున్నారు. ఈ రకమైన సంస్కరణలను 2008 ఎన్నికలకు ముందే తీసుకొచ్చి ఉంటే, నేటి రక్తపాతాన్ని, రాజకీయ కల్లోల పరిస్థితులను నివారించగలిగి ఉండేవారమనే అభిప్రాయం దేశంలోని కొన్ని వర్గాల్లో ఉంది. అవామీని దూరం చేయకూడదు!ప్రతి పార్శా్వన్నీ అధ్యయనం చేసి మార్పులను సూచించేందుకు యూనస్ ఆరు కమిషన్లను ఏర్పాటు చేశారు. అవి నివేదికలను కూడా సమర్పించాయి. రాజకీయ పార్టీల ప్రతినిధులతో కూడిన ‘జాతీయ ఏకాభిప్రాయ కమిషన్’ సంస్కరణలపై సర్వతోముఖ అంగీకారాన్ని కుదిర్చే పనిలో ఉంది. కానీ, అటువంటి ఏకాభిప్రాయం కనుచూపు మేరలో కనబడకపోవడంలో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. బీఎన్పీకి అధికారం పదేళ్ళుగా అందని మానిపండుగానే ఉన్న ప్పటికీ, దాని నాయకురాలు ఖలీదా జియా ఏళ్ళ తరబడి జైల్లో మగ్గి నప్పటికీ దాని రాజకీయ చతురత ఏమాత్రం మొక్కవోలేదు. సంస్క రణలపై ఏకాభిప్రాయం కొరవడటాన్ని సాకుగా చూపి ఎన్నికలను వాయిదా వేయకూడదని అది పేర్కొంది. ఎన్నికలను వాయిదా వేస్తూ పోవడం వల్ల దేశంలో అల్లకల్లోలం తీవ్రరూపం దాల్చవచ్చనే భయాలున్నాయి. పరిస్థితులు మరింత దిగజారి ఎన్నికల నిర్వహణే అసాధ్యంగా మారే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. అవామీ లీగ్ను నిషేధించి, ఎన్నికల్లో పాల్గొనడానికి లేకుండా చేయడం వల్ల సంస్కరణలు, ఏకాభిప్రాయ సాధనకు సంబంధించిన మాటలంతా శుష్క వాగ్దానాలుగానే కనిపిస్తున్నాయి. హసీనా, ఆమె ఆంతరంగిక పరివారంలోని అనేక మంది నాయకులు ఢిల్లీలో అజ్ఞాత జీవితం గడుపుతూండటంతో ఆమె పార్టీ కార్యకర్తలు, మద్దతు దారులు స్వదేశంలో లక్ష్యంగా మారుతున్నారు. అవామీ లీగ్ బక్క చిక్కిన స్థితిలో ఉన్నప్పటికీ, అది ఎన్నికల్లో పాల్గొనకపోతే, బంగ్లా దేశ్కు చెందిన అనేక సమస్యలకు ఎటువంటి పరిష్కారాలను ముందుకు తెచ్చినా అవి నిష్ప్రయోజనమైనవే అవుతాయి. ఒక రాజ కీయ పార్టీని ఎన్నికలకు దూరంగా ఉంచడం వల్ల రాజకీయ, సామా జిక విభేదాలు మరింత పెరుగుతాయి. హసీనా చేసిన అనేక తప్పిదాలు పునరావృత్తమయ్యేలా ఇది తిరిగి బాటలు పరచడమే అవుతుంది.బలం పెంచుకుంటున్న జమాత్!మరోవైపు, దేశ విముక్తికి ముందు నెలల్లో, పాకిస్తాన్ సైన్యంతో చేతులు కలిపి అత్యాచారాలకు ఒడిగట్టిన జమాత్–ఏ–ఇస్లామీకి జవ జీవాలు నింపే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఒక రాజకీయ పార్టీగా జమాత్కున్న రిజిస్ట్రేషన్ గతంలో రద్దయింది. జాతీయ రాజ్యాంగంలోని లౌకిక సూత్రాలకు ఆ పార్టీ నియమావళి విరుద్ధంగా ఉందంటూ హసీనా కనుసన్నల్లోని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో జమాత్ పార్టీ 2013లో జరిగిన ఎన్నికల్లో పాల్గొనలేకపోయింది. హసీనా ఏర్పాటు చేసిన ‘ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు’ జమాత్ నాయకుడు అజహరుల్ ఇస్లామ్ను విచారించి, దోషిగా ప్రకటిస్తే, ప్రభుత్వం గత నెలలో ఆయనను విడుదల చేసింది. అప్పట్లో జమాత్ నాయకులు కోర్టు విచారణలను పక్షపాతంతో కూడినవిగా, సందేహాస్పదమైనవిగా ఆక్రోశించారు. వైచిత్రి ఏమిటంటే, బంగ్లాదేశ్ను సరైన బాటలో పెట్టాలని కోరుకుంటున్నట్లు చెబుతున్న యూనస్ ప్రభుత్వం... అవినీతి ఆరోపణలపైన, ‘మాన వాళిపై చేసిన నేరాలకు’గాను హసీనాను విచారించడానికి అదే కోర్టును వినియోగించుకుంటోంది. ఆమె లేకుండానే చేసే ఆ విచారణ ఫలితం ఎలా ఉండబోతోందో ముందే తెలుసు. హసీనాను అప్పగించాలనే బంగ్లాదేశ్ డిమాండ్కు భారత్ అంగీకరించకపోవచ్చు. ఈ అంశం రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత కుంగదీస్తుంది. అవామీ లీగ్ కూడా ఎన్నికల్లో పాలుపంచుకునేట్లు ప్రభుత్వంపై సైన్యం ఒత్తిడి తేగలదన్నదే ఆ పార్టీకి ఆశాకిరణంలా ఉంది. బీఎన్పీ మాజీ మిత్రపక్షమైన జమాత్ ఈసారి సొంతంగా ఎక్కువ విజయాలు సాధించగలమని ధీమాతో ఉంది. ఎన్నికల నిర్వహణను అది కూడా గాఢంగా కోరుకుంటున్నప్పటికీ, దానికి వ్యవధి తీసుకున్నా ఫరవాలేదని భావిస్తోంది. ఎన్నికలను 2026 మధ్యలో నిర్వహించాలని జమాత్ చేస్తున్న డిమాండ్కు యూనస్ నిర్ణయించిన ఏప్రిల్ ముహూర్తం దగ్గరగానే ఉంది. ఈలోగా క్షేత్ర స్థాయిలో తన పార్టీని పటిష్ఠపరచుకోవడానికి ఆ కాలం కలిసొస్తుంది. అవామీ లీగ్ స్థాపకుడు, జాతిపిత షేక్ ముజిబుర్ రహమాన్ ఇంటిని లూటీ చేసి నిప్పుపెట్టి ఉండవచ్చుగాక. కరెన్సీ నోట్ల నుంచి ఆయన ఫోటోను తొలగించి ఉండవచ్చుగాక. కానీ, బంగ్లాదేశ్ 1971 మార్చిలో స్వాతంత్య్ర ప్రకటన చేసుకున్న తర్వాత సాగిన హత్యలు, అత్యాచారాల జ్ఞాపకాలను ప్రజల స్మృతిపథం నుంచి తుడిచేయడం అంత తేలిక కాదు. ‘పార్టీ సభ్యుల గత చర్యలకు’ జమాత్ అధినేత షఫీకుర్ రహమాన్ క్షమాపణ కోరినంతమాత్రాన సరిపోదు. బంగ్లా దేశ్తో సంబంధాలను ‘సాధారణీకరించుకోవాలని’ పాకిస్తాన్ పెట్టు కున్న లక్ష్యం కూడా అందుకే నెరవేరకపోవచ్చు.నిరుపమా సుబ్రమణియన్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
వైభవంగా శివన్న తనయ వివాహం
శాండల్వుడ్ నటుడు శివరాజ్కుమార్ కుమార్తె డాక్టర్ నిరుపమా వివాహం సోమవారం బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్లో ఘనంగా జరిగింది. బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్కు చెందిన ఎల్.మంజేగౌడ, పార్వతి దంపతుల ద్వితీయ కుమారుడు డాక్టర్ దిలీప్ కుమార్తో డాక్టర్ నిరుపమా ఏడడుగులు నడిచి దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జునతో పాటు తమిళనటుడు ప్రభు, శాండల్వుడ్ నటులు దర్శన్, కిచ్చా సుదీప్, రవిచంద్రన్, గణేష్, సీనియర్ నటీమణులు జయంతి, అంబికా, లీలావతి, భారతి, జయమాలా తదితరులు హాజరయ్యారు. రాజకీయ ప్రముఖులు ఎస్.ఎంృకష్ణ, రాష్ట్ర మంత్రి ఆర్.వి.దేశ్పాండే, తమిళనాడుకు చెందిన స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు. సోమవారం సాయంత్రం త్రిపుర వాసినిలో నిర్వహించిన రిసెప్షన్ కార్యక్రమానికి టాలీవుడ్కు చెందిన ప్రముఖ దర్శకుడు రాజమౌళి హాజరుకావడం విశేషం. - సాక్షి, బెంగళూరు


